Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెనర్ స్థానం త్యజించటంపై వీవీఎస్
- లక్ష్మణ్ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అనగానే కోల్కతలో అతడు బాదిన 281 పరుగుల ఇన్నింగ్సే గుర్తుకొస్తుంది. వ్యక్తిగతంగా వీవీఎస్తో పాటు భారత క్రికెట్ గమనంలో సైతం విప్లవాత్మక మార్పునకు కారణమైన చారిత్రక ఇన్నింగ్స్ అది. క్రికెట్ జెంటిల్మ్యాన్, వివాదరహిత క్రికెటర్గానే కెరీర్ను ముగించిన లక్ష్మణ్.. వీడ్కోలు ప్రకటనకు మించిన కఠిన నిర్ణయం మరోకటి ఉందని వెల్లడించాడు. గురువారం హైదరాబాద్లో వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథ ' 281 అండ్ బియాండ్' ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ గోపీచంద్లు వీవీఎస్ ఆత్మకథను ఆవిష్కరించారు. ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగ్లెతో సంభాషణలో వీవీఎస్ పలు విషయాలు వెల్లడించారు. ' ఓపెనర్ స్థానాన్ని త్యజించటం అత్యంత కఠినమైన నిర్ణయం. ఆ సమయంలో మళ్లీ భారత్కు ఆడతానో లేదో అనిపించింది. అప్పుడు భారత మిడిల్ ఆర్డర్ బలోపేతంగా ఉంది. తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే భారీ స్కోర్లు చేయటం ఒక్కటే మార్గం అనిపించింది. వీడ్కోలు సైతం కఠినమైన నిర్ణయమే. మనం ప్రేమిస్తున్న దాన్ని వదులుకోవటం అంటే ఎవరికైనా కష్టమే. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్లతో కూడిన దిగ్గజాలతో ఒకడిగా నిలువటం గొప్ప గౌరవం. అందరూ భిన్న శైలి ఆటగాళ్లు.. లక్ష్యం మాత్రం ఒక్కటే. భారత్కు మ్యాచులు గెలిపించాలి. కోల్కతలో ఆస్ట్రేలియాపై చేసిన 281 ఇన్నింగ్స్ నా కెరీర్ను మలుపుతిప్పింది. వ్యక్తిగతంగా నా కెరీర్ను మలుపు తిప్పటంతో పాటు భారత క్రికెట్లోనూ కీలక మలుపు అది. భారత్ ఏ జట్టునైనా జయించగలదు, వరల్డ్ నం.1గా నిలువగలదు అనే ఆత్మవిశ్వాసం నింపిన విజయం అది. అంతకుముందు సిడ్నీ టెస్టులో చేసిన 167 పరుగుల శతకం సైతం నా కెరీర్లో పెను మార్పులకు కారణమైంది. నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి, ఓ గుర్తింపు రావడానికి దోహదం చేసింది' అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. క్రీడా పాత్రికేయులు ఆర్.కౌశిక్ ఈ పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. నవంబర్ 19 నుంచి వీవీఎస్ ఆత్మకథ మార్కెట్లోకి రానున్నది.