Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమ విహారి సెంచరీ
- రాణించిన మయాంక్ అగర్వాల్
- విదర్భతో ఇరానీ కప్
నాగ్పూర్ : తెలుగు తేజం హనుమ విహారి శతక విహారం చేశాడు. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తోన్న విహారి, ఇరానీ కప్లోనూ ఇరగ దీశాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన విహారి సెంచరీతో చెలరేగాడు. 211 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో విహారి 114 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ అన్మోల్ప్రీత్ సింగ్ (15) వికెట్ కోల్పోయింది. దీంతో మయాంక్ అగర్వాల్ (95, 134 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి విహారి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అగర్వాల్, విహారి జోరుతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగింది. కానీ విదర్భ స్పిన్నర్ల మాయజాలం, రెస్టాఫ్ ఇండియా జోరుకు అడ్డుకట్ట వేసింది. మయాంక్, విహారిలు రాణించినా.. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో రెస్టాఫ్ ఇండియా 330 పరుగులకే కుప్పకూలింది. విదర్భ స్పిన్నర్లు ఆదిత్య సార్వాటె (3/99), అక్షరు వాకారె (3/62), అక్షరు కర్నెవార్ (1/50) సంయుక్తంగా ఏడు వికెట్లు పడగొట్టి విదర్భను రేసులోకి తీసుకొచ్చారు. సీమర్ రజ్నీశ్ గుర్బాని (2/58) రాణించాడు. చివర్లో అంకిత్ రాజ్పుత్ (22), తన్వీర్ ఉల్ హక్ (25) రాణించటంతో రెస్టాఫ్ 300 పరుగులు దాటింది. లేదంటే మరింత స్వల్ప స్కోరుకు కుప్పకూలేదే!. కెప్టెన్ అజింక్య రహానె (13), శ్రేయాష్ అయ్యర్ (19), ఇషాన్ కిషన్ (2), కృష్ణప్ప గౌతమ్ (7), ధర్మేంద్రసిన్హ జడేజా (6)లు విఫలమయ్యారు. తొలి రోజు చివరి ఓవర్లో రెస్టాఫ్ ఇండియా పదో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్ లైనప్ ఫామ్లో ఉండటంతో విదర్భ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరుపై కన్నేసింది.