Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్సన్, బెర్టెన్స్ ఓటమి
- భారత పురుషుల డబుల్స్ జోడీలు పరాజయం
మెల్బోర్న్ : తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడోరౌండ్లోకి నదాల్, ఫెదరర్ ప్రవేశించారు. భారత పురుషుల డబుల్స్ జోడీలు లియాండర్ పేస్, బొప్పన్న, నెడుంఛేజియన్ జోడీలు తొలిరౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టాయి. బుధవారం జరిగిన రెండోరౌండ్ పోటీల్లో రెండోసీడ్ నదాల్ 6-3, 6-2, 6-2 ఎబ్డెన్(ఆస్ట్రేలియా)ను, మూడోసీడ్ రోజర్ ఫెదరర్ 7-6(7-5), 7-6(7-3), 6-3 సెట్ల తేడాతో ఎవాన్స్(బ్రిటన్)పై గెలిచారు. ఇతర పోటీల్లో 18వ సీడ్ స్వాట్జ్మన్(అర్జెటీనా) 6-4, 7-5, 3-6, 6-7(6-8), 6-4తో కుడ్లా(అమెరికా)పై, 19వ సీడ్ బసిలాష్విల్ 3-6, 6-3, 3-6, 6-4, 6-3తో ట్రవాగ్లియా(ఇటలీ)పై చెమటోడ్చి నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించారు. ఐదోసీడ్ కోరె అండర్సన్ 6-4, 4-6, 4-6, 5-7 సెట్ల తేడాతో ట్రాఫియో(అమెరికా) చేతిలో అనూహ్యంగా ఓడి టోర్నీనుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ రెండోరౌండ్ పోటీల్లో రెండోసీడ్ కెర్బర్(జర్మనీ) 6-2, 6-3 మైనా(బ్రెజిల్)పై, రష్యాకు చెందిన షరపోవా 6-2, 6-1 సెట్ల తేడాతో పెటెర్సన్(స్వీడన్)పై గెలిచి మూడోరౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర పోటీల్లో మూడోసీడ్ వాజ్నియాకీ 6-1, 6-3తో లార్సన్(స్వీడన్)ను, ఐదోసీడ్ స్టెఫెన్స్(అమెరికా) 6-3, 6-1తో బాబోస్(హంగరీ)పై సునాయాస విజయాలను నమోదు చేసుకున్నారు.
భారత పురుషుల జోడీలు పరాజయం
ఇక భారత్కు చెందిన లియాండర్పేస్, బొప్పన్న, నెడుంఛేజియన్ జోడీలు తొలిరౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టాయి. లియాండర్-రెయాస్ జోడీ 5-7, 6-7(4-7)తో అమెరికా-ఆస్ట్రియా జోడీ చేతిలో, 15వ సీడ్ బొప్పన్న-షరన్ జోడీ 1-6, 6-4, 5-7 సెట్ల తేడాతో స్పెయిన్కు చెందిన బూస్టా-లోపెజ్ జోడీ చేతిలో ఓడింది. ఇండో-అమెరికన్ జోడీ నెడుంఛేజియన్-మొన్రో జోడీ 4-6, 7-6(10-8), 5-7 సెట్ల తేడాతో క్రొయోషియా-జర్మనీ జోడీ చేతిలో ఓడి నిరాశపర్చారు.