Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుస సెట్లలో జపాన్ షట్లర్ చిత్తు
- మోమోట చేతిలో వర్మ ఓటమి
- బీడ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్
గాంగ్జౌ (చైనా) : ప్రపంచ టూర్ ఫైనల్లో తెలుగు తేజం పి.వి సింధు అదిరే బోణీ కొట్టింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఏలో వరల్డ్ నం.3 సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో వరుస గేముల్లో గెలుపొందింది. జపాన్ స్టార్ షట్లర్, డిఫెండింగ్ చాంపియన్ అకానె యమగూచి (జపాన్)పై సింధు 24-22, 21-15తో విజయం సాధించింది. 55 నిమిషాల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన షటిల్ సమరంలో సింధు సత్తా చాటింది. గ్రూప్లో తొలి విజయంతో సెమీఫైనల్స్కు చేరువైంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు షట్లర్లు నాకౌట్కు చేరనున్న సంగతి తెలిసిందే. మరో వైపు పురుషుల సింగిల్స్లో వర్థమాన షట్లర్ సమీర్ వర్మకు తొలి మ్యాచ్ ఓటమి ఎదురైంది. జపాన్ సంచలనం కెంటో మోమోట చేతిలో సమీర్ వర్మ 18-21, 6-21తో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. గ్రూప్-ఏలోని తన తర్వాతి మ్యాచ్లో అమెరికా అమ్మాయి బీవెన్ జాంగ్తో సింధు తలపడనున్నది.
సింధు కొత్త కొత్తగా..! : ఈ సీజన్లో అకానె యమగూచి (జపాన్)తో ఆడిన ఐదు మ్యాచుల్లో సింధు నాలుగింట ఓడింది. దీంతో బుధవారం నాటి మ్యాచ్లో హైదరాబాదీ అమ్మాయిపైనే ఒత్తిడి నెలకొన్నది. సహజంగా షటిల్ కోర్టులో అత్యంత దూకుడుగా ఆడే సింధు.. యమగూచిపై కొత్తగా కనిపించింది. స్మాష్లు సంధించే వీలున్నా.. ఓపిగ్గా ర్యాలీలు ఆడింది. యమగూచిని వ్యూహాత్మకంగానే ఇబ్బంది పెట్టేందుకు మొగ్గుచూపింది. సింధు, యమగూచిలు ఇద్దరూ ఆధిపత్యం కోసం పోటాపోటీగా రాణించటంతో తొలి గేమ్ 27 నిమిషాల పాటు సాగింది. తొలి గేమ్ ఆరంభంలో 6-11తో సింధు ప్రథమార్థం వెనుకంజలో నిలిచింది. కానీ విరామం తర్వాత నెమ్మదిగా కోలుకున్న సింధు 19-19తో స్కోరు సమం చేసింది. సింధు బ్యాక్హ్యాండ్ లక్ష్యంగా ఆడిన యమగూచికి తెలుగు తేజం సరైన రీతిలో బదులిచ్చింది. నెట్ దగ్గర మెరుగైన ఆటతో పైచేయి సాధించింది. 20-20, 21-21, 22-22తో ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠ రేగినా.. వరుసగా రెండు పాయింట్లతో సింధు తొలి గేమ్ను సొంతం చేసుకున్నది. రెండో గేమ్లో 3-1తో దూకుడుగా మొదలెట్టిన సింధు.. తర్వాత నెమ్మదించింది. 3-4, 3-6తో వెనుకంజ వేసింది. 9-9తో పుంజుకున్నా.. విరామ సమయానికి 11-10తో యమగూచి ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో సింధు దుమ్మురేపింది. 12-12 తర్వాత వరుసగా ఆరు పాయింట్లు గెల్చుకున్న సింధు 18-12తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. యమగూచి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా సింధు సావధానంగా బదులిచ్చింది. 21-15తో రెండో గేమ్ను గెల్చుకున్నది.