Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లో అలవోక విజయం
- ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్
పారిస్ : డెన్మార్క్ ఓపెన్లో నిరాశపరిచిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు పారిస్లో ఫటాఫట్ ఆరంభం అందుకున్నది. తొలి రౌండ్లో అలవోక విజయం సాధించిన పి.వి సింధు ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో అమెరికా అమ్మాయి బీవెన్ జాంగ్పై 21-17, 21-8తో వరుస గేముల్లో గెలుపొందింది. తొలి గేమ్లో 0-2తో మొదలెట్టిన సింధు నెమ్మదిగా పుంజుకున్నది. 2-3 నుంచి 10-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అమెరికా షట్లర్ ఈ సమయంలో వరుసగా 5 పాయింట్లు సాధించి 10-10తో స్కోరు సమం చేయటమే కాదు విరామ సమయానికి 11-10 ముందంజ వేసింది. ద్వితీయార్థంలో సింధుకు బీవెన్ భీకర పోటీనిచ్చింది. ప్రతి పాయింట్ కోసం సింధు చెమటోడ్చింది. 14-12తో ముందంజ వేసినా బీవెన్ ఆశలు వదులుకోలేదు. 16-16తో స్కోరు సమం చేసి ఉత్కంఠకు తెరదీసింది. ఆఖర్లో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టిన సింధు వరుస పాయింట్లతో తొలి గేమ్ను గెల్చుకున్నది. తొలి గేమ్లో పోటీనిచ్చిన బీవెన్ జాంగ్ను రెండో గేమ్లో చిత్తుగా ఓడించింది సింధు. దూకుడుగా ఆడిన సింధు 3-3 తర్వాత వరుసగా ఏడు పాయింట్లు సాధించింది. 10-3తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ద్వితీయార్థంలోనూ బీవెన్కు పెద్ద అవకాశం ఇవ్వని ఏకపక్షంగా పాయింట్లు కొల్లగొట్టింది. 34 నిమిషాల్లోనే తొలి రౌండ్ మ్యాచ్ను ముగించింది.
సైనా, శ్రీకాంత్ నేడు : డెన్మార్క్ ఓపెన్లో ఫైనల్స్కు చేరిన ఉత్సాహంలో కనిపిస్తోన్న అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పారిస్లోనూ పతకంపై కన్నేసింది. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ నేడు తొలి రౌండ్లో అదృష్టం పరీక్షించుకోనున్నది. జపాన్ షట్లర్ సయెనా కవాకమితో సైనా తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ కిదాంబి శ్రీకాంత్కు హాంగ్కాంగ్ ఆటగాడు వింగ్ వాంగ్ విన్సెంట్ సవాల్ విసరనున్నాడు. సాయిప్రణీత్తో బ్రెజిల్ షట్లర్ పోటీపడనుండగా, ఇండోనేషియా కుర్రాడితో సమీర్ వర్మ తలపడనున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, అశ్విని పొన్నప్ప జంట, మెన్స్ డబుల్స్లో మను అత్రి, చిరాగ్ శెట్టి జోడీ సైతం నేడు తొలి రౌండ్ పోటీలో ఉన్నారు.