Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త కోచ్ ఎంపికలో ఎదుల్జీ జోక్యం
- రమేశ్ పొవార్కు అనుకూల వాదనలు
నవతెలంగాణ క్రీడా విభాగం : కరీబియన్ దీవుల్లో టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ను తుది జట్టులోకి తీసుకోక పోవ టం భారత మహిళల క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. ఇప్పుడిప్పుడే అభిమానుల్లో ఆదరణ పొందుతున్న మహి ళల క్రికెట్ను స్వార్థ రాజకీయాలతో మళ్లీ నాశనం చేయో ద్దని సోషల్ మీడియా వేదికగా అభిమానులు హితవు పలికారు. 20 ఏండ్ల పాటు మహిళల క్రికెట్ మారుపేరు గా ఎదిగిన మిథాలీరాజ్ స్వదేశానికి చేరుకున్న తర్వాత బీసీసీఐకి రాసిన లేఖలోని అంశాలు మరింత ఆందోళన కలిగించాయి. తుది జట్టు నుంచి తనను తొలగించడానికి జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం కాదని, బీసీసీఐలో ప్రభావం చూపగల అధికారి ప్రమేయం ఉందని ఆరోపించింది. మహిళల క్రికెట్ జట్టు విషయంలో పాలకుల కమిటీ సభ్యురాలు డయాన ఎదుల్జీ తరచుగా జోక్యం చేసుకుంటోంది. దీంతో మిథాలీరాజ్ నేరుగా ఆమెపైనే బాణం గురిపెట్టింది. దీనిపై చర్చ జరిగినా, ఎదుల్జీ పాత్రపై అప్పట్లో బాహాటంగా ఎవ్వరూ మాట్లాడలేదు. మిథాలీరాజ్ను పక్కనపెట్టిన అంశంలో బీసీసీఐ సీఈవో, జనరల్ మేనేజర్లు సీనియర్ క్రికెటర్లు, కోచ్తో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుక్కొనే పనిలో ఉండగా.. తుది జట్టు ఎంపికలో జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాలను ప్రశ్నించలేమని ఎదుల్జీ వ్యాఖ్యానించింది. పరోక్షంగా కోచ్ రమేశ్ పొవార్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు మద్దతు పలికింది. తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టిన రమేశ్ పొవార్ పదవీ కాలం నవంబర్ 31తో ముగిసింది. నిబంధనల ప్రకారం కొత్త కోచ్ ఎంపిక కోసం ధరఖాస్తులు ఆహ్వానించారు. సీనయర్లతో సరైన సంబంధాలు కొనసాగించటంలో విఫలమైన పొవార్కు పొడగింపు లేదని సంకేతాలు ఇచ్చింది. ఈలోగా టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధానలు కోచ్గా రమేశ్ పొవారే కావాలని బీసీసీఐకి లేఖాస్త్రం సంధించారు. దీంతో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ఆసక్తిగా మారింది.
ఈ పరిణామాలు ఆసక్తిగా సాగుతుండగా.. మరోమారు మాజీ కోచ్ రమేశ్ పొవార్కు లబ్ది చేకూర్చే విధంగా డయాన ఎదుల్జీ బాహాటంగా మద్దతు పలికారు. పురుషుల జట్టు కోచ్ను ఎంచుకునే స్వేచ్ఛ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఉన్నప్పుడు, మహిళల జట్టు కోచ్ను ఎంచుకునే అవకాశం హర్మన్ప్రీత్ కౌర్కు ఎందుకు ఉండకూడదు? అని ఎదుల్జీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తన కెరీర్ను నాశనం చేసేందుకు కుట్ర పూరితంగా కోచ్ రమేశ్ పొవార్ ద్వారా సీవోఏ అధికారి ప్రయత్నిస్తోందని మిథాలీ ఆరోపించింది. మిథాలీపై వేటు కారణంగా కోచ్గా పొవార్ను పక్కన పెడుతున్నారు, దీంతో అతడిని కాపాడేందుకు స్వయంగా ఎదుల్జీ రంగంలోకి దిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకోసం ఎప్పుడొ ముగిసిన కుంబ్లే-కోహ్లి వివాదాన్ని సైతం ఎదుల్జీ ఇప్పుడు బయట పెట్టింది. కుంబ్లేను కాదని, రవిశాస్త్రిని తీసుకోవాలని సీఈవోకు కోహ్లి పదేపదే మొబైల్ సందేశాలు పంపిన విషయాన్నీ ఎదుల్జీ ఇప్పుడు బయటకు వెల్లడించింది. సాధారణంగా బీసీసీఐ ఉన్నతాధికారులు ఎవ్వరూ అంతర్గత సమావేశ వివరాలను పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వెల్లడించరు. కానీ వివాదంగా మారుతుందని తెలిసినా, రమేశ్ పొవార్ను తిరిగి కోచ్గా నియమించేందుకు ఎదుల్జీ రంగంలో దిగటం విమర్శలకు తావిస్తోంది. కెప్టెన్తో సత్సంబంధాలు కొనసాగించే కోచ్ను నియమించాలనే వాదన సబబే కానీ, ఓ దిగ్గజ క్రికెటర్ కెరీర్ నాశనానికి పూనుకున్న వ్యక్తిని కాపాడటం కోసం ఉన్నత స్థానంలో ఉండి నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శలు వినిపిస్తున్నాయి. జట్టులో సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలు, పాలకుల కమిటీ సభ్యుల నడుమ విభేదాలకు దారితీస్తోన్న మహిళల క్రికెట్ కోచ్ ఎంపిక ప్రక్రియ మరెన్ని వివాదాలను తీసుకొస్తుందే చూడాలి!.