Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ టెస్టులో 31 పరుగులతో విజయం
- చివరి వరకూ పోరాడిన ఆస్ట్రేలియా
- విజృంభించిన బుమ్రా, అశ్విన్, షమి
- సిరీస్లో 1-0 ముందంజలో కోహ్లిసేన
ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)
గతంలో ఇక్కడ ఆడటం లాభించింది. అంతిమంగా గెలుపు ఘనత
బౌలర్లకు దక్కుతుంది. తొలి ఇన్నింగ్స్లో 15 పరుగుల ఆధిక్యం.. రెండో ఇన్నింగ్స్లో నమ్మకాన్ని కల్పించింది. ఎల్లప్పుడూ నా సామర్థ్యంపై నమ్మకం ఉంచాను, కావాల్సినంత అనుభవం నాకుంది'
- చతేశ్వర్ పుజారా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ఏడు దశాబ్దాల ఆసీస్ గడ్డపై ప్రయాణంలో ఏనాడూ ఓ భారత జట్టు సిరీస్ ఆరంభ టెస్టును నెగ్గలేదు. తరాలుగా కంగారూ పర్యటనకు వెళ్లి వస్తోన్నా.. వారిపై ఆధిపత్యం చూపిన చరిత్రే లేదు. కోహ్లిసేన కొత్త చరిత్ర సృష్టించింది. నాటకీయ పరిణామాల నడుమ తీవ్ర ఉత్కంఠ రేపిన ఆడిలైడ్ టెస్టులో విజయ ఢంకా మోగించింది. కంగారూ తోక కంగారు పెట్టినా, సరైన సమయంలో వికెట్లు కూల్చింది. 31 పరుగుల తేడాతో ఆడిలైడ్ టెస్టును సొంతం చేసుకున్నది. నాలుగు మ్యాచుల సిరీస్ 1-0తో ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను 1-0తో మొదలెట్టడం భారత్కు ఇదే ప్రథమం.
84/4.. ఛేదనలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పుడు స్కోరు. టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరగా, తోక కత్తిరించటం ఎంతసేపు అనుకున్నాం. కానీ ఆసీస్ టెయిలెండర్లు అసమాన పోరాట పటిమ చూపించారు. చిన్న భాగస్వామ్యాలతోనే రికార్డు లక్ష్యానికి చేరువయ్యారు. ఆఖర్లో వచ్చిన ప్రతీ ఆటగాడు పరుగులు చేయటంతో కంగారూ పడటం కోహ్లిసేన వంతైంది. తోక చికాకు పెట్టినా ఒత్తిడికి లోనవని కోహ్లిసేన 291 పరుగులకే ఆస్ట్రేలియాకు కుప్పకూల్చింది. 2000 తర్వాత ఆడిలైడ్లో రెండో విజయం (2003, 2018) సాధించిన పర్యాటక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 70 ఏండ్ల ఆసీస్, భారత్ క్రికెట్ పోరాటంలో తొలిసారి టీమ్ ఇండియా కంగారూ నేలపై సిరీస్ తొలి టెస్టులో గెలుపొందింది. తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఆడిలైడ్ టెస్టులో కోహ్లిసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 323 పరుగుల రికార్డు ఛేదనలో ఆస్ట్రేలియా అంచనాలను మించి రాణించింది. టాప్ ఆర్డర్ చేతులెత్తేసినా.. టెయిలెండర్లు గొప్పగా పోరాడి ఆసీస్కు 291 పరుగులు అందించారు. సీమర్లు బుమ్రా (3/68), షమి (3/65), స్పిన్నర్ అశ్విన్ (3/92) ఆడిలైడ్లో ఆసీస్ను విజయానికి దూరం చేశారు. షాన్ మార్ష్ (60, 166 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ టిమ్ పైన్ (41, 73 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడారు. నాథన్ లయాన్ (38 నాటౌట్, 47 బంతుల్లో 3 ఫోర్లు) ఓ ఎండ్లో పోరాడినా ప్రయోజనం లేకపోయింది. 119.5 ఓవర్లలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కథ ముగిసింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అసమాన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన చతేశ్వర్ పుజారా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యం సొంతం చేసుకున్నది. సిరీస్తో రెండో టెస్టు డిసెంబర్ 14 నుంచి పెర్త్లో జరుగనున్నది.
ఆసీస్ పోరాడినా, బౌలర్లు వదల్లేదు
ఓవర్నైట్ స్కోరు 104/4తో చివరి రోజు బ్యాటింగ్కు వచ్చిన ఆతిథ్య ఆస్ట్రేలియా అసమాన పోరాట పటిమ ప్రదర్శించింది. ట్రావిశ్ హెడ్ (14) త్వరగానే అవుటైనా కెప్టెన్ టిమ్ పైన్ (41, 73 బంతుల్లో 4 ఫోర్లు) తోడుగా షాన్ మార్ష్ (60, 166 బంతుల్లో 5 ఫోర్లు) పోరాడాడు. భారత బౌలర్లను ఎదురొడ్డి 60 పరుగులు చేసిన మార్ష్ ఆసీస్కు ఆశలు రేపాడు. మరో ఎండ్లో కెప్టెన్ పైన్ వేగంగా పరుగులు సాధించే పనిలో నిమగమయ్యాడు. మిడిల్, లోయర్ ఆర్డర్లో వచ్చిన ప్రతి ఆటగాడు పరుగులు చేయటంతో ఒక్కో పరుగే ఆసీస్కు కొండంత బలమిచ్చింది!. మార్ష్, పైన్లను బుమ్రా అవుట్ చేయటంతో ఆసీస్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ అలా జరుగలేదు. పాట్ కమిన్స్ (28), మిచెల్ స్టార్క్ (28), నాథన్ లయాన్ (38 నాటౌట్)లు కీలక పరుగులు జోడించారు. టెయిలెండర్లు విసిగించటంతో బౌలర్లు సైతం ఓ సందర్భంలో ఒత్తిడికి లోనయ్యారు. ఆఖరి రెండు వికెట్ల భాగస్వామ్యంలో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకున్నది. లయాన్, హెజల్వుడ్లు క్రీజులో ఉండగా ఆసీస్ 300 పరుగులకు చేరువైంది. దీంతో టీ విరామాన్ని సైతం వాయిదా వేశారు. స్టార్క్ను షమి, కమిన్స్ను బుమ్రా అవుట్ చేసి వాతావరణాన్ని తేలిక చేశారు. హెజిల్వుడ్ను అశ్విన్ అవుట్ చేయటంతో ఆడిలైడ్లో అద్భుతం ఆవిష్కరతమైంది. లోయర్ ఆర్డర్ పోరాటంతో ఆస్ట్రేలియా 84/4 నుంచి 291 పరుగులు చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 250 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 235 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 307 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : అరోన్ ఫించ్ (సి) పంత్ (బి) అశ్విన్ 11, మార్కస్ హారీస్ (సి) పంత్ (బి) షమి 26, ఉస్మాన్ ఖవాజా (సి) రోహిత్ (బి) అశ్విన్ 8, షాన్ మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 60, పీటర్ హ్యాండ్స్కాంబ్ (సి) పుజారా (బి) షమి 14, ట్రావిశ్ హెడ్ (సి) రహానె (బి) ఇషాంత్ 14, టిమ్ పైన్ (సి) పంత్ (బి) బుమ్రా 41, పాట్ కమిన్స్ (సి) కోహ్లి (బి) బుమ్రా 28, మిచెల్ స్టార్క్ (సి) పంత్ (బి) షమి 28, నాథన్ లయాన్ నాటౌట్ 38, జోశ్ హెజిల్వుడ్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (119.5 ఓవర్లలో ఆలౌట్) 291.
వికెట్ల పతనం : 1-28, 2-44, 3-60, 4-84, 5-115, 6-156, 7-187, 8-228, 9-259, 10-291.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 19-4-48-1, జశ్ప్రీత్ బుమ్రా 24-8-68-3, అశ్విన్ 52.5-13-92-3, మహ్మద్ షమి 20-4-65-3, మురళీ విజరు 4-0-11-0.