Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1-1తో సిరీస్ సమం
- డర్బన్ తర్వాత ఇదే తొలి విజయం
- 146 పరుగుల తేడాతో పెర్త్లో గెలుపు
- ఛేదనలో 140కే కుప్పకూలిన భారత్
కంగారూ నవ్వింది! కేప్టౌన్ వివాదం తర్వాత తొలి విజయం సాధించింది. ఉత్కంఠ పెర్త్ టెస్టులో స్పిన్నర్ నాథన్ లయాన్ అండతో రెచ్చిపోయిన ఆతిథ్య ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 287 పరుగుల ఛేదనలో భారత్ను 140 పరుగులకే కుప్పకూల్చిన కంగారూలు సిరీస్ను 1-1తో సమం చేశారు.
పచ్చిక పిచ్పై స్పిన్నర్ లేని లోటు కోహ్లిసేనను దెబ్బకొట్టింది. బౌలర్లు స్థాయికి తగిన ప్రదర్శన చేసినా.. ఛేదనలో ఏ దశలోనూ టీమ్ ఇండియా లక్ష్యం దిశగా సాగలేదు. కీలక ఆటగాళ్లు ముందే చెతులెత్తేయగా చివరి ఐదు వికెట్లను 21 పరుగులకే కోల్పోయింది. సిరీస్లో ఆధిక్యం కోసం ఇరు జట్లూ ఇక బాక్సింగ్ డే టెస్టుపై కన్నేయనున్నాయి.
పెర్త్ (ఆస్ట్రేలియా)
ఆతిథ్య ఆస్ట్రేలియా పుంజుకున్నది. టీమ్ ఇండియాపై పెర్త్లో 146 పరుగులతో గెలుపొందింది. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ను 1-1తో సమం చేసింది. స్పిన్నర్ నాథన్ లయాన్ (5/67,3/39) మాయజాలంతో భారత్ ఛేదనలో 140 పరుగులకే పరిమితమైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ హనుమ విహారి (28, 75 బంతుల్లో 4 ఫోర్లు), రిషబ్ పంత్ (30, 61 బంతుల్లో 2 ఫోర్లు) నిష్క్రమించగానే ఆసీస్ లాంఛనం ముగించింది. లంచ్ లోపే కోహ్లిసేనను కుప్పకూల్చి కేప్టౌన్ వివాదం తర్వాత తొలి విజయం సాధించింది. బాల్ టాంపరింగ్ వివాదంలో స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన తర్వాత ఆ జట్టు సాధించిన తొలి టెస్టు విజయం ఇదే కావటం విశేషం. పచ్చిక పిచ్పై భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన నాథన్ లయాన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. సిరీస్లో మూడో టెస్టు బాక్సిండ్ డే రోజు (డిసెంబర్ 26) నుంచి మెల్బోర్న్లో ఆరంభం కానున్నది.
లంచ్లోపే లాంఛనం
ఓవర్నైట్ స్కోరు 115/5తో చివరి రోజు ఛేదనకు వచ్చిన టీమ్ ఇండియా ఏమాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఓపెనర్లు రాహుల్ (0), విజరు (20) సహా పుజారా (4), కోహ్లి (17), రహానె (30)లు అంతకముందే నిష్క్రమించినా.. యువ కెరటాలు హనుమ విహారి (28), రిషబ్ పంత్ (30) అద్భుతం చేస్తారేమో అనే అంచనాలు, ఆశలు ఉన్నాయి. కానీ ఐదో రోజు ఆరు ఓవర్లోనే ఆ ఆశలనూ ఆసీస్ ఆవిరి చేసింది. హనుమ విహారిని సాగనంపిన స్టార్క్ భారత పతనాన్ని వేగవంతం చేశాడు. మరో ఎండ్లో రిషబ్ పంత్ సైతం ఎంతో సేపు నిలువలేదు. లయాన్ బంతిని మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేపి వికెట్ పారేసుకున్నాడు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత టెయిలెండర్లు మరీ తొందరగా పని కానిచ్చారు!. ఆస్ట్రేలియా బౌలర్లను కష్టపెట్టకుండా వెన్వెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. ఉమేశ్ యాదవ్ (2), ఇషాంత్ శర్మ (0), బుమ్రా (0) నాలుగు బంతుల వ్యవధిలో వికెట్లు కోల్పోయారు. మహ్మద్ షమి (0) పరుగులేమీ చేయకుండా మరో ఎండ్లో నిలిచిపోయాడు. 56 ఓవర్లలో ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా పెర్త్ విజయంతో గొప్ప ఊరట చెందింది. బలమైన భారత్పై ఈ గెలుపు కంగారూ శిబిరంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేస్తుందనటంలో సందేహం లేదు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 326 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 283 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 243 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (బి) స్టార్క్ 0, మురళీ విజరు (బి) లయాన్ 20, పుజారా (సి) పైన్ (బి) హెజిల్వుడ్ 4, కోహ్లి (సి) ఖవాజా (బి) లయాన్ 17, రహానె (సి) హెడ్ (బి) హెజిల్వుడ్ 30, విహారి (సి) హారీస్ (బి) స్టార్క్ 28, రిషబ్ పంత్ (సి) హ్యాండ్స్కాంబ్ (బి) లయాన్ 30, ఉమేశ్ యాదవ్ (సి,బి) నాటౌట్ 2, ఇషాంత్ శర్మ (సి) పైన్ (బి) కమిన్స్ 0, షమి నాటౌట్ 0, బుమ్రా (సి,బి) కమిన్స్ 0, ఎక్స్ట్రాలు : 09, మొత్తం : (56 ఓవర్లలో ఆలౌట్) 140.
వికెట్ల పతనం : 1-0, 2-13, 3-48, 4-55, 5-98, 6-119, 7-137, 8-139, 9-140, 10-140.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 17-3-46-3, హెజిల్వుడ్ 11-3-24-2, పాట్ కమిన్స్ 9-0-25-2, నాథన్ లయాన్ 19-3-39-3.