Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి చేరుకునేందుకు టీమ్ ఇండియా అమ్మాయిలు తహతహలాడుతున్నారు. తొలి రెండు టోర్నీల్లోనే సెమీస్కు చేరిన అమ్మాయిలు, మళ్లీ ఇంతవరకూ గ్రూప్ దశను దాటలేదు. న్యూజిలాండ్, పాకిస్తాన్లపై అలవోక విజయాలతో జోరుమీదున్న హర్మన్ప్రీత్ సేన నేడు ఐర్లాండ్పై నెగ్గితే నేరుగా సెమీఫైనల్లోకి చేరనున్నది.
- ఐర్లాండ్తో అమ్మాయిల పోరు నేడు
- భీకర ఫామ్లో హర్మన్ప్రీత్, మిథాలీ
- రాత్రి 8.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
గయాన (ప్రావిడెన్స్) : పొట్టి ప్రపంచకప్లో అమ్మాయిలు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్లో టైటిల్ ఫేవరేట్ న్యూజిలాండ్పై, రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై టీమ్ ఇండియా ఏకపక్ష విజయాలు సాధించింది. విధ్వంసక శతకంతో హర్మన్ప్రీత్ సింగ్ తొలి మ్యాచ్తోనే కప్పు దిశగానే మా పయనమని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. వెటరన్ బ్యాట్స్మన్ మిథాలీరాజ్ పాకిస్తాన్పై అర్ధ సెంచరీతో జోరందుకోగా, యువ బ్యాట్స్మన్ జెమీమా రొడ్రిగస్ సత్తా చాటుతోంది. వరుస మ్యాచుల్లో బలమైన జట్లను చిత్తు చేసిన టీమ్ ఇండియా నేడు పసికూన ఐర్లాండ్తో తలపడనున్నది. అర్హత టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ఐర్లాండ్ ప్రపంచకప్కు వచ్చింది. పసికూన ఐర్లాండ్ పోరాట పటిమకు పెట్టింది పేరు. పసికూనే కదా అని తేలిగ్గా తీసుకుంటే ఐర్లాండ్ అద్భుతం చేయగలదు!. ఈ విషయంలో అమ్మాయిలు అప్రమత్తంగానే ఉన్నారని చెప్పాలి!.
మంధాన మెరిసేనా..? : భారత మహిళల క్రికెట్ నయా సంచలనం స్మృతి మంధాన. నిరుడు వన్డే ప్రపంచకప్లో మంధాన మెరుపులు ఇప్పటికీ అభిమానులకు గుర్తున్నాయి. అలాంటిది పొట్టి ప్రపంచకప్లో రెండు మ్యాచులు ముగిసినా.. మంధాన నుంచి మెరుపు ఇన్నింగ్స్ రాలేదు. దీంతో ఐర్లాండ్పై స్మృతి చెలరేగేందుకు రంగం సిద్దం చేసుకున్నది. మహిళల బిగ్బాష్ లీగ్ అనుభవం ఉన్న వేద కృష్ణమూర్తి నుంచి సైతం టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ముంబైకర్ జెమీమా రొడ్రిగస్ మంచి ఫామ్లో కనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాంగ్ బ్యాంగ్ దూకుడుమీదున్నది. మిథాలీరాజ్ క్లాసికల్ ఫామ్ కొనసాగిస్తోంది. వీరద్దరి తాజా ఫామ్తో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిస్తోంది. ఆఫ్ స్పిన్నర్ డి. హేమలత, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్లు తొలి రెండు మ్యాచుల్లో సంయుక్తంగా పది వికెట్లు పడగొట్టారు. నేడు ఐర్లాండ్పైనా స్పిన్ జోడి మాయ కొనసాగటం లాంఛనమే.
ఐర్లాండ్ పోటీనివ్వగలదా? : క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన ఐర్లాండ్ తొలి రెండు మ్యాచుల్లో తేలిపోయింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్లు ఐర్లాండ్పై విజయాలు సాధించాయి. రెండు ఓటములతో ఐర్లాండ్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేటి మ్యాచ్లో భీకర ఫామ్లో ఉన్న టీమ్ ఇండియాకు ఐర్లాండ్ ఏ మేరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం. లారా డలెనె, కిమ్ గరెత్, జోసీ, లవిస్, లూసీలు మెరిస్తే ఐర్లాండ్ ఓ మోస్తరు పోటీనిచ్చే అవకాశం లేకపోలేదు. న్యూజిలాండ్ను చిత్తు చేసిన ప్రావిడెన్స్ పిచ్పైనే ఐర్లాండ్నూ ఎదుర్కొనుండటం టీమ్ ఇండియాకు మరో సానుకూలత.