Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాండ్య, రాహుల్ వివాదంపై ఎస్జీఎంకు డిమాండ్
- కుర్ర క్రికెటర్ల కెరీర్తో ఆడుకోవద్దని రారు వినతి
ముంబయి : ఓ టెలివిజన్ షోలో మహిళలతో లైంగిక సంబంధాలపై నియంత్రణ కోల్పోయి మాట్లాడిన హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్పై బీసీసీఐ తీవ్ర చర్యలకు పట్టుబడుతోంది!. ఈ విషయంలో కొందరు సభ్యుల తీరు మరీ దూకుడుగా ఉండటం క్రికెట్ వర్గాల్లో కలవరం రేపుతోంది. రాత్రి పార్టీల్లో అమ్మాయిలతో లైంగిక సంబంధాల విషయంలో పాండ్య, రాహుల్ల వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వారిద్దని స్వదేశానికి పిలిపించటమే కాదు, విచారణ సైతం ఎదుర్కొవాలని బీసీసీఐ ఆదేశించింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది, కానీ ఇదే అదనుగా కొన్ని రాష్ట్ర సంఘాలు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయంలో మాజీ కాగ్, పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు సూచనలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. సహచర సభ్యురాలు డయాన ఎదుల్జీ సైతం ఇద్దరు క్రికెటర్లపై కఠిన వైఖరితోనే ఉండటం మరింత క్లిష్ట పరిస్థితికి దారితీస్తోంది.
కుర్రాళ్లు.. మందలిస్తే చాలు! : పాండ్య, రాహుల్ను మందలించి, వారిని సరి చేయటం బీసీసీఐ బాధ్యత. ఈ వివాదంతో క్రికెట్ కెరీర్ నాశనం కాకుండా, భవిష్యత్లో బాధ్యత వ్యవహరించటంపై వారిని కౌన్సెలింగ్ చేయాలి. మళ్లీ వారు మైదానంలో ఆత్మవిశ్వాసంతో ఆడేలా చేయాలి. కానీ ఈ కారణంగా యువ క్రికెటర్ల కెరీర్ను ఇక్కడితో అంతం చేద్దామనే ధోరణి కూడదు అని సీవోఏ చైర్మన్ వినోద్ రారు సహచర సభ్యురాలు ఎదుల్జీకి రాసిన లేఖలో విన్నవించారు. వేగవంతమైన విచారణను వివాదాన్ని కప్పిపుచ్చే కోణంలో చూడవద్దు, క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా సీఈవో చేత విచారణకు అంగీకారం తెలపాలని కోరుతున్నాను అని ఎదుల్జీని రారు కోరారు. ఇప్పటికే ఆసీస్ టూర్ మధ్యలోనే వెనక్కి పిలవటంతో వారు సగం శిక్షకు గురయ్యారని, ప్రపంచకప్ దృష్ట్యా ఈ విషయాన్ని ఎక్కువ కాలం నాన్చవద్దని రారు అభిప్రాయపడ్డారు.
విచారణ మొదలు : బీసీసీఐ తాజాగా జారీ చేసిన షోకాజ్ నోటీసులకు హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ బేషరతు క్షమాపణలు చెబుతూ సమాధానం ఇచ్చారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకరణ 41(సి) ప్రకారం సీఈవో రాహుల్ జోహ్రి విచారణ ఆరంభించారని ఆ అధికారి వెల్లడించారు.
ఎస్జీఎం ఏర్పాటుకు డిమాండ్ : మరో వైపు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఈ విషయంలో అతిగా ప్రవర్తించటం విమర్శలకు చోటిస్తోంది. పది రాష్ట్ర సంఘాలు తాత్కాలిక అధ్యక్షుడు సి.కె ఖన్నాతో ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిసింది. బీసీసీఐకి ప్రస్తుతం అంబుడ్స్మన్ లేరు. దీంతో ఎస్జీఎంలో పాండ్య, రాహుల్ వివాదంపై చర్చించి అంబుడ్స్మన్ నియామకం సహా విచారణపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర సంఘాలు కోరినట్టు సమాచారం. అవసరమైతే ఎస్జీఎం ఏర్పాటుకు నోటీసు ఇవ్వాల్సిందిగా కార్యదర్శి అమితాబ్ చౌదరికి ఖన్నా సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముంబయిలో మాజీ బాస్ ఎన్. శ్రీనివాసన్ అధ్యక్షతన భేటీ అయిన పలు రాష్ట్ర సంఘాల పెద్దలు పాలకుల కమిటీ పాలనకు వీలైనంత ముగింపు పలికి, ఎన్నికలకు సిద్ధమయ్యే కార్యాచరణపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండ్య, రాహుల్ వివాదాన్ని అడ్డుగా పెట్టుకొని, బోర్డు రాజకీయాలకు తెరదీయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.