Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది వేల పరుగుల రికార్డుపై కోహ్లి కన్ను
- జోరుమీదున్న టీమ్ ఇండియా
-ఒత్తిడిలో కరీబియన్ జట్టు
- నేడు విశాఖలో రెండో వన్డే పోరు
-మ.1.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
17 వసంతాలు గడిచిపోయాయి. అయినా అది నిన్న జరిగినట్టుగానే తోస్తోంది. ఇండోర్లో ఆసీస్తో భారత్ పోరు. షేన్ వార్న్ బంతిని గింగిరాలు తిప్పుతున్న వేళ. లాంగ్ ఆఫ్లో డ్రైవ్ షాట్తో వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 10,000 పరుగులు సాధించిన రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. వన్డే క్రికెట్ చరిత్రలో అదో బంగారు మైలురాయి.
'నా రికార్డులు చిరకాలం ఉండాలని కోరుకోవటం లేదు, కానీ వాటిని భారతీయుడే బద్దలు కొడితే సంతోషిస్తా'.. వీడ్కోలు వేళ సచిన్ మాటల్ని మనోళ్లు సీరియస్గా తీసుకున్నారేమో!. అందుకే వరుసగా సచిన్ రికార్డులను తిరగరాస్తున్నారు. ఇప్పుడు సచిన్ మెగా రికార్డును దాటేందుకు విరాట్ కోహ్లి రేసుమీదున్నాడు. 9,919 పరుగులతో ఉన్న కోహ్లి బంగారు మైలురాయిని వేగంగా అందుకున్న ఆటగాడిగా నిలిచేందుకు మరో 81 పరుగుల దూరంలో ఉన్నాడు. సిరీస్లో భారత్ 2-0తో ముందంజ వేయాలని చూస్తున్న వేళ, విరాట్ కోహ్లి 10000 పరుగుల రికార్డుపై ఎనలేని ఆసక్తి నెలకొన్నది. విశాఖలో విండీస్తో నేడు రెండో వన్డే సమరం.
నవతెలంగాణ- విశాఖపట్నం
టీమ్ ఇండియా మరోసారి విశాఖ తీరానికి వచ్చింది. ప్రతిసారి సిరీస్పై ఆధిపత్యం కోసమే, సిరీస్ దక్కించుకోవటం కోసమే పోరు. ఈ సారీ అందుకే సమరం. కానీ అభిమానులకు, క్రికెట్ ప్రియులకు ఇప్పుడు అది పట్టడం లేదు. అందరి దృష్టి రికార్డుల పుస్తకంపైనే నెలకొన్నది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తొలిసారి చేరుకున్న పది వేల పరుగుల బంగారు మైలురాయి ఎలా బద్దలవుతుందా అని ఆసక్తితో ఎదురుచూసు ్తన్నారు. సూపర్ స్టార్ విరాట్ కోహ్లి ఏ షాట్తో 10,000 పరుగులు సాధిస్తాడా, ఎవరి బంతిని బౌండరీకి బాది రికార్డు బ్రేక్ చేస్తాడా, మాస్టర్ మాదిరిగానే డ్రైవ్ షాట్ ఆడతాడా లేక తనదైన మార్క్ షాట్తో చేరుకుంటాడా? ఇలా క్రికెట్ ప్రియుల చర్చలు సాగుతూనే ఉన్నాయి. వీటికి సమాధానం ఇచ్చేందుకు విరాట్ కోహ్లి నేడు విశాఖలో బరిలోకి దిగనున్నాడు. అత్యంత వేగవంతంగా పది వేల పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచేందుకు విశాఖను విరాట్ వేదిక చేసుకోవటం లాంఛనమే!. మరోవైపు గువహ టిలో తిరుగులేని విజయం సాధించిన టీమ్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. టాప్-3 శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భీకర ఫామ్లో ఉండగా మనోళ్లు సిరీస్ ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లటంపై దృష్టి పెట్టారు. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన కరీబియన్లు విశాఖలో నైనా విజృంభించాలని ఎదురుచూస్తున్నారు.
బౌలర్లకో అవకాశం : ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జశ్ప్రీత్ బుమ్రాలు విశ్రాంతి లభించిన వేళ.. భారత పేసర్లు నిరాశపరిచారు. గువహటి వన్డేలో మహ్మద్ షమి ఎకానమీ ఓవర్కు 8 దాటగా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్లు ఓవర్కు 6.4 చొప్పున పరుగులు ఇచ్చుకున్నారు. స్పిన్నర్లు 44వ ఓవర్ సమయానికి 8 వికెట్లు కూల్చగా తోకను కత్తిరించటంలో పేసర్లు విఫలమయ్యారు. నం.9, నం.10 జోడీకి 44 పరుగులు సమర్పించారు. విశాఖ వన్డే తర్వాత మిగిలిన మూడు వన్డేలకు జట్టును ప్రకటించను న్నారు. దీంతో సిరీస్లో తర్వాతి మ్యాచులకు జట్టులో ఉండాలంటే పేసర్లు విశాఖలో మెరవాలి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జడేజా బెంచ్కు పరిమితం కాక తప్పదేమో!. మిడిల్ ఆర్డర్లో అంబటి రాయుడు తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు. కానీ యువ కెరటం రిషబ్ పంత్ విశాఖలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అభిమానులూ పంత్ విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నారు. ఎం.ఎస్ ధోని బ్యాట్తో మళ్లీ తన మ్యాజిక్ను చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచకప్కు ముందు అతడు బ్యాటింగ్ ఫామ్ నిరూపించుకుంటేనే ఒత్తిడి లేకుండా ఆడగలడు. పూర్వ వైభవం మొదలవ్వడానికి మహికి విశాఖకు మించిన వేదిక ఏముంటుంది?.
ఒత్తిడిలో వెస్టిండీస్ : భీకర భారత్ చేతిలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్ విశాఖలో తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది. విండీస్ ఆశించిన 300 ప్లస్ పరుగులు చేసినా, ఏ మాత్రం రక్షణ లేదు. దీంతో ఆ జట్టు బంతితో కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది. అందుకు తుది జట్టులో పలు మార్పులు చేసేందుకు హోల్డర్ సిద్ధమయ్యాడు. మార్లోన్ శామ్యూల్స్ గువహటిలో విఫలమయ్యాడు. ఇక్కడ అతడి నుంచి విండీస్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. హెట్మయర్ స్వేచ్ఛగా ఆడి ఆకట్టుకున్నాడు. అయితే, అతడి కోసం కుల్దీప్ను తీసుకురావాలని కోహ్లి భావిస్తున్నాడు. దీంతో హెట్మయర్కు విశాఖలో చెక్ పడినట్టే!. హోప్, పావెల్, హేమరాజ్లు రాణిస్తే విండీస్ మరింత మెరుగైన పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంది.
పిచ్ రిపోర్టు : తీర ప్రాంతం విశాఖపట్నం అప్పుడే మంచు ప్రభావాన్ని చూస్తోంది. నేటి వన్డేలో మంచు కీలక పాత్ర పోషించనున్నది. ఇక్కడా టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గుచూపనున్నది. సహజసిద్ధంగా విశాఖ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్, కానీ పేసర్లకూ గొప్పగా సహకరిస్తుంది. విశాఖ భారీ స్కోర్లకు చిరునామా!. నేటి మ్యాచ్లోనూ 300 ప్లస్ స్కోర్లు నమోదయ్యేందుకు అవకాశాలు మెండు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రిషబ్ పంత్, ఎం.ఎస్ ధోని, జడేజా/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్.
వెస్టిండీస్ : చంద్రపాల్ హేమ్రాజ్, కీరన్ పావెల్, షారు హోప్, షిమ్రోన్ హెట్మయర్, మార్లోన్ శామ్యూల్స్, రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్, అష్లె నర్సె/ ఫబియన్ అలెన్, కీమో పాల్/ ఒసానె థామస్/అల్జారీ జోసెఫ్, దేవెంద్ర బిషూ, కీమర్ రోచ్.