Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో తైజు చేతిలో ఓటమి
- డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్
ఒడెన్సె : రెండేండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓ సూపర్ సిరీస్ ఫైనల్లోకి ప్రవేశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్కు ఒడెన్సెలో భంగపాటు. పెండ్లికి ముందు సూపర్ టైటిల్ సాధించాలని అనుకున్న హైదరాబాదీ అమ్మాయికి చైనీస్ తైపీ షట్లర్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నం.10 సైనా నెహ్వాల్ 1-2తో వరల్డ్ నం.1 తైజు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలైంది. గంట పాటు సాగిన టైటిల్ పోరులో సైనా పోరాడి ఓడింది. 2013లో డెన్మార్క్ విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్ ఇక్కడ మరో టైటిల్ ఆశించించింది. కానీ వరల్డ్ నం.1 తైజు యింగ్ 13-5తో సైనాపై కెరీర్ ముఖాముఖి రికార్డును మెరుగుపర్చుకోవటంతో పాటు ట్రోఫీనీ సొంతం చేసుకున్నది.
హోరాహోరీ.. ఏకపక్షం! : మహిళల సింగిల్స్ ఫైనల్స్ పోరు హోరాహోరీగా సాగింది. తొలి రెండు గేములను సైనా, తైజులు పంచుకోవటంతో నిర్ణయాత్మక మూడో గేమ్లో అమీతుమీ తేల్చుకుంటారనే అంచనాలు. కానీ మూడో గేమ్ అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఆరంభంలో 2-2తో సమవుజ్జీలుగా నిలిచినా, వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన తైజు యింగ్ 11-2తో విరామ సమయానికి సైనాపై తిరుగులేని ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలోనూ సైనా నెహ్వాల్ పుంజుకోలేదు. దీంతో భారత స్టార్ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండానే తైజు యింగ్ 21-6తో డెన్మార్క్ ఓపెన్ను ఖాతాలో వేసుకున్నది. తొలి రెండు గేముల్లో నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో ఆఖరి సమరం అనూహ్యంగా మారింది. అంతకముందు తొలి గేమ్ను తైజు యింగ్ 21-13తో నెగ్గగా, రెండో గేమ్ను సైనా నెహ్వాల్ 21-13తో సొంతం చేసుకున్నది. తాము నెగ్గిన గేమ్లో ఇద్దరూ ప్రత్యర్థిపై ఆధిప్యం ప్రదర్శించారు. డెన్మార్క్ ఓపెన్లో కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో పరాజయం పాలవగా, స్టార్ షట్లర్ పి.వి సింధు అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.