Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదిలంపై కోహ్లిసేన కన్ను
- ఎగబాకాలని కీవీస్ తహతహ
- భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు
నేపియర్ :భారత్, న్యూజిలాండ్లు నం.2 సమరానికి సిద్ధమయ్యాయి. ప్రపంచకప్కు ముందు వన్డేల్లో నం.2గా నిలువాలని తపిస్తోన్న న్యూజిలాండ్ అందుకు భారత్తో సిరీస్ను వేదిక చేసుకుంటోంది. మరోవైపు యజ్ఞంలా వన్డే సిరీస్ విజయాలు సాధిస్తోన్న కోహ్లిసేన.. కివీస్నూ కొట్టేసి నం.2ను మరింత పదిలం చేసుకోవాలని చూస్తోంది. ఆసీస్పై విజయంతో భారత్, శ్రీలంకపై గెలుపుతో న్యూజిలాండ్లు ఉత్సాహంగా ఉన్నాయి. భారీ హిట్టర్లు, మ్యాచ్ విన్నర్లు, నాణ్యమైన ఆల్రౌండర్లతో కూడిన జట్ల మధ్య పోటీ కావటంతో ఫలితంపై ఆసక్తి నెలకొన్నా, టీమ్ ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. నేపియర్లో నేడు కివీస్, భారత్ తొలి వన్డే పోరు.
మరో ఆసక్తికర పోటీకి రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయంతో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా, ఇక్కడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. భీకర ఫామ్లో ఉన్న కోహ్లిసేన ఐదు మ్యాచుల వన్డే సిరీస్లో ఫేవరెట్గా ఆడుతోంది. మరోవైపు శ్రీలంకను క్లీన్స్వీప్ చేసిన విలియమ్సన్ సేన సొంతగడ్డపై కోహ్లిసేనకు షాకివ్వాలని చూస్తోంది. టాప్ ఆర్డర్లో ధావన్, రోహిత్, కోహ్లి త్రయం న్యూజిలాండ్పై పైచేయి సాధించగా, మిడిల్ ఆర్డర్లో టామ్ లాథమ్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్ త్రయం భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత టాప్-3 సగటు 64కు పైగా ఉండగా, అదే సమయంలో కివీస్ మిడిల్ ఆర్డర్ సగటు 47గా ఉంది. కానీ భారత మిడిల్ ఆర్డర్ సగటు 34 మాత్రమే. దీనికి తోడు స్వింగ్కు అనుకూలించే పరిస్థితుల్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ ద్వయం ఆతిథ్య జట్టుకు అదనపు బలం చేకూర్చనున్నారు. ఆసక్తికర సమీకరణాలు, ర్యాంకింగ్ వేట భారత్, న్యూజిలాండ్ సిరీస్పై ఆసక్తి రెట్టింపు చేస్తున్నాయి.
మిడిల్లో ఏం చేస్తారో? : భారత్, న్యూజిలాండ్లు 2017లో ముంబయిలో ఆడిన వన్డేలో రాస్ టేలర్ విధ్వంసానికి తర్వాతి రెండు వన్డేలకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్పై ఆధిపత్యం చెలాయించిన కివీస్.. భారత్ను డిఫెన్స్లోకి నెట్టింది. నేడు భారత స్పిన్ కూర్పు, మిడిల్ ఓవర్ల వ్యూహం కీలకం కానున్నది. విజరు శంకర్, కేదార్ జాదవ్లు జట్టుకు సమతూకం తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో జడేజా, కుల్దీప్లలో తుది జట్టులోకి ఎవరు వస్తారు? లేదంటే వీరి కాదని ఖలీల్ అహ్మద్ను ఎంచుకోవాలా? అనే అంశం తేలాల్సి ఉన్నది. చిన్న బౌండరీలు కావటంతో స్పిన్నర్లు ఊరించే బంతులేసి ఉపయోగం లేదు. దీంతో మిడిల్ ఓవర్లలో నేర్పుగా బంతిని తిప్పగలిగే స్పిన్నర్ కోసం కోహ్లి చూస్తున్నాడు. బంతితో స్వింగ్స్టార్ భువనేశ్వర్ ఇక్కడ ప్రభావం చూపగలడు. మహ్మద్ షమి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్, ధావన్, కోహ్లిలపైనే ప్రధానంగా ఫోకస్ ఉంది. ఆసీస్పై రాణించిన ఎం.ఎస్ ధోని కివీస్పైనా చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. మెల్బోర్న్లో మెరిసిన కేదార్ జాదవ్, యుజ్వెంద చాహల్లు నేపియర్లోనూ మెరుపు ప్రదర్శన పునరావృతం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ లైనప్లో తన స్థానానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
టాప్ కష్టాలు! : న్యూజిలాండ్కు టాప్ ఆర్డర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓపెనర్ కొలిన్ మన్రో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఆల్రౌండర్గా మెప్పిస్తున్నా, బ్యాట్తో అతడు పూర్తి స్థాయిలో చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. భారత పర్యటనలో విఫలమైన సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సొంతగడ్డపై సత్తా చాటాలని చూస్తున్నాడు. కెప్టెన్ కానె విలియమ్స్కు తోడు రాస్ టేలర్, టామ్ లాథమ్లు బ్యాటింగ్ లైనప్ భారం మోయనున్నారు. లోయర్ ఆర్డర్లో సైతం పరుగులు చేయగల టెయిలెండర్లు ఉండటం ఆతిథ్య జట్టుకు అదనపు బలం. బంతితో ఎన్నడూ పటిష్టంగానే కనిపించే న్యూజిలాండ్ తాజా సిరీస్లోనూ అదే విధంగా బరిలోకి దిగుతోంది. బౌల్ట్, సౌథీ స్వింగ్ సవాల్కు కోహ్లిసేన ఏ విధంగా బదులిస్తుందనేది ఆసక్తికరం. స్పిన్నర్లు శాంట్నర్, సోధిలు మధ్య ఓవర్లలో కీలక పాత్ర పోషించనున్నారు.
పిచ్ రిపోర్టు : పాకిస్తాన్తో జరగాల్సిన రెండు వన్డేలో పేలవ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా రద్దయ్యాయి. దీంతో మెక్లీన్ పార్క్ స్టేడియాన్ని పూర్తిగా ఆధునీకరించారు. 2015 వరల్డ్కప్ తర్వాత మరో పూర్తి స్థాయి వన్డే ఇక్కడ జరుగలేదు. భారత్ చివరగా 2014లో ఆడిన వన్డేలో కోహ్లి శతకం బాదినా, 24 పరుగుల తేడాతో ఓడింది. చిన్న బౌండరీల మైదానం కావటంతో భారీ స్కోర్లు ఖాయం.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజరు శంకర్, జడేజా/కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కానె విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, కొలిన్ డీ గ్రాండ్హోమె/మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లుకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్, ఇశ్ సోధి.
' ఇక్కడ చివరి పర్యటనలో ఎన్నో విషయాలు జరిగాయి. ప్రత్యర్థి ఎక్కడ దెబ్బకొట్టాలని చూస్తోందనే విషయం తెలుసు. నిజానికి, బ్యాటింగ్ లైనప్లో భారత్ గొప్ప అనుభవం ఉన్న జట్టు కాదు. కానీ గత మూడేండ్లలో బ్యాటింగ్ లైనప్ బృందంగా తయారైంది. ఇప్పుడు మా బలంపై మరింత స్పష్టత ఉంది. భారీ స్కోర్లు బాదగల సత్తా కివీస్కు ఉంది. తరచుగా 300 ప్లస్ స్కోరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే వీలైనంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించటంపై, ఛేదనలో బృందంగా పరుగులు చేయటంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాం'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్