Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-ఎ కోచ్ రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ : స్వదేశంలో తిరుగులేని విజయాలు, వరుస సిరీస్లు టీమ్ ఇండియా సొంతమవుతున్నాయి. కానీ విదేశాల్లోనే కోహ్లిసేన ట్రాక్ రికార్డు అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లలో కోహ్లిసేన పరాజయాలు చవిచూసింది. స్వదేశంలో మరో బ్లాక్బస్టర్ సిరీస్ విజయంతో టీమ్ ఇండియా ఈసారి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నది. కీలక టెస్టు సిరీస్కు మ్యాచ్ సన్నద్ధత లభిస్తుందని భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లను భారత్-ఎ తరఫున న్యూజిలాండ్కు పంపించారు. న్యూజిలాండ్-ఎతో భారత్ మూడు అనధికార టెస్టులు, వన్డేల్లో ఆడనున్నది. ఈ సందర్భంగా భారత్-ఎ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ' కొంత మంది ఆటగాళ్లకు కివీస్ టూర్ చక్కటి అవకాశం. సీనియర్ జట్టు మేనేజ్మెంట్ సూచన మేరకు కొందరు ఆటగాళ్లు ఎ జట్టుతో కివీస్కు వచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పరిస్థితులు ఒకేలా ఉండవు. అయినప్పటికీ, ఇక్కడ వారు విలువైన మ్యాచ్ ప్రాక్టీస్ అనుభవం గడిస్తారు. ఎ జట్టు మ్యాచులు సైతం ఆసక్తికర పోటీతత్వంతో సాగుతున్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ముందు ఇది వారికి మంచి అవకాశం' అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. నవంబర్ 16 నుంచి తొలి అనధికార టెస్టు ఆరంభం కానున్నది. భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, మురళీ విజరు, పృథ్వీ షా, పార్ధీవ్ పటేల్, హనుమ విహారిలు భారత్-ఎ తరఫున తొలి అనధికార టెస్టులో ప్రాతినిథ్యం వహించనున్నారు.