Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలమైన భారత్తో బలహీన విండీస్ ఢీ
- గువహతిలో నేడు తొలి వన్డే పోరు
- రిషబ్ పంత్ అరంగేట్రానికి రంగం సిద్ధం
- మ.1.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
టెస్టు ఫార్మాట్లో కరీబియన్ల ప్రమాణాలు తగ్గిపోయినా, పరిమిత ఓవర్ల క్రికెట్లో విండీస్ ఇప్పటికే భీకర జట్టే. కానీ కరీబియన్ బృందంలో ప్రమాదకర క్రిస్ గేల్, విధ్వంసక బ్రావో బ్రదర్స్, హంటింగ్ స్పిన్నర్ సునీల్ నరైన్, ఆల్రౌండర్ అండ్రూ రస్సెల్ కనిపించటం లేదు. మ్యాచ్ విన్నర్లు లేని విండీస్ వన్డే సిరీస్లోనూ అండర్డాగ్గా బరిలోకి దిగుతోంది. ఫార్మాట్ మారినా 'అసమానుల పోరాటం' కొనసాగుతోంది!. రిషబ్ పంత్ అరంగేట్రానికి రంగం సిద్ధమైన వేళ గువహతిలో భారీ విజయంపై కోహ్లిసేన కన్నేసింది. విండీస్తో ఐదు వన్డేల సిరీస్లో తొలి పోరు నేడే.
గువహతి : టెస్టుల్లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్, ఇప్పుడు వన్డేల్లోనైనా కోహ్లిసేనకు సవాల్ విసరాలని ఎదురుచూస్తోంది. స్టార్ ఆటగాళ్లు దూరం కావటంతో మైదానంలో తలపడేందుకు ముందే కరీబియన్ జట్టు కాస్త ఒత్తిడిలో కూరుకుపోయింది. యువ సేనతో పోరాడేందుకు జేసన్ హోల్డర్ సిద్ధమయ్యాడు. మరో వైపు భీకర ఫామ్లో ఉన్న టీమ్ ఇండియా వన్డే సిరీస్ క్లీన్స్వీప్ కన్నేసి సమరానికి సై అంటోంది. బ్యాట్తో, బంతితో సహా ఫీల్డింగ్లోనూ మెరుగ్గా కనిపిస్తోన్న టీమ్ ఇండియా ఆసియా కప్ జోరు కొనసాగించాలని చూస్తోంది. 2019 ప్రపంచకప్ ముంగిట మిడిల్ ఆర్డర్ సమస్యలను సరిదిద్దుకునేందుకు కోహ్లిసేన స్వల్ప అవకాశామాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విండీస్తో వన్డే సిరీస్ భారత్కు సైతం కీలకం. తొలి వన్డే ఈశాన్య రాష్ట్రం అసోం రాజధాని గువహతిలో మధ్యహ్నాం 1.30 గంటలకు ఆరంభం కానున్నది.
పంత్కు పట్టం! : విండీస్తో టెస్టు సిరీస్లో యువ కెరటం పృథ్వీ షా అరంగేట్రం చేయగా, ఇప్పుడు వన్డే సిరీస్లో మరో యువ సంచలనం రిషబ్ పంత్ అరంగేట్రం (వన్డే) చేయనున్నాడు. భారత్ శనివారమే 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఆరుగురే బ్యాట్స్మన్ ఉన్నారు. దీంతో పంత్ తొలి వన్డేకు రంగం సిద్ధం చేసుకున్నాడు. టెస్టుల్లో వరుసగా 92, 92 ఇన్నింగ్స్లతో అలరించిన పంత్ వన్డేల్లో ధోని వారసుడిగా తొలి అడుగులు వేయనున్నాడు. టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భీకర ఫామ్లో ఉన్నారు. ఈ ముగ్గురిని ఎదుర్కొవటం కరీబియన్ బౌలర్లకు అతి పెద్ద సవాల్. మిడిల్ ఆర్డర్లో తెలుగు తేజం అంబటి రాయుడు ఆసియా కప్లో రాణించాడు. ఆ ఫామ్ ఇక్కడా కొనసాగిస్తాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కొత్తగా రిషబ్ పంత్ చేరిక మిడిల్ ఆర్డర్కు దూకుడు తీసుకురానున్నది. లోయర్ ఆర్డర్లో మహి, జడేజాలు కీలకం కానున్నారు. అధిక శాతం వన్డేలను లోయర్ ఆర్డర్ సాయం లేకుండానే ముగిస్తోన్న కోహ్లిసేన, తాజా సిరీస్లోనూ అదే ఒరవడి కొనసాగించే వీలుంది. బంతితో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. కుల్దీప్, చాహల్లతో కలిసి జడేజా స్పిన్ సవాల్ స్వీకరించనున్నాడు. యువ సీమర్ ఖలీల్ అహ్మద్ సైతం తుది జట్టు రేసులో నిలిచాడు. కానీ అతడి అవకాశం గువహతిలోనే అని కచ్చితంగా చెప్పలేం.
ఒత్తిడిలో వెస్టిండీస్ : కరీబియన్ జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. కీలక ఆటగాళ్లు దూరం కావటంతో వన్డేల్లోనూ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. మార్లోన్ శామ్యూల్స్ ఒక్కడే విండీస్ జట్టులో భారత్పై శతకం బాదిన బ్యాట్స్మన్. ఇప్పుడు విండీస్ అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్నది. సునీల్ అంబ్రిస్, కీరన్ పావెల్, షారు హోప్, రోవ్మాన్ పావెల్లు రాణిస్తే భారత్కు విండీస్ పోటీనివ్వగలదు. బంతితో కెప్టెన్ జేసన్ హోల్డర్తో కలిసి కీమో పాల్, కీమర్ రోచ్, బిషులు కోహ్లిసేన దూకుడును అడ్డుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అవి ఏ మేరకు సఫలం అవుతాయో నేడు తేలుతుంది.
పిచ్ రిపోర్టు : ఉపఖండంలో అప్పుడే శీతాకాలం ఆరంభ సూచనలు కనిపిస్తున్నాయి. దీనర్థం మంచు ప్రభావం మొదలైంది. గువహతి ఇందుకు మినహాయింపు కాదు. తొలి ఇన్నింగ్స్కు ఈ ప్రభావం లేకపోయినా, రాత్రివేళ జరిగే రెండో ఇన్నింగ్స్కు మంచు ప్రభావం స్పష్టంగా ఉండనున్నది. దీంతో టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉన్నది.
తుది జట్లు (అంచనా) : భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రిషబ్ పంత్, ఎం.ఎస్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి.
వెస్టిండీస్ : సునీల్ అంబ్రిస్, కీరన్ పావెల్, షారు హోప్, సిమ్రోన్ హెట్మయర్, మార్లోన్ శామ్యూల్స్, రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్, అష్లె నర్సె, కీమో పాల్, దెవెంద్ర బిషు, కీమర్ రోచ్.
221 : సచిన్ టెండూల్కర్ పది వేల పరుగుల రికార్డుకు విరాట్ కోహ్లి 221 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ 10,000 పరుగులను 259 ఇన్నింగ్స్ల్లో సాధించగా, కోహ్లి 9779 పరుగులను 203 ఇన్నింగ్స్లోనే సాధించాడు. ఈ సిరీస్లో కోహ్లి పది వేల పరుగులు దాటితే అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.
177 : సచిన్ రికార్డుపై విరాట్ కన్నేయగా, కోహ్లి రికార్డుపై గబ్బర్ గురి పెట్టాడు. విండీస్తో సిరీస్లో మరో 177 పరుగులు సాధిస్తే అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు సాధించిన భారత ఆటగాడిగా కోహ్లిని దాటేసి శిఖర్ ధావన్ నిలువనున్నాడు.
' ప్రపంచకప్ ముంగిట భారత మిడిల్ ఆర్డర్ సమస్యలకు అంబటి రాయుడు రూపంలో పరిష్కారం లభించినట్టే భావిస్తున్నాం. ఆసియా కప్లో అతడు నిలకడగా పరుగులు రాబట్టాడు. మిడిల్ ఆర్డర్ బాధ్యతలకు తగినట్టు అతడి బ్యాటింగ్ శైలి రూపొందించబడింది. నాల్గో స్థానంలో రాయుడే సరైన ఆటగాడు. ఈ స్థానంలో చాలా మందిని పరీక్షించాం, అవకాశాలు ఇచ్చాం. కానీ రాయుడు నాల్గో స్థానానికి న్యాయం చేయగలడు'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్