Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి వన్డేలో భారత్ అలవోక విజయం
- కోహ్లి కెప్టెన్సీ శతకం, రోహిత్ వీరోచిత సెంచరీ
- షిమ్రోన్ హెట్మయర్ సెంచరీ వృథా
విండీస్ విచిత్రంగా భారీ స్కోరు బాదింది. షిమ్రోన్ సెంచరీతో కోహ్లిసేనకు సవాల్ విసిరింది. అసమానుల సమరం ఉన్నట్టుండి రసవత్త రంగు పులుముకున్నది. కానీ ఇదంతా టీమ్ ఇండియా బ్యాటింగ్ మొదలు కాకముందు సీన్. ఒక్కసారి కెప్టెన్ కోహ్లి, డిప్యూటీ రోహిత్లు క్రీజులోకి వచ్చాక సమీకరణాలు మారిపోయాయి. బంతి బౌండరీ వైపు పరుగులు పెట్టగా, స్కోరు బోర్డు లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. భారీ సెంచరీలతో చెలరేగిన కోహ్లి, రోహిత్లు గువహతి వన్డేను ఏకపక్షం చేశారు. తొలి వన్డేలో భారత్ 8 వికెట్లతో గెలుపొంది, సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. తర్వాతి సమరం విశాఖలో బుధవారమే.
గువహతి : నాయక ద్వయం చెలరేగింది. విండీస్ బౌలింగ్ బృందంపై విరుచుకుపడింది. గువహటిలో భారీ శతకాలతో గర్జించిన రోహిత్ శర్మ (152 నాటౌట్, 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్స్లు), విరాట్ కోహ్లి (140, 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 ఫోర్లు) తొలి వన్డేలో భారత్కు 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించారు. రోహిత్, కోహ్లి శతకాలతో 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు (22 నాటౌట్) రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 322 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్మయర్ (106, 78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) శతకంతో కదం తొక్కాడు. ఓపెనర్ కీరన్ పావెల్ (51), జేసన్ హోల్డర్ (38), హోప్ (32)లు ఫర్వాలేదనిపించారు. గువహటిలో 8 వికెట్లతో గెలుపొందిన టీమ్ ఇండియా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాతి వన్డే బుధవారం విశాఖపట్నంలో జరుగనున్నది.
కోహ్లి, రోహిత్ శతకాలు : 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఝలక్. ఫామ్లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ (4) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వికెట్ పోగొట్టుకున్నాడు. ఈ దశలో కరీబియన్లు ఉత్సాహం బంతులేశారు. కానీ విండీస్ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (152 నాటౌట్)ఎప్పట్లాగే నెమ్మదిగా పుంజుకోగా, మరో ఎండ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి (140) వీర విజృంభణ గావించాడు. వచ్చీ రాగానే దూకుడుగా ఆడిన కోహ్లి వేగంగా పరుగులు సాధించాడు. పది ఫోర్లతో 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన విరాట్, మరో అర డజను ఫోర్లతో 88 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. ఓ ఎండ్లో కోహ్లి చెలరేగుతుండగా, మరో ఎండ్లో నెమ్మదిగా ఆడిన రోహిత్ కుదురుకున్నాక జూలు విదిల్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మూడేసి ఫోర్లు, సిక్సర్లతో 51 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రోహిత్.. మరో 50 పరుగులకు కేవలం 33 బంతులే అవసరమయ్యాయి. ఫిప్టీ తర్వాత విరుచుకుపడిన రోహిత్ పది ఫోర్లు, ఐదు సిక్సర్లతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. లాంఛనాన్ని త్వరగా ముగించే క్రమంలో కోహ్లి వికెట్ కోల్పోయినా, తెలుగు తేజం అంబటి రాయుడుతో కలిసి రోహిత్ మిగతా పని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో థామస్, బిషూలు చెరో వికెట్ తీసుకున్నారు.
షిమ్రోన్ శతకం : టాస్ నెగ్గిన విరాట్ మంచు ప్రభావం దృష్ట్యా విండీస్కు తొలుత బ్యాటింగ్ అప్పగించాడు. విండీస్కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వకపోయినా, టాప్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఓపెనర్ హేమ్రాజ్ (0)ను షమి ఆరంభంలోనే వెనక్కి పంపించాడు. కానీ కీరన్ పావెల్ (51, 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. షారు హోప్ (32) ఇతడికి సహకరించాడు. దీంతో 84/1తో విండీస్ దూసుకెళ్లింది. కానీ పావెల్తో పాటే సీనియర్ బ్యాట్స్మన్ శామ్యూల్స్ (0)ను కోల్పోయిన విండీస్ 86/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో షిమ్రోన్ హెట్మయర్ (106, 78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) విండీస్ను ఆదుకున్నాడు. వేగంగా ఆడిన షిమ్రోన్ ఆరేసి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 76 బంతుల్లోనే శతకం సాధించాడు. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న హెట్మయర్ సులువుగా పరుగులు పిండుకున్నాడు. అతడి ధాటికి సీమర్ల బౌలింగ్ గణాంకాలు మారిపోయాయి. లోయర్ ఆర్డర్లో కెప్టెన్ జేసన్ హోల్డర్ (38), రోవ్మన్ పావెల్ (22), బిషు (22), కీమర్ రోచ్ (26) మెప్పించారు. హెట్మయర్ జోరుతో ఓ దశలో విండీస్ 350 ప్లస్ పరుగులు సాధించేలా కనిపించింది. జడేజా అతడిని సాగనంపి విండీస్ జోరుకు కళ్లెం వేశాడు!. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు కూల్చగా.. షమి, జడేజాలు చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : కీరన్ పావెల్ (సి) ధావన్ (బి) ఖలీల్ అహ్మద్ 51, చంద్రపాల్ హెమ్రాజ్ (బి) షమి 9, షారు హోప్ (సి) ధోని (బి) షమి 32, మార్లోన్ శామ్యూల్స్ (ఎల్బీ) చాహల్ 0, షిమ్రోన్ హెట్మయర్ (సి) పంత్ (బి) జడేజా 106, రోవ్మన్ పావెల్ (బి) జడేజా 22, జేసన్ హోల్డర్ (బి) చాహల్ 38, అష్లె నర్సె (ఎల్బీ) చాహల్ 2, దెవెంద్ర బిషు నాటౌట్ 22, కీమర్ రోచ్ నాటౌట్ 26, ఎక్స్ట్రాలు : 14, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 322. వికెట్ల పతనం : 1-19, 2-84, 3-86, 4-114, 5-188, 6-248, 7-252, 8-278.
బౌలింగ్ : మహ్మద్ షమి 10-0-81-2, ఉమేశ్ యాదవ్ 10-0-64-0, ఖలీల్ అహ్మద్ 10-0-64-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-41-3, రవీంద్ర జడేజా 10-0-66-2.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ 152 నాటౌట్, శిఖర్ ధావన్ (బి) థామస్ 4, విరాట్ కోహ్లి (స్టంప్డ్) షారు హోప్ (బి) బిషూ 140, అంబటి రాయుడు నాటౌట్ 22, ఎక్స్ట్రాలు : 08, మొత్తం : (42.1 ఓవర్లలో 2 వికెట్లకు) 326. వికెట్ల పతనం : 1-10, 2-256.
బౌలింగ్ : కీమర్ రోచ్ 7-0-52-0, ఒసానె థామస్ 9-0-83-1, జేసన్ హోల్డర్ 8-0-45-0, అష్లె నర్సె 7-0-63-0, దెవెంద్ర బిషు 10-0-72-1, హెమ్రాజ్ 1.1-0-9-0.