Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎం.ఎస్ ధోనిపై ఎమ్మెస్కే వ్యాఖ్య
న్యూఢిల్లీ : ప్రపంచకప్కు ముందు కీలక వన్డే సిరీస్లు ముగిశాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో టీమ్ ఇండియా అంచనాలను అందుకున్నది. స్వదేశంలో కంగారూలతో వన్డే సిరీస్ ఒక్కటే ఇప్పుడు మిగిలి ఉన్నది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాతి రోజు నుంచే ప్రపంచకప్ ప్రణాళికల్లో నిమగమైన సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ప్రపంచకప్ జట్టుపై ఓ అంచనాకు వచ్చింది. 15 మందితో కూడిన జట్టులో సుమారు 13-14 స్థానాలు ఎవరివో తేలిపోయింది. జట్టులో ఇంకో ఒకట్రెండు స్థానాలపై మాత్రమే సందిగ్థత నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచకప్లో ఎం.ఎస్ ధోని ప్రాధాన్యత అతడి మాటల్లోనే..
సహజ శైలిలో ఆడతాడు : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వన్డేల్లో ఎం.ఎస్ ధోని చాలా చాలా బాగా ఆడాడు. అతడు తన సహజ శైలిలో ఆడుతున్నాననే సందేశం ఇవ్వకనే ఇచ్చాడు. మునుపటి విధ్వంసక విన్యాసాలు ధోని చేస్తాడంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. కొన్ని సార్లు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవటం కారణంగా పరుగులు చేయటం కష్టమవుతోంది. కానీ ఇప్పుడు ధోని రెగ్యులర్గా ఆడుతున్నాడు. అందుకే మునుపటి రీతిలో పరుగులు రాబడుతున్నాడు. అన్నింటి కంటే ముఖ్యంగా, ప్రపంచకప్కు ముందు ధోని ఐపీఎల్లో ఆడతాడు. అక్కడ 14-16 ఉత్కంఠ మ్యాచుల్లో ధోని ఆడతాడు. ఇది మరింత ఉపయుక్తం, ధోని బ్యాటింగ్తో సెలక్షన్ కమిటీ సంతోషంగా ఉన్నది. నిజానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు ముందు ధోని బ్యాటింగ్పై మాకు కొంత బెంగ ఉన్న మాట వాస్తవమే. వికెట్ కీపర్గా అతడిని సాటి ఎవ్వరూ లేరు. కానీ అతడు ఎక్కువ మ్యాచులు ఆడితే, అలవోకగా పరుగులు చేస్తాడనే విషయం మాకు తెలుసు. ఫామ్తో ఒడిదుడికులు ఏ క్రికెటర్కైనా సహజమే. విరాట్ నాతో చెప్పిన ఓ విషయంతో నేను ఏకీభవించాను. ధోనిపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ధోని అనగానే విధ్వంసక విన్యాసాలే ఊహించుకుంటాం. ఇప్పుడు అతడు బౌలర్లపై అంతలా విరుచుకు పడకపోతే, అతడి సామర్థ్యం సన్నగిల్లిందని అంటున్నారు. దిగ్గజాలకు వారి నుంచి ఏం ఆశిస్తున్నామో చెప్పాల్సిన పని లేదు. వారే అంచనాలకు అనుగుణంగా ఆడగలరు. ఆసీస్, కివీస్ టూర్లో మహి అది నిరూపించాడు. ప్రపంచకప్లో మ్యాచ్ విన్నర్గా ధోనిని బలంగా నమ్ముతున్నాం. ప్రపంచకప్లో అతడు అత్యంత ప్రధానమైన ఆటగాడు. కెప్టెన్ కోహ్లికి సలహాదారుడిగా, వికెట్ కీపర్గా, యువ క్రికెటర్లకు మార్గదర్శకుడిగా, స్పిన్నర్లకు వికెట్ల వేటలో సహాయకారిగా, బ్యాట్తో ముగింపులో.. ఇలా ధోని అత్యంత ప్రధాన ఆటగాడు. స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ తర్వాత టీ20ల్లో ధోనీపై వేటు వేయలేదు. 2020 టీ20 ప్రపంచకప్కు వికెట్ కీపర్లను సిద్ధం చేయాలనే ప్లాన్ను ధోనికి చెప్పాం. అందుకే ఆరు టీ20ల్లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్లకు అవకాశం లభించింది. తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు మళ్లీ ధోని గ్లౌవ్స్ అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్కు ప్రాతినిథ్యం ఓ యువ వికెట్ కీపర్కు అవకాశం చేజారుతుందనే అభిప్రాయంతో ధోని దూరమయ్యాడు. అయితే, 2019 ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతాడని నేను చెప్పలేను. మా మధ్య ఆ చర్చ జరుగలేదు. ఇప్పుడు జట్టు దృష్టంతా ప్రపంచకప్ నెగ్గటంపైనే నెలకొన్నది. రిటైర్మెంట్ ప్రణాళికలను ఇటువంటి సందర్భాలలో అడుగలేం!.
ఇక మిడిల్ ఆర్డర్లో నం.4గా ఎంతో మందిని ప్రయత్నించాం. అంబటి రాయుడు నాల్గో స్థానంలో ఆకట్టుకున్నాడు. మూడో ఓపెనర్గా కెఎల్ రాహుల్ అవకాశాలు అతడి ఫామ్పై ఆధారపడి ఉంటుంది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగం. అతడికి మరింత అనుభవం అవసరమని వీలైనప్పుడల్లా భారత్-ఏ తరఫున ఆడిస్తున్నాం. సిడ్నీ టెస్టు సెంచరీ, ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్పై అర్ధ సెంచరీ ప్రదర్శనలు అతడు పరిణిత సాధించాడని చెబుతున్నాయి. ప్రపంచకప్కు పంత్ను ఎంచుకుంటే, ఓ ఆల్రౌండర్ లేదా బౌలర్ను పక్కనపెట్టాలి. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకున్న తర్వాత తుది కూర్పు ఉంటుంది. హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, విజరు శంకర్, రవీంద్ర జడేజాల రూపంలో నలుగురు ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఉపయుక్తం కాగల ఇద్దరిని ఎంపిక చేసుకుంటాం. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు అద్భుతంగా ఆడుతున్నారు. అశ్విన్, జడేజా మంచి ఫామ్లో ఉన్న తరుణంలోనే బౌలింగ్లో వైవిధ్యత కావాలని భావించాం. అందుకే చాహల్, కుల్దీప్లను పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి తీసుకున్నాం. ఈ ఇద్దరు కలిసికట్టుగా అద్భుతాలు చేస్తున్నారు. చాహల్, కుల్దీప్లతో బౌలింగ్ విభాగం బలోపేతమైంది.