Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్గా రికార్డు
-ఫైనల్లో ఒకుహరపై విజయం
గ్వాంగ్జౌ : తెలుగు తేజం, ప్రముఖ స్టార్ షట్లర్ పివి సింధు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్గా కొత్త రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఈ టైటిల్ ఫైనల్స్లో జపాన్కు చెందిన నొజోమి ఒకుహరపై 21-19, 21-17 స్కోరుతో వరుస సెట్లలో విజయం సాధించింది. గత ఏడాది ఈ టైటిల్ పోరులో యమగుచి చేతిలో ఒటమితో రన్నరప్గా నిలిచిన సింధూ ఈసారి టైటిల్ గెలిచి తన కలను నిజం చేసుకుంది. ఆదివారం విజయంతో సింధు ఫైనల్ ఫోబియాను కూడా అధిగమించింది. ఈ ఏడాదిలో సింధుకు తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. 2018లో ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, థాయిలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్ల్లో సింధు ఫైనల్స్కు చేరుకున్నా కేవలం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే తాజా టైటిల్ వేటలో మాత్రం వెనకడుగు వేయలేదు. టైటిల్తో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.
గతంలో భారత్ నుంచి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నిలో 2009లో జ్వాలగుత్తా- వి డిజు జోడీ, 2011లో సైనా నెహ్వాల్ తుదిపోరుకు చేరుకున్నారు. అలాగే సింధూ గత ఏడాది ఫైనల్స్కు చేరుకుంది. అప్పట్లో వీరంతా టైటిల్ అందుకోవడంలో విఫలం చెందారు. సింధు ఆదివారంతో ఈ టైటిల్ సాధించిన తొలి ఇండియన్గా నిలిచింది.
ఆదివారం మ్యాచ్లో మొదటి నుంచి ఆధిక్యం కనబర్చిన సింధు తొలి గేమ్ను 21-19తేడాతో సొంతం చేసుకుంది. అనంతరం హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో సింధుపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ 21-17 తేడాతో ఒకుహరపై పైచేయి సాధించి పసిడి కలను సాకారం చేసుకుంది. కీలక సమయంలో చక్కటి రిటర్న్లతో పాటు.. పదునైన స్మాష్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇద్దరి మధ్య రెండో గేమ్ తొలుత హోరాహోరీగా సాగింది. అయితే ప్రత్యర్థి ఒక్క పాయింట్ కూడా ఆధిక్యంలోకి రాకుండా సింధు చాలా జాగ్రత్తగా ఆడింది. ఒక సమయంలో 13-12 తేడా రావడంతో సింధుపై ఒత్తిడి పెరిగింది. దీంతో మూడో గేమ్ కూడా అవసరం అవుతుందని అంతా అనుకున్నారు. అయితే తర్వాత సింధు పుంజుకొని ప్రత్యర్థిపై తనదైన షాట్లతో విరుచుకుపడింది. 21-17 తేడాతో రెండో గేమ్ను సొంతం చేసుకుని టైటిల్ విజేతగా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతంతో సరిపెట్టుకున్న సింధు ఆ తర్వాత కూడా చాలా టోర్నీల్లో ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయింది. దీంతో సింధుకు ఫైనల్ ఫోబియా ఉందన్న విమర్శలు ఎదురయ్యాయి. ఆదివారంతో సింధూ ఆ విమర్శలను పటాపంచలు చేసింది.
సింధు కెరీర్లో ఇది మొత్తంగా 14వ టైటిల్ కావటం విశేషం. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ విజేతగా నిలిచిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సింధుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ కోరారు. సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సింధు టైటిల్ విజేతగా నిలవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్, ఇతర ప్రముఖులతో పాటు సోషల్ మీడియాలోనూ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.