Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ వేటలో సింధు, సైనా
- నేటి నుంచే జాతీయ చాంపియన్షిప్స్
గువహటి : బ్యాడ్మింటన్ కోర్టులో హైదరాబాదీల పోటీకి మరోసారి రంగం సిద్ధమైంది. జాతీయ చాంపియన్షిప్స్ వేదికగా అగ్ర బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధులు టైటిల్ వేటలో బరిలో నిలిచారు. క్వార్టర్స్ నుంచి బరిలోకి దిగనున్న సింధు, సైనాలు.. ఈ ఏడాది ఫైనల్లో తలపడటం లాంఛనమే!. నిరుడు ఫైనల్లో సింధుపై నెగ్గిన సైనా.. తాజాగా అదే ప్రదర్శన పునరావృతం చేసి నాల్గో నేషనల్ టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. నిరుడు ఆరు మెగా ఫైనల్స్లో ఎంట్రీ సహా ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ విజేతగా నిలిచిన సింధు ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. మహిళల సింగిల్స్లో ఇద్దరు వరల్డ్ స్టార్స్ బరిలో నిలువటంతో చూపులన్నీ సింధు, సైనాలపైనే నెలకొన్నాయి. మార్చి మొదటి వారంలో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్కు ఇది వీరికి సన్నాహకంగా ఉపయోగపడనున్నది. మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో స్టార్స్ కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరులు గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. దీంతో సమీర్ వర్మ, సాయిప్రణీత్తో పాటు పారుపల్లి కశ్యప్ టైటిల్పై కన్నేశాడు. 83వ బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్షిప్స్ పోటీలు మంగళవారం నుంచి క్వాలిఫయర్స్ మ్యాచులతో అస్సొం రాజధాని గువహటిలో ఆరంభం కానున్నది.