Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడా విభాగం
ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో విజయాలు సాధించిన ఏకైక ఆసియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ ఏడాదిలోనే జొహనెస్బర్గ్, నాటింగ్హామ్, ఆడిలైడ్లో కోహ్లి కెప్టెన్గా విజయాలు అందుకున్నాడు.
విదేశీ నేలపై టెస్టు మ్యాచ్. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 50 పరుగుల్లోపే తొలి 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో చివరి నాలుగు వికెట్లను 4 పరుగులకే కోల్పోయింది. 41/4తో మొదలెట్టి, 4/4తో ముగించిన భారత్...ఆ టెస్టు మ్యాచ్ నెగ్గిందంటే ఎవ్వరూ నమ్మరు!. తరాలుగా క్రికెట్ను దగ్గర్నుంచి చూస్తున్న ఔత్సాహికులు సైతం ఈ టెస్టులో భారత్ దారుణ ఓటమి చవిచూసిందనే చెబుతారు. కానీ చరిత్రకు కోహ్లిసేన ఆ అవకాశం ఇవ్వలేదు. చెత్తగా ఆరంభించి, చెత్తగా ముగించినా (బ్యాట్తో).. మిడిల్ మెరుపులతో, బంతి వేగంతో విజయం సాధించవచ్చని నిరూపించింది. ఆడిలైడ్లో ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమ్ ఇండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఏదైనా సాధించేవరకే అసాధ్యమని చెప్పకనే చెప్పింది. 2008 తర్వాత ఆస్ట్రేలియాలో భారత్కు ఇదే తొలి విజయం కాగా, ఓవరాల్గా కంగారూ నేలపై ఆరో విజయం మాత్రమే.
ఆడిలైడ్లో కోహ్లిసేన సాధించినది సాధారణ విజయం ఎంత మాత్రం కాదు. రికార్డు ఛేదనలో ప్రత్యర్థి మానసికంగా ఓటమి అంగీకరించి చెతుతెల్తేసిన సందర్భాల్లో వచ్చిన విజయం కాదు ఇది. టాప్ ఆర్డర్ నేలకూలినా.. లోయర్ ఆర్డర్ అసమానంగా పోరాడి పోటీనిచ్చిన భీకర పోరాటంలో లాగేసుకున్న విజయమిది. ఐదో రోజు ఆస్ట్రేలియా నమోదు చేసిన భాగస్వామ్యాలు వరుసగా 31, 41, 31, 41, 31. నాల్గో వికెట్ పడినప్పటి నుంచీ ప్రతి భాగస్వామ్యం భారత్కు సవాల్ విసిరింది. ప్రతి సందర్భంలోనూ జోడీ బలపడినట్టే కనిపించింది. కానీ ప్రతి భాగస్వామ్యాన్ని విడగొట్టిన కోహ్లిసేన.. ఎప్పటికప్పుడు పైచేయి సాధించింది. అలవోక విజయం ఖాయమని అనుకున్న చోట, అనూహ్య ఫలితం దిశగా మ్యాచ్ సాగుతుంటే ఒత్తిడిని తట్టుకోవటం సాధారణ విషయం కాదు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ లయాన్ పరుగులతో భారత్ ఆందోళన పడటం కనిపించింది. ఆందోళనను ఒత్తిడిగా మారనీయని కోహ్లిసేన.. బంతితోనే ఊపిరీ పీల్చుకున్నది. వరుసగా వికెట్లు కూల్చి ఆధిక్యం నిరూపించుకున్నది. చిన్న చిన్న అడుగులే వేసిన కంగారూ నిజానికి మరో భాగస్వామ్యం దూరంలో నిలిచింది. చివరి ఐదు భాగస్వామ్యాల మాదిరిగానే ఓటమి అంతరం సైతం 31 పరుగులే. ఇన్ని మెరుగైన భాగస్వామ్యాలను విడగొట్టి విజయం సాధించటం గొప్ప విషయం. ఆడిలైడ్ విజయం సిరీస్లో ఆధిక్యమే కాదు కోహ్లిసేనలో ఆత్మవిశ్వాసం సైతం నింపింది. ప్రతికూలంగా సాగుతున్న తరుణంలోనూ.. వికెట్ల వేటలో అలుపెరుగని ప్రయత్నం చేసి సక్సెస్ సాధించారు. 2008 పెర్త్ విజయం తర్వాత ఆసీస్లో భారత్కు లభించిన తొలి విజయమిది. ఆడిలైడ్లో రెండో విజయం నమోదు చేసిన కోహ్లిసేన.. రెండో టెస్టు వేదిక పెర్త్లోనూ డబుల్ ధమాకాకు సిద్ధమవ్వాలి.
' సిరీస్ను భారత్ ఆరంభించిన తీరు అమోఘం. ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ పుజారా బ్యాటింగ్ సూపర్. రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు తోడుగా రహానె భాగస్వామ్యం అద్భుతం. ఈ విజయంతో 2003 జ్ఞాపకాలను గుర్తు చేసింది'
- సచిన్ టెండూల్కర్
' ఇంగ్లాండ్లో తొలి టెస్టును 31 పరుగులతో, దక్షిణాఫ్రికాలో తొలి టెస్టును 60-70 పరుగులతో కోల్పోయాం. ఈసారి ఆస్ట్రేలియా పైచేయి మాది కావటం ఆనందంగా ఉంది. ఎప్పుడైనా విజయారంభం ఎంతో నమ్మకం ఇస్తుంది. తొలి ఇన్నింగ్స్లో కొన్ని చెత్త షాట్లు ఆడారు. కానీ వేగంగా నేర్చుకున్నారు. పుజారా ప్రదర్శన మాగ్నిఫిషియెంట్. ఆసీస్ బౌన్స్ పరిస్థితుల్లో అతడి నుంచి ఇదే కోరుకున్నాం'
- రవిశాస్త్రి, భారత కోచ్