Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా పర్యటనపై రోహిత్ శర్మ
- టెస్టు కెరీర్పై బెంగ లేదని వ్యాఖ్య
చెన్నై : స్వదేశంలో తిరుగులేని విజయం. వరల్డ్ చాంపియన్స్పై 3-0తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్. భీకర ఫామ్లో ఉన్న టీమ్ ఇండియా మరో ఎనిమిది రోజుల్లో కొత్త సవాల్కు సిద్ధం కానున్నది. బలహీన వెస్టిండీస్ను మూడు ఫార్మాట్లలోనూ చిత్తు చేసిన భారత్ మూడు సిరీస్లనూ వశపర్చుకున్నది. జట్టులోని స్టార్స్ సూపర్ ఫామ్లో ఉండటంతో విండీస్పై విజయం అందరూ ఊహించదగినదే, కానీ ఆస్ట్రేలియా పర్యటనలో మనోళ్ల ప్రదర్శన ఏ విధంగా ఉండనున్నదనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. దీనిపై భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బదులిచ్చాడు. కంగారూ పర్యటనపై ఎటువంటి కంగారు లేదని, పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉన్నామని విశ్వాసం వెలిబుచ్చాడు.
ఆ ఇద్దరు రాణించటంతో.. : జట్టు ప్రణాళికల దృష్ట్యా అందరు ఆటగాళ్లు విలువైన పరుగులు సాధించటం ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతిపెద్ద సానుకూలత. వన్డే సిరీస్లో శిఖర్ ధావన్ బాగా ఆడాడు. కానీ 30-40 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. చివరి టీ20లో ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో మెరువటం ఆనందదాయకం. రిషబ్ పంత్ సైతం పరుగుల ఆకలితో ఉన్నాడు. చెన్నైలో పంత్ పరుగులు బాదటం జట్టుకు మేలు. ఇటువంటి సిరీస్ విజయంతో, ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లవచ్చు. ఆస్ట్రేలియా పర్యటన భిన్నమైనది. ఆ విషయం మాకు తెలుసు. జట్టుగా ఇదే ప్రదర్శనతో ఇదే ఫలితాన్ని రాబడుతామని మాకు తెలుసు. మరో సిరీస్కు ఎం.ఎస్ ధోని లేకుండా వెళ్తున్నాం. ధోని లేకపోవటం ఏ జట్టుకైనా లోటే. కానీ దినేశ్ కార్తీక్ వికెట్ల వెనకాల ఆకట్టుకుంటున్నాడు. విలువైన సూచనలు ఇస్తున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున కలిసి ఆడిన అనుభవంతో చెబుతున్నాను. ఐపీఎల్లో కార్తీక్ సైతం ఓ జట్టుకు సారథి. నాయకుడికి అవసరమైన చిట్కాలు చెప్పటం అతడికి తెలుసు. కార్తీక్తో పాటు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ సైతం వికెట్ కీపింగ్ చేయగలరు.
భయమెరుగని ఆటగాడు : వెస్టిండీస్ పర్యటన మరో అవకాశం అందించింది. యువ ఆటగాడు కృనాల్ పాండ్యను ఈ సిరీస్తో పరీక్ష నెగ్గాడు!. ఐపీఎల్లో ముంబయికి కృనాల్ కీలక ఆటగాడు, అంతర్జాతీయ కెరీర్నూ దూకుడుగా ఆరంభించాడు. బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. కృనాల్ తెలివైన గల్లీ క్రికెటర్. బ్యాట్స్మన్ ఎంత జోరుమీదున్నా భయమెరుగని బౌలింగ్ అతడిది. అతడు దూకుడు మీదుంటే బౌలర్ ఎవరైనా వెనక్కి తగ్గని దూకుడు. ఐపీఎల్లో కృనాల్ ప్రదర్శనను అందరం చూశాం. తమ్ముడు హార్దిక్ పాండ్య మాదిరిగానే కృనాల్ ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యపడడు.
టెస్టులపై బెంగ లేదు : ఇప్పుడే టెస్టు మ్యాచ్లపై ఆలోచన చేయటం లేదు. మరీ అంత ముందస్తుగా ఆలోచించే స్వభావం కాదు నాది. నా ఆలోచన అంతా.. చెన్నై నుంచి ఇంటికెళ్లటం, కొన్ని రోజులు ఖాళీగా గడపటం, మళ్లీ విమానం ఎక్కేసి ఆస్ట్రేలియాకు వెళ్లటం ఇంతే!. నేను దీర్ఘకాలంగా దృష్టి పెట్టాలనుకుంటున్న ఫార్మాట్ టెస్టులు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్లోకి బరిలోకి దిగితే సంతోషిస్తా. బ్యాట్స్మన్గా నా గత ప్రదర్శనల గురించి ఆలోచించను. ప్రతి మ్యాచ్ కొత్త ఆట. ప్రతిసారి మైదానంలోకి వెళ్లినప్పుడు భావోద్వేగాలకు గురికాను. క్రికెట్ సింపుల్ గేమ్. అందుకే అన్ని విషయాలను సింపుల్గానే చూడాలి. మరీ ఎక్కువగా ఆలోచిస్తే, ప్రతిదీ క్లిషమవుతుంది. అందుకే వర్తమానంలో జీవించటం నాకు అత్యంత కీలకం. ఆస్ట్రేలియా పర్యటనలో రాణించటంత కీలకం అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
భారత జట్టు మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నది. కంగారూ స్టార్స్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్లు లేకపోవటంతో ఆస్ట్రేలియా ఎన్నడూ లేనంత బలహీనంగా తయారైంది. ఆసీస్ పర్యటనలో కోహ్లిసేన మూడు టీ20, నాలుగు టెస్టులు సహా మరో మూడు వన్డేలు ఆడనున్నది. టీ20 సిరీస్ నవంబర్ 21న గబ్బా మ్యాచ్తో ఆరంభం కానున్నది. తర్వాతి రెండు టీ20లు మెల్బోర్న్, సిడ్నీలలో జరుగుతాయి. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ డిసెంబర్ 6న తొలి టెస్టుతో ఆరంభం కానున్నది. జనవరి 12 నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది.