Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామిల్టన్ ఓటమిపై విమర్శలు
న్యూఢిల్లీ : ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఛేదనలో టీమ్ ఇండియా తృటిలో టైటిల్ చేజార్చుకున్నది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ 11 పరుగులే చేయగల్గింది. అయినా చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ ఓ బంతికి సింగిల్ నిరాకరించటం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. మరో ఎండ్లో కృనాల్ పాండ్య సైతం భారీ షాట్లు కొట్టగల సమర్థుడు. అయినా, కార్తీక్ సింగిల్ నిరాకరించాడు. చివరి బంతికి సిక్సర్ బాదినా.. ఓటమి అంతరమే తగ్గింది. ఇద్దరు భారీ హిట్టర్లు క్రీజులో నిలిచినా, ఓడటం అభిమానులను నిరాశకు గురి చేసింది. నిజానికి చివర్లో ముగింపు వేళ నాన్స్ట్రయికర్కు సింగిల్స్ నిరాకరించటం ఎం.ఎస్ ధోని శైలి. టెయిలెండర్లతో ఆడుతున్న వేళ మహి సింగిల్స్ తీయడానికి ఇష్టపడడు. కానీ అలా సింగిల్స్ తీయకుండా ఆడిన ప్రతీ మ్యాచ్లో మహి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. హామిల్టన్ టీ20లో కార్తీక్ తీరుపై భజ్జీ సుతిమెత్తని విమర్శలు చేశాడు. ' మహి ఆవల ఎండ్లో బ్యాట్స్మన్ ఉంటే కచ్చితంగా స్ట్రయిక్ ఇస్తాడు. బౌలర్లతో ఆడినప్పుడే ధోని సింగిల్స్ నిరాకరిస్తాడు. కానీ హామిల్టన్లో కార్తీక్తో పాటు కృనాల్ సైతం భారీ షాట్లు ఆడగలడు. సింగిల్కు నిరాకరించడానికి, కార్తీక్ ఏ విధంగా ఆలోచన చేసి ఉంటాడో? జట్టు మేనేజ్మెంట్ నుంచి కార్తీక్కు కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురవుతుంది. కృనాల్కు ఎందుకు స్ట్రయిక్ ఇవ్వలేదని అడుగుతారు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో విజయాన్ని అందించిన కార్తీక్ను ఫినీషర్గా చూస్తున్నారు. ముగింపు మొనగాడు అంటే విన్నింగ్ షాట్ ఆడటం కాదు, విజయం సాధించే మార్గం చూపటం' అని హర్బజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.