Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్, రోహిత్, కోహ్లి జోరు
- మునుపెన్నడూ చూడని టాప్-3 ఆధిపత్యం
- వన్డేల్లో భారత్ సక్సెస్కు వీరే కీలకం
క్రికెట్ అభిమానులు మునుపెన్నడూ చూడని ప్రదర్శన. చరిత్ర ఎన్నడూ ఎరుగని ఆధిపత్యం. గణాంక పుస్తకాల్లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులు. ముగ్గురంటే ముగ్గురు.. లక్ష్యం ఎంతైనా సరే, ప్రత్యర్థి ఎవరైనా సరే ఊదేస్తున్నారు. వాళ్లే టీమ్ ఇండియా టాప్-3 త్రయం శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. ప్రపంచ క్రికెట్ చూస్తోన్న నయా విధ్వంసక త్రయం వరల్డ్కప్కు ముందు మరింత రాటుదేలుతున్నది.
నవతెలంగాణ క్రీడా విభాగం
ఎంత మేటి జట్టుకైనా ఓ అగ్ర బ్యాట్స్మన్ను ఎదుర్కొవటమే కష్టమే. అలాంటిది ఏకకాలంలో వికెట్కు ఇరు వైపులా వరల్డ్ నం.1, వరల్డ్ నం.2 ఎడాపెడా బాదేస్తే ఎట్టుంటుంది?. గువహటి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ బౌలింగ్ బృందం దీన గాథ మాదిరి ఉంటుంది!. సూపర్ స్టార్ విరాట్ కోహ్లి, హిట్మ్యాన్ రోహిత్ శర్మలు గువహటి వన్డేలో బౌండరీల వర్షం కురిపించారు. భారీ షాట్లతో నిర్దాక్షిణ్యంగా కరీబియన్లపై దండయాత్ర చేశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జోడీ కట్టిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు మరో రెండొందల భాగస్వామ్యం జోడించారు. విరాట్, రోహిత్ కలయికలో ఇది ఐదో డబుల్ సెంచరీ భాగస్వామ్యం కావటం విశేషం. సహజంగా ఇటువంటి ప్రదర్శనలు ప్రతి జట్టులోనూ కనిపిస్తుంటాయి. కానీ అది అలవాటుగా మారితినే టీమ్ ఇండియా టాప్-3 త్రయం అవుతుంది. రోహిత్-ధావన్, ధావన్-కోహ్లి, రోహిత్-కోహ్లిలు ఇలా ఈ ముగ్గురిలో ఏ ఇద్దరూ జోడీకట్టినా ప్రత్యర్థికి చిత్తడవుతోంది. ఆవలి జట్టు అంచనాలు చిరిగిపోతున్నారు, గణాంకాలు మారిపోతున్నాయి. 320 ప్లస్ లక్ష్యం అంటే ఏ సమయంలోనైనా కష్టమైన ఛేదన. కానీ ఇవి టీమ్ ఇండియాకు ఇప్పుడు అలవోక ఛేదనలు. అందుకు కారణం జట్టులోని టాప్-3 బ్యాట్స్మెన్ తిరుగులేని ఫామ్లో ఉండటం. వన్డేల్లో మెజార్టీ మ్యాచులను తమ సత్తాతోనే గెలిపిస్తోన్న కోహ్లి, ధావన్, రోహిత్ త్రయం 2019 ప్రపంచకప్ ముంగిట ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నారు.
రికార్డుల మోత : విరాట్ కోహ్లి రికార్డులు బద్దలు కొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. కానీ రోహిత్ శర్మ అలా కాదు. ఎప్పుడో ఓ సారి మాత్రమే రికార్డుల వంక చూస్తాడు. కానీ అది అద్భుతమైన రికార్డే కొడతాడు!. గువహటిలోనూ అలాంటి ఘనతే సాధించాడు. అజేయంగా 152 పరుగులతో నిలిచిన రోహిత్ శర్మ.. వన్డే క్రికెట్లో అత్యధిక పర్యాయాలు 150 ప్లస్ పరుగులు సాధించిన బ్యాట్స్మన్గా రికార్డు బద్దలు కొట్టాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ల పేరిట ఉన్న ఐదు 150 ప్లస్ ఇన్నింగ్స్ల రికార్డును రోహిత్ ఆరో 150 ప్లస్ ఇన్నింగ్స్తో అధిగమించాడు. ఛేదనలో 20వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. మరోసారి సచిన్ను అధిగమించాడు. సచిన్ 124 ఛేదనల్లో 14 శతకాలు సాధించగా, కోహ్లి 75 విజయవంతమైన ఛేదనల్లో 20 సెంచరీలు కొట్టాడు. 20 శతకాలు సాధించేందుకు తక్కువ ఇన్నింగ్స్లు ఆడిన క్లబ్లో రోహిత్ చేరిపోయాడు. ఆమ్లా (108), విరాట్ కోహ్లి (133), ఏబీ డివిలియర్స్ (175) తర్వాత స్థానంలో రోహిత్ (183) నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (197) రోహిత్ తర్వాతి స్థానానికి వెళ్లిపోయాడు.
ముగ్గురూ ముగ్గురే : టీమ్ ఇండియాకు సెహ్వాగ్-గంభీర్ ఓపెనింగ్ జోడీ తర్వాత అత్యంత సక్సెస్ఫుల్ జంట ధావన్-రోహిత్. ఆ జోడీ మాదిరిగానే వీరిదీ దూకుడు పంథా. ఢిల్లీ బారు గబ్బర్ ఆది నుంచీ దూకుడుగా ఆడే తత్వం కాగా, ముంబయి హీరో రోహిత్ శర్మ ఎల్లప్పుడూ తుపాన్ వల్లే ప్రారంభమవుతాడు. ఆరంభంలో ఎంతో నెమ్మదించే రోహిత్, కుదురుంటే పరుగుల వర్షం కురిపిస్తాడు. వీరికి తర్వాత వరుస బ్యాట్స్మన్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి. ఆధునిక క్రికెట్లో కావాల్సిన పవర్ హిట్టింగ్, వికెట్ కాపాడుకునేందుకు తిరుగులేని టెక్నిక్, పరుగుల వరద పారించేందుకు ఎదురులేని షాట్లు కోహ్లి అమ్ములపొదిలో కీలక అస్త్రాలు. సహజంగానే ఓపెనర్లలో ఇద్దరికీ మూడో స్థానంలో ఆడే ఆటగాడితో సమన్వయం కుదరుదు. ఏ ఒక్కరికో పరిమితమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. రోహిత్, కోహ్లిలది ఎంత హిట్ జోడీయో, ధావన్, కోహ్లిలదీ అంతే సక్సెస్ఫుల్ జోడీ. అందుకే ఈ టాప్-3 త్రయం తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా టాప్-3 జోడీని ఇదివరకూ అత్యుత్తమం అనేవారు!. వరుసగా మూడు ప్రపంచకప్లు నెగ్గిన ఆ జోడీ మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్క్రిస్ట్, రికీ పాంటింగ్. ఆసీస టాప్-3 సంయుక్తంగా ఏడు 150 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేశారు. కానీ టీమ్ ఇండియా టాప్-3 ఏకంగా 18 సార్లు 150 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసింది. అందులో రోహిత్, విరాట్లు ఏకంగా ఐదుసార్లు ద్వి శతక భాగస్వామ్యాలు నిర్మించారు. చరిత్ర ఎరిగిన ఆసీస్ టాప్-3 జోడీ మనోళ్లకు దరిదాపుల్లోనూ లేదు. విరాట్, ధావన్, రోహిత్ వీరోచిత విధ్వంస రచన ఏ స్థాయిలో సాగుతున్నదో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు!.
స్మాల్ ఛేంజ్! : జట్టు వ్యూహం ప్రకారం ఏ స్థానంలో ఆడే బ్యాట్స్మన్ ఏ విధమైన శైలి అనుసరించాలనే ప్రణాళిక ఉంటుంది. ఆ విధంగా విరాట్, రోహిత్ కాంబినేషన్లో రోహిత్ది ఎదురుదాడి చేయాల్సిన పాత్ర కాగా, కోహ్లిది సహాయకారి పాత్ర. నిజానికి రోహిత్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడతాడు. కానీ చాలా సమయాల్లో విరాట్ వచ్చేసరికి రోహిత్ జోరుమీదుంటాడు. ఇక్కడ ఆరంభంలోనే ధావన్ వికెట్ కోల్పోయాడు. కోహ్లి క్రీజులోకి రాగానే, తను దూకుడుగా ఆడతానని రోహిత్తో చెప్పేశాడు. దీంతో విరాట్ 90ల్లోకి అడుగుపెట్టినా, రోహిత్ ఇంకా 50కి కూడా చేరుకోలేదు. గతంలో ఓ సారి ఆవలి ఎండ్లో సెహ్వాగ్ ఉండగా అతడికి కంటే ముందే యువరాజ్ సింగ్ సెంచరీ సాధించాడు. ఇది అభిమానులనే కాదు యువీని ఆశ్చర్యపరిచింది. అటువంటి సందర్భమే గువహటిలోనూ కనిపించింది. ఒకట్రెండు ఓవర్లోనే ఊహించని పరుగులు పిండుకునే రోహిత్ను కాదని కోహ్లి ముందుగా సెంచరీ సాధించటం సైతం ఇదే కోవలోకి వస్తుంది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం కోహ్లి సరదాగా ప్రస్తావించాడు.
విశాఖలో ఇరగిరగ..
వెస్టిండీస్తో రెండో వన్డే విశాఖపట్నంలో జరుగనున్నది. విశాఖ స్టేడియంలోనూ టీమ్ ఇండియా టాప్-3కి తిరుగులేని రికార్డుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఫేవరేట్ గ్రౌండ్లలో విశాఖ కూడా చేరిపోయింది. ఇక్కడ సూపర్స్టార్కు ఏకంగా 99.25 సగటు ఉంది. కోహ్లి విశాఖలో నాలుగు వన్డేలు ఆడాడు. రెండింట సెంచరీలు, మరో రెండింట అర్ధ సెంచరీలు సాధించాడు. ఓవరాల్గా నాలుగు మ్యాచుల్లో 399 పరుగులు సాధించాడు. సచిన్ టెండూల్కర్ 10,000 పరుగుల రికార్డుపై కన్నేసి విశాఖకు వస్తోన్న కోహ్లికి.. వైజాగ్ వేగవంతమైన పది వేల రికార్డును ఇవ్వటం లాంఛనమే!. అమ్మమ్మ గారింటికి వస్తోన్న రోహిత్ శర్మకూ ఇక్కడ మంచి రికార్డుంది. రోహిత్ విశాఖలో మూడు వన్డేలాడాడు. అత్యధిక స్కోరు 90 నాటౌట్. 59.66 సగటుతో 179 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ మూడు మ్యాచుల్లో 135 పరుగులు చేశాడు. అందులో ఓ అజేయ సెంచరీ ఉంది. ఆసియా కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ధావన్ గువహటిలో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. అచ్చొచ్చిన విశాఖ లో గబ్బర్ భారీ ఇన్నింగ్స్ సాధించాలని చూస్తున్నాడు. టీమ్ ఇండియా టాప్-3 ఫామ్లో ఉండటం, విశాఖలో ఘనమైన రికార్డుతో ఇక్కడికి రానుండటంతో అభిమానులకు అక్టోబర్ 24న పండుగే.