Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యు ముంబా చేతిలో 20-41తో పరాభవం
- రాహుల్ చౌదరి 700 పాయింట్ల రికార్డు
- ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 6
పుణె : తెలుగు టైటాన్స్ మరో మ్యాచ్లో మట్టికరిచింది. తొలి రెండు మ్యాచుల్లో నెగ్గి సీజన్ను ఘనంగా ఆరంభించిన టైటాన్స్.. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. తాజాగా పుణెలో యు ముంబాతో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ దారుణ ఓటమి మూటగట్టుకున్నది. యు ముంబాకు కనీస పోటీనివ్వలేకపోయిన టైటాన్స్ పూర్తిగా నిరాశపరిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ప్రొ కబడ్డీలో మరో మైలురాయి అందుకున్నాడు. ముంబాతో మ్యాచ్లో వ్యక్తిగతంగా నిరాశపరిచినా, 700వ పాయింట్తో రికార్డు నెలకొల్పాడు. 41-20తో టైటాన్స్ను చిత్తు చేసిన ముంబా ఈ విజయంతో విలువైన ఆత్మవిశ్వాసం సంపాదించింది. ఆటలో ఏ దశలోనూ టైటాన్స్ ఆకట్టుకోలేదు. ప్రథమార్థం ముగిసే సరికి 12-20తో 8 పాయింట్ల వెనుకంజలో కొనసాగింది. ద్వితీయార్థంలో పుంజుకుంటారని ఆశించినా అది జరుగలేదు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో యు ముంబా భారీ తేడాతో గెలుపొందింది. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి 15 ప్రయత్నాల్లో ఏడు పాయింట్లు సాధించగలిగాడు. డిఫెండర్ ఫర్హద్ నాలుగు టాకిల్స్లో తన వంతు పాత్ర పోషించాడు. యు ముంబా తరఫున సిద్దార్థ్ దేశారు దు మ్మురేపాడు. ఏకంగా 17 రైడ్ పాయింట్లు సాధించిన టైటాన్స్ను ఓడించటంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇరాన్ డిఫెండర్ ఫజల్ నాలుగు కీలక టాకిల్స్తో రాణించాడు. కూతకెళ్లి యు ముంబా 22 పాయింట్లు తీసుకురాగా, టైటాన్స్ కేవలం 13 పాయింట్లే సాధించింది. డిఫెన్స్లోనూ ముంబా (12) కంటే మెరుగైన (టైటాన్స్ 6) ప్రదర్శన చేయలేదు. ఈ విజయంతో తెలుగు టైటాన్స్తో ముఖాముఖి రికార్డును 4-4తో యు ముంబా సమం చేసింది. మరో మ్యాచ్లో లోకల్ టీమ్ పుణెరి పల్టన్స్కు చుక్కెదురైంది. తమిళ తలైవాస్ 36-31తో పుణెరి పల్టన్ను పల్టీ కొట్టించింది. మెరుపు విజయం ఖాతాలో వేసుకున్నది.