Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20లో నిరాశపర్చిన అమ్మాయిలు
- స్వదేశంలో ఇంగ్లాండ్ సవాల్
నవతెలంగాణ-హైదరాబాద్ :
టీ20 ప్రపంచకప్లో రేగిన వివాదాన్ని వన్డే విజయంతో మరిపించిన అమ్మాయిలు, పొట్టి ఫార్మాట్లో తీవ్ర నిరాశ మిగిల్చారు. ప్రపంచకప్ సెమీఫైనల్స్కు చేరిన జట్టు ఈ ఫార్మాట్లో ఆ స్థాయి ప్రదర్శన చేయటంలో పూర్తిగా విఫలమైంది. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సిరీస్లు ఆడనున్న నేపథ్యంలో మహిళల క్రికెట్ వీలైనంత త్వరగా పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉన్నది. చివరి రెండు మ్యాచుల్లో ఛేదనలో విజయానికి చేరువైనా.. ముగింపు ఆనందం మనకు దక్కలేదు. వరుసగా చివరి బంతి ఉత్కంఠలో నిరాశకు లోనైన భారత్ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో రెండోసారి 0-3 వైట్వాష్ ఓటమి మూటగట్టుకున్నది. 2021 టీ20 ప్రపంచకప్ కోసం తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోన్న కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ క్రమంలో వ్యూహాత్మక తప్పిదాలు చేసినట్టుగా అర్థమవుతోంది. టాప్ ఆర్డర్లో ఇద్దరు బ్యాటర్లు భీకర ఫామ్లో ఉన్నా, జట్టు స్కోరులో 75 శాతం పరుగులు వారి బ్యాట్ నుంచే వచ్చినా.. విజయాలకు తోడ్పాడు అందించటంలో అమ్మాయిలు ఘోరంగా విఫలమయ్యారు. ఓటమిని తప్పించేందుకు ఏం చేయాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ' 20 ఓవర్ల పాటు నేను ఆడటమే పరిష్కారం' అని స్మృతీ మంధాన చెప్పడాన్ని బట్టి సహచర బ్యాటర్ల వైఫల్యం అర్ధం చేసుకోవచ్చు. స్మృతీ మంధాన మూడు మ్యాచుల్లో మెరిసినా.. మరో ఓపెనర్ ప్రియా పూనియా నిరాశపరిచింది. మూడు మ్యాచుల్లో ప్రియ కనీసం పది పరుగులైనా చేయలేదు. మూడో స్థానంలో జెమీమా రొడ్రిగస్ ప్రతీసారి తొలి రెండు ఓవర్లలోనే క్రీజులోకి రావాల్సిన పరిస్థితి. మంధాన, రొడ్రిగస్లు జట్టును విజయ పథాన నడిపిస్తున్నారనే ఆనందంలో ఉండగానే... వీరిద్దరు నిష్క్రమించటం వెంటనే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేయటం క్షణాల్లో జరిగిపోయాయి. హఠాత్తుగా కుప్పకూలటం కచ్చితంగా అనుభవం లేమి కారణమే. కానీ జట్టులోని అత్యంత సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ను తుది జట్టు నుంచి తప్పించటం మరోసారి విపరీత విమర్శలకు తావిస్తోంది. ఆఖరి మ్యాచ్లో ఆడిన మిథాలీరాజ్ 20 బంతుల్లో 24 పరుగులు చేసింది. చివరి ఓవరో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. ఓ బౌండరీ బాదింది. చివరి బంతిని బౌండరీకి తరలించటంలో విఫలమైంది. కానీ నిజంగా చివరి మ్యాచ్లో మిథాలీ రాజ్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. మిడిల్ ఆర్డర్లో మిథాలీ లేని వేళ మ్యాచ్ అంతవరకూ సాగలేదు. ముందుగానే ప్రత్యర్థి గెలుపు లాంఛనం చేసుకునేది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నిరుడు గొప్ప ఫామ్లో కనిపించింది. కానీ ఈ ఏడాది తొలి పర్యటనలో ఆమె మెప్పించలేదు. అత్యంత విధ్వంసక బ్యాటర్గా పేరున్న హర్మన్ప్రీత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక బంతితో స్పిన్ త్రయం పూనమ్ యాదవ్, రాధ యాదవ్, ఏక్తా బిస్త్లు మెప్పించారు. హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి సైతం ఆకట్టుకున్నది. కానీ బౌలింగ్ విభాగంలోనూ సీనియర్ సీమర్ గోస్వామి లేని వెలితి తెలుస్తోంది. శిఖా పాండే ఆ లోటును భర్తీ చేయాల్సి ఉన్నా, ఆమె నిరాశపరుస్తోంది. వికెట్ కీపర్ తానియా భాటియా బ్యాట్తో నామమాత్రంగా తయారైంది. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్ ఉన్న నేపథ్యంలో.. ఓపె నింగ్ కష్టాలు, మిడిల్ ఆర్డర్ వైఫల్యాలను టీమ్ ఇండియా వేగంగా పరిష్కరించుకోవాలి. బలమైన ఇంగ్లాండ్పై విజయం మళ్లీ హర్మన్ప్రనీత్ బృందంలో ఆత్మవిశ్వాసం నింపే అవకాశం ఉన్నది.