Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుణ్ చక్రవర్తి, జైదేవ్లకు రూ.8.4 కోట్లు
- శామ్ కరన్, ఇన్గ్రామ్లకు బొనంజా
- కనీస ధరకు యువీ ముంబయి సొంతం
- ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలం
జైపూర్ (రాజస్తాన్) : భారత బౌలర్లపై కోట్ల వర్షం కురిసింది. నెట్స్ బౌలర్లుగా పనిచేసిన కుర్రాళ్లను ఐపీఎల్ ఒక్క రోజులో కోటీశ్వరులను చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ ఆటగాళ్ల వేలం ప్రధానంగా బౌలర్లు, ఆల్రౌండర్ల చుట్టూనే తిరిగింది. అన్క్యాప్డ్ యువ ఆటగాళ్ల కండ్లుచెదిరే ధరను దక్కించుకోగా, దిగ్గజాలకు వేలంలో దారుణ భంగపాటు ఎదురైంది. చెన్నై చిన్నోడు వరుణ్ చక్రవర్తి వేలంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 8.4 కోట్లను దక్కించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్రైడర్స్లకు నెట్స్ బౌలర్గా పని చేసిన వరుణ్ చక్రవర్తి తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మిస్టరీ స్పిన్ బౌలింగ్తో పాటు ధనాధన్ బ్యాటింగ్ నైపుణ్యం వరుణ్ చక్రవర్తి కోసం పంజాబ్ను కోట్లు పెట్టించేలా చేసింది. గత సీజన్ వేలంలో రూ. 11 కోట్లు కొట్టేసిన జైదేవ్ ఉనద్కత్ తాజాగా మరోసారి మంచి ధర దక్కించుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్ జైదేవ్ కోసం రూ. 8.4 కోట్లు తిరిగి సొంతం చేసుకున్నది. విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ శామ్ కరన్ రూ. 7.4 కోట్లు (పంజాబ్), కొలిన్ ఇన్గ్రామ్ను 6.4 కోట్లతో (ఢిల్లీ క్యాపిటల్స్) వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
బౌలర్ల కోసం పోటీ : నిరుడే మెగా వేలం జరుగటం, ప్రతి జట్టులోనూ ప్రధాన ఆటగాళ్లు ఉండటంతో తాజా వేలం ప్రధానంగా బౌలర్లు, ఆల్రౌండర్ల కోసమే అన్నట్టు జరిగింది. భారత సీమర్ మహ్మద్ షమి రూ. 4.8 కోట్లతో పంజాబ్ సొంతమవగా, వరుణ్ అరోన్ను రూ. 2.4 కోట్లకు రాజస్తాన్ తీసుకున్నది. దేశవాళీ తాజా సంచలనం శివం దుబెను రూ. 5 కోట్లతో బెంగళూర్ దక్కించుకున్నది. విండీస్ యువ సీమర్ ఒసేన్ థామస్ రూ. 1.1 కోట్లతో రాజస్తాన్, సిమ్రన్ సింగ్ను రూ. 4.8 కోట్లతో పంజాబ్లు జట్టులోకి తీసుకున్నాయి. వేలంలోకి వదులుకున్న వృద్దిమాన్ సాహాను రూ. 1.2 కోట్లతో హైదరాబాద్ తిరిగి తీసుకున్నది. కివీస్ స్టార్ మార్టిన్ గప్టిల్ కనీస ధర రూ. 1 కోటితో హైదరాబాద్ గూటికి చేరుకున్నాడు. రూ. 2.2 కోట్లతో జానీ బెయిరిస్టోను సైతం సన్రైజర్స్ తీసుకున్నది. హైదరాబాదీ ఆటగాడు హనుమ విహారి రూ. 2 కోట్లకు ఢిల్లీ సొంతమయ్యాడు. షిమ్రోన్ హెట్మయర్ రూ. 4.2 కోట్లకు బెంగళూర్, బ్రాత్వేట్ రూ. 5 కోట్లకు కోల్కత, అక్షర్ పటేల్ రూ. 5 కోట్లకు ఢిల్లీ సొంతమయ్యారు.
దిగ్గజాలకు చేదు అనుభవం : ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర (రూ. 16 కోట్లు)తో రికార్డు సృష్టించిన దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను వేలంలో తీసుకునేందుకు ప్రాంఛైజీలు విముఖత వ్యక్తం చేయటం గమనార్హం. తొలి రౌండ్లో అమ్ముడుపోని యువరాజ్ సింగ్ను రెండో సారి ముంబయి ఇండియన్స్ కనీస ధర రూ.1 కోటికి తీసుకున్నది. లసిత్ మలింగను సైతం కనీస ధర రూ. 2 కోట్లకు ముంబయి ఇండియన్సే తీసుకున్నది. విధ్వంసకారులు బ్రెండన్ మెక్కలమ్, అలెక్స్ హేల్స్ సహా భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాలను ఎవ్వరూ తీసుకోలేదు. ఆడం జంపా, మనోజ్ తివారి,సౌరబ్ తివారి, రాహుల్ శర్మ, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, షాన్ మార్ష్, అర్మన్ జాఫర్, జలజ్ సక్సేనా, కెసి కరియప్ప, రీజా హెండ్రిక్స్, హషీమ్ ఆమ్లా, పర్వేజ్ రసూల్, జేసన్ హోల్డర్లు వేలంలో అమ్ముడుపోలేదు.
హాట్ కేక్లు
వరుణ్ చక్రవర్తి - రూ.8.4 కోట్లు
జైదేవ్ ఉనద్కత్ - రూ. 8.4 కోట్లు
శామ్ కరన్ - రూ. 7.2 కోట్లు
కొలిన్ ఇన్గ్రామ్ - రూ. 6.4 కోట్లు
అక్షర్ పటేల్ - రూ. 5 కోట్లు
మహ్మద్ షమి - రూ. 4.8 కోట్లు