Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్లో హ్యాట్రిక్ విజయం
- మెరిసిన మిథాలీ, మంధాన
- మహిళల టీ20 ప్రపంచకప్
గయాన (ప్రావిడెన్స్) : అమ్మాయిలు అదరగొట్టారు. సరైన మ్యాచ్ సన్నద్దత లేకుండానే కరీబియన్ దీవులకు చేరిన హర్మన్ప్రీత్ సేన ప్రపంచకప్లో కదం తొక్కుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన అమ్మాయిలు టీ20 ప్రపంచకప్లో హాట్రిక్ విజయం సాధించారు. 8 ఏండ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం ఐర్లాండ్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో టీమ్ ఇండియా 52 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీస్కు ముందు మూడు సార్లు విజేత ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్నది. మిథాలీ రాజ్ (51, 56 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (33, 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 145/6 పరుగులు చేసింది. ఊరించే ఛేదనలో ఐర్లాండ్ అమ్మాయిలు 93/8 పరుగులే చేయగల్గారు. బౌలర్లు రాధ యాదవ్ (3/25), దీప్తి శర్మ (2/15) రాణించారు.
మెరిసిన మిథాలీరాజ్ : తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. వెటరన్ బ్యాట్స్మన్ మిథాలీ రాజ్ (51) నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్తో విజృంభించగా.. మరో ఎండ్లో మంధాన సైతం అదే దూకుడు ప్రదర్శించింది. వీరిద్దరి మెరుపులతో తొలి వికెట్కు భారత్ 67 పరుగులు జోడించింది. ఓపెనర్ల శుభారంభంతో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. యువ బ్యాట్స్మన్ జెమీమా రొడ్రిగస్ (18, 11 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (7, 3 బంతుల్లో 1 సిక్స్), దీప్తి శర్మ (11 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్)లు రాణించారు. వేద కృష్ణమూర్తి (9) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. మిథాలీ రాజ్ వరుస రెండో అర్ధ సెంచరీతో ఐర్లాండ్పై భారత్ మెరుగైన స్కోరు సాధించింది.
ఐర్లాండ్ విలవిల: ఊరించే ఛేదనలో ఐర్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ క్లారె (23), జోసీ (33) పోరాట పటిమ చూపించారు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో ఐర్లాండ్ విలవిల్లాడింది. క్రమం తప్పకుండా వికెట్లు కూల్చిన భారత్.. పది ఓవర్లలోనే విజయాన్ని లాంఛనం చేసుకున్నారు. భారీ హిట్టర్లు లేకపోవటం, సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరగటంతో ఐర్లాండ్ మ్యాచ్పై ఆశలు వదులుకున్నది. నిర్ణీత ఓవర్లలో ఐర్లాండ్ 8 వికెట్లకు 93 పరుగులే చేసింది.