Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఒకుహరపై వరుస గేముల్లో గెలుపు
-మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిని కొత్తగా ఆరంభిస్తోంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న సైనా, మలేషియా మాస్టర్స్ టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తోంది. 2017లో మలేషియా మాస్టర్స్ నెగ్గిన సైనా, మరోసారి ఆ టైటిల్ అందుకునేందుకు చేరువవుతోంది. శుక్రవారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో మాజీ వరల్డ్ చాంపియన్ నొజొమి ఒకుహరను 21-18, 23-21తో వరుస గేముల్లో ఓడించిన హైదరాబాదీ అమ్మాయి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ పోరాటానికి ప్రీ క్వార్టర్స్లోనే తెరపడింది. కొరియా స్టార్ సన్ వాన్ హోతో మూడు గేముల హోరాహోరీలో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్ నెగ్గినా, తర్వాతి గేముల్లో డీలాపడిన శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 23-21, 16-21, 17-21తో పోరాడి ఓడాడు.
మహిళల సింగిల్స్లో సైనా సూపర్బ్ ప్రదర్శన చేసింది. వరుసగా రెండు గేముల్లో 9-15, 14-18తో వెనుకంజలో నిలిచినా గొప్పగా పుంజుకుని గేములు గెల్చుకున్నది. 48 నిమిషాల పోరులో పైచేయి సాధించి క్వార్టర్స్లో కాలుమోపింది. తొలి గేమ్లో 9-9తో సమవుజ్జీలుగా నిలిచిన సమయంలో ఒకుహర వరుసగా ఆరు పాయింట్లు సాధించి భారీ ఆధిక్యం సాధించింది. కానీ సైనా 17-16తో వేగంగా దూసుకొచ్చింది. 17-17తో స్కోరు సమమైనా, సైనా వరుస పాయింట్లతో తొలి గేమ్ సొంతం చేసుకున్నది. రెండో గేమ్లో 4-2తో ముందంజ వేసిన సైనా తర్వాత తడబడింది. 14-12తో ద్వితీయార్థంలోనూ ఆధిక్యంలో నిలిచినా ఒకుహర 18-14తో ఆధిక్యం సాధించింది. నెమ్మదిగా మెరుగైన సైనా 19-19తో సమవుజ్జీగా నిలిచింది. టైబ్రేకర్కు దారితీసిన గేమ్లో మెరుగ్గా రాణించి క్వార్టర్స్కు చేరుకున్నది. నేడు సెమీస్లో ఒలింపిక్ చాంప్ కరొలినా మారిన్తో సైనా తలపడనున్నది.