Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టుల్లో అన్ని జట్లదీ అదే పరిస్థితి
- చరిత్ర తిరగ రాసేందుకు కోహ్లిసేన వేట
నవతెలంగాణ క్రీడా విభాగం
గత రెండేండ్లుగా టీమ్ ఇండియా టెస్టుల్లో అద్భుత విజయాలు సాధిస్తోంది. ఏడాదిగా టెస్టుల్లో వరల్డ్ నం.1గా కొనసాగుతోంది. అందుకు కారణం సొంతగడ్డపై ఎదురులేని విజయాలు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు సైతం ఇంట గొప్ప విజయాలు సాధించాయి. కానీ ఇంట నుంచి బయటకొచ్చి ఆడమంటేనే అసలు సమస్య ఎదురవుతోంది. టీమ్ ఇండియాది ఇదే పరిస్థితి. కానీ ఆ సంప్రదాయాన్ని చెరిపేసేందుకు కోహ్లిసేన సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ టెస్టుతో భారత్ ఇంట్లోనే కాదు బయటా పులే అని నిరూపించేందుకు కోహ్లి రంగం సిద్ధం చేశాడు!
స్వదేశంలో ఏ జట్టూ బలహీనం కాదు.. రవిశాస్త్రి వ్యాఖ్యలు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఇప్పటికీ సిరీస్ ఫేవరేట్.. అజింక్య రహానె మాటలు. ఆస్ట్రేలియా ప్రస్తుత పరిస్థితి, స్టార్ ఆటగాళ్లు దూరమైన వేళ ఈ మాటలు కాస్త ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ జట్టు బలా బలాలతో ప్రమేయం లేకుండా సొంతగడ్డపై అన్ని జట్లు సత్తా చాటాయి. ఇటీవల అన్ని జట్ల టెస్టు గణాంకాలు అదే నిజమని చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో కోహ్లిసేన టెస్టు సిరీస్లో పరాభవం చవిచూసినా.. విదేశీ గడ్డపై సిరీస్ విజయాలకు ఎంతో దూరంలో లేమని చాటింది. ఆ రెండు పర్యటనల అనుభవాలతో ఆడిలైడ్లో అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్న టీమ్ ఇండియా చరిత్ర తిరగ రాసేందుకు సై అంటోంది.
మనదీ అదే దుస్థితి : ఏడాది కాలంగా టీమ్ ఇండియా టెస్టుల్లో వరల్డ్ నం.1గా అగ్రస్థానాన్ని అనుభవిస్తోంది. 2017లో స్వదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోహ్లిసేన 2-1తో గెల్చుకున్నది. కానీ అంతకముందు 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ పోరులో 0-2తో ట్రోఫీని కోల్పోయింది. 2016లో ఇంగ్లాండ్ను స్వదేశంలో 4-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్, 2018లో ఇంగ్లాండ్ గడ్డపై 1-4తో టెస్టు సిరీస్ను సమర్పించుకున్నది. న్యూజిలాండ్తోనూ ఇదే పరిస్థితి. స్వదేశంలో (2016) కివీస్పై 3-0తో నెగ్గిన కోహ్లిసేన.. అంతకముందు 2014లో కివీస్ గడ్డపై 0-1తో సిరీస్ ఓడిపోయింది. ఇక దక్షిణాఫ్రికాను 2015లో 3-0తో ఓడించిన కోహ్లిసేన, 2018లో సఫారీ గడ్డపై 1-2తో కోల్పోయింది. ఆధునిక క్రికెట్లో అత్యంత బలహీన జట్లుగా ముద్రపడిన శ్రీలంక, వెస్టిండీస్లపై మాత్రమే కోహ్లిసేన ఇంటా, బయటా ఆధిపత్యం ప్రదర్శించింది. స్వదేశంలో 1-0తో, లంకలో 3-0తో ఓడించారు. ఇక విండీస్ను స్వదేశంలో 2-0తో, అక్కడ 2-0తో గెలిచారు. బంగ్లాదేశ్ను 2017లో ఏకైక టెస్టులో ఓడించారు. భారత్ ఆధిపత్యాన్ని సవాల్ చేయగల సత్తా ఉన్న జట్లకు కోహ్లిసేన బయట బుద్ధి చెప్పలేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇంగ్లాండ్లు సైతం స్వదేశంలోనే సత్తా చాటుతున్నాయి. విదేశీ గడ్డపై విజయాలు సాధించటంలో విఫలమయ్యాయి. దక్షిణాఫ్రికా స్వదేశంలో 3-1తో ఆస్ట్రేలియాపై, 2-0తో బంగ్లాదేశ్పై, 2-1తో భారత్పై, 1-0తో న్యూజిలాండ్తో, 3-0తో పాకిస్థాన్పై, 2-0తో వెస్టిండీస్పై విజయాలు సాధించింది. కానీ విదేశాల్లో 1-3తో ఇంగ్లాండ్, 0-3తో టీమ్ ఇండియా, 0-2తో శ్రీలంకలకు సిరీస్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా విదేశాల్లో 2-3తో ఇంగ్లాండ్ చేతిలో, 1-2తో భారత్ చేతిలో, 0-2తో పాకిస్తాన్ చేతిలో, 1-3తో దక్షిణాఫ్రికా చేతిలో, 0-3తో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్దీ ఇదే పరిస్థితి. స్వదేశంలో విజయాలు సాధించినా, విదేశీ పర్యటనల్లో నిరాశపరిచింది. 0-4తో ఆస్ట్రేలియాకు, 0-4తో భారత్కు, 0-1తో న్యూజిలాండ్కు, 0-2తో పాకిస్తాన్లకు టెస్టు సిరీస్లను వదులుకున్నది. న్యూజిలాండ్, శ్రీలంకలు సైతం ఇదే చెత్త ప్రదర్శనను విదేశీల్లో చూపించాయి!. ప్రత్యర్థి బలహీనంగా ఉందని కాదు గానీ, టీమ్ ఇండియా ఇప్పుడు బలోపేతంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్, కెప్టెన్ విరాట్ కోహ్లి బృందం మంచి ఫామ్లో రెచ్చిపోతుంది. ఇక్కడ గత పర్యటనలో నాలుగు సెంచరీలతో చెలరేగిన కోహ్లి ఇప్పుడూ బ్యాట్తో ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతున్నాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా గాయంతో దూరమైనా, రెండో టెస్టుకు అతడు అందుబాటులోకి వస్తాడు. మురళీ విజరు, కెఎల్ రాహుల్లు వార్మప్లో ఫామ్ చాటుకున్నారు. అజింక్య రహానె స్పిన్నూ ఎదుర్కొని నిలువగలనని నిరూపించుకున్నాడు. ఆరో స్థానంలో పోటీపడుతున్న హనుమ విహారి, రోహిత్ శర్మలు జట్టుకు ఉపయుక్త స్కోర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత విదేశీ పర్యటనల్లో వికెట్ల వేటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన బౌలర్లు ఆసీస్లోనూ రాణించగలరు. బుమ్రా, భువి సహా మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్లు ఇక్కడి పిచ్లను సద్వినియోగం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్లు కీలకం కాగలరు. విరాట్ కోహ్లి భీకర ఫామ్లో విజృంభిస్తోన్నా.. జట్టుగా భారత్ రికార్డు విజయంపై ఆశలు రేపుతోంది. దిగ్గజాలకు సాధ్యం కాని కంగారూ గడ్డపై టెస్టు సిరీస్ను సాధించేందుకు కోహ్లిసేన ఆడిలైడ్ నుంచే శ్రీకారం చుట్టడానికి లాంఛనమే!.