Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్ల నిషేధంపై వాడివేడి చర్చ
- ఐసీసీ నిబంధనలపై అసంతృప్తి
నవతెలంగాణ క్రీడా విభాగం :
మొన్న ఆటగాళ్ల ప్రవర్తనా నియామవళి, నిన్న అంపైర్ నిర్ణయ సమీక్ష విధానం, నేడు స్లో ఓవర్ రేటు.. ఇలా ఐసీసీ నిబంధనలపై రోజుకో వివాదం రేగుతూనే ఉన్నది. అవసరమైన చోట తక్కువ శిక్షలు, అసలు అవసరం లేని చోట భారీ వేటు వేయటం ఇటీవల ఐసీసీకి పరిపాటి అయిపోయింది!. ఆటగాళ్ల ప్రవర్తనా నియామవళిలో ఒకే విధమైన తప్పిదానికి వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు శిక్షలు అందుకోవటంతో ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ సంఘం) నిబంధనలపై విమర్శలు రేకెత్తాయి. తాజాగా విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్పై మ్యాచ్ నిషేధం ఐసీసీపై మరోసారి విమర్శలు రేగేలా చేసింది.
సిరీస్ హోరాహోరీగా సాగుతుంది. తుది విజయం కోసం ఇరు జట్లూ సర్వ శక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతాయి. నువ్వా నేనా అనే దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. ఇంతలో ఓ జట్టు నాయకుడిపై వేటు పడుతుంది. నాయకుడు లేని సేన ఆ జోరు కొనసాగించలదా?. అసలు నాయకుడిపై వేటు ఎందుకు పడింది? అతడేమైనా క్రమశిక్షణ నియామవళి అత్రికమించాడా? ప్రత్యర్థి ఆటగాళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేశాడా? లేదా మరేదైనా తప్పిదానికి పాల్పడ్డాడా? అంటే ఐసీసీ సమాధానం.. ' స్లో ఓవర్ రేట్'!. అవును నెమ్మదైన ఓవర్ రేట్తో ఇటీవల కెప్టెన్లు తరచుగా మ్యాచ్ నిషేధానికి గురవుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ ప్రతిభతో హోరెత్తించిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్పై స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. చివరి టెస్టులో స్టార్ ఆటగాడు లేకుండా కరీబియన్లు రంగంలోకి దిగారు. విండీస్ క్రికెట్ ఇప్పుడిప్పుడే టెస్టుల్లో మళ్లీ పూర్వ వైభవం దిశగా సాగుతున్న వేళ, ఐసీసీ నిర్ణయం కరీబియన్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. మ్యాచ్కు హాజరైన అభిమానులు ప్లకార్డలతో ఐసీసీ నిబంధనలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతకీ ఏందీ ఓవర్ రేట్? : ఓవర్ రేట్ అంటే, ప్రతి గంటలో ఫీల్డింగ్ జట్టు పూర్తి చేయాల్సిన ఓవర్ల కోటా. టెస్టుల్లో గంటకు 15 ఓవర్ల చొప్పున పూర్తి చేయాలి. మొత్తంగా రోజుకు 90 ఓవర్లు వేయాలి. వన్డేల్లో అయితే మూడున్నర గంటల్లో 50 ఓవర్ల కోటా పూర్తి చేయాలి. లేదా అంతే సమయంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసినా సరిపోతుంది. ఇక టీ20 ఇన్నింగ్స్ ఏ కారణంగానూ 90 నిమషాల కంటే ఎక్కువ నిడివి మించకూడదు. ఒక వేళ ఐసీసీ నిర్దేశించిన ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ రేట్ అందుకోవటంలో విఫలమైతే, తొలుత మ్యాచ్ ఫీజులో కోత, తర్వాత మ్యాచ్ నిషేధం విధిస్తారు.
ఈ నిబంధనలు 1992 నుంచే అమల్లో ఉన్నాయి. 2003 ఏప్రిల్లో ఐసీసీ ఓవర్ రేట్ నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఓవర్ రేట్ తగ్గితే కెప్టెన్కు శిక్ష పడేలా నిబంధనల్లో మార్పు చేసింది. 1997 నుంచి 2002 వరకు స్లో ఓవర్ రేట్ కారణంగా వరుసగా ఒక్కో ఏడాది 73, 59, 60, 77, 78, 120 ఓవర్ల కోత పడింది. భారత్, వెస్టిండీస్ల మధ్య జరిగిన 2002 పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో ఐదో వికెట్కు విండీస్ జోడీ 73 పరుగులు జోడించి చికాకు పెట్టింది. ఆ మ్యాచ్లో అప్పటికీ విజయం ఏదో జట్టును వరించే అవకాశం కనిపించింది. కానీ వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 18 ఓవర్ల లోటు మిగిల్చింది. ఒకవేళ విండీస్ ఓవర్ రేట్ పాటించి ఉంటే, మరో 36 ఓవర్ల ఆట సాధ్యపడేది. ఆ మ్యాచ్లో ఫలితం తేలేది. టెస్టు క్రికెట్లో ఉద్విగ విజయాలకు అడ్డుగా మారుతున్న ఓవర్ రేట్పై కఠిన వైఖరి తీసుకోవాలనే కృత నిశ్చయంతో ఐసీసీ 2003లో సంస్కరణలు చేపట్టింది. ఇటువంటి సందర్భాల్లో స్లో ఓవర్ రేట్తో ఆడిన జట్టును వదిలేయటంపై అభిమానుల్లో అప్పుడూ అసహనం వ్యక్తమైంది.
విండీస్ ఎప్పుడూ ఇలాగే! : సహజంగా వెస్టిండీస్ అనగానే సీమర్ల అడ్డా. జట్టులో అందరూ సీమర్లే ఉన్నప్పుడు గంటలో 15 ఓవర్లు పూర్తి చేయటం కత్తి మీద సవాల్. దీనికి తోడు విండీస్ జట్టు క్రమశిక్షణకు పూర్తి వ్యతిరేకం! ఆ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవటంతో, వేగంగా ఓవర్ల కోటా పూర్తి చేయటం కష్టసాధ్యమవుతోంది. 2003 నుంచి ఇప్పటివరకు విండీస్ 45 సార్లు ఓవర్ రేట్ను అందుకోలేదు. ఆ జట్టు లోటు 88 ఓవర్లు. తర్వాతి స్థానంలోని పాకిస్థాన్ 32 సార్లు అతిక్రమించగా, 69 ఓవర్ల లోటు. భారత్ 27 సార్లు ఓవర్ రేట్ను చేరుకోలేదు. ఓవరాల్గా 66 ఓవర్ల లోటు మిగిల్చింది. రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, సౌరవ్ గంగూలీలు తరచుగా ఓవర్ రేట్ నిబంధలను అతిక్రమించేవారు. పాంటింగ్ 287 మ్యాచులకు సారథ్యం వహించి 36 ఓవర్ల లోటుతో ఉండగా, స్మిత్ 286 మ్యాచుల్లో 34 ఓవర్ల లోటుతో ఉన్నాడు. కానీ గంగూలీ 64 మ్యాచుల్లోనే 31 ఓవర్ల లోటుతో నిలిచాడు.
మనం మెరుగే : గంగూలీ హయాంలో ఓవర్ రేట్లో టీమ్ ఇండియా వెనుకబడినా, ధోని కెప్టెన్సీలో పురోగతి సాధించింది. ఓవర్ రేట్ కోసం ప్రతి సెషన్లోనూ స్పిన్నర్లను వినియోగించిన ధోని వికెట్లతో పాటు నిబంధనలనూ పాటించినట్టు సాగిపోయాడు. అదే సంప్రదాయం కొనసాగిస్తోన్న విరాట్ కోహ్లి.. 129 మ్యాచుల్లో ఒక్క సారే గీత దాటాడు. భారత్ చివరగా, 2014 ఓవల్ టెస్టులో ఓవర్ రేట్ను అందుకోలేదు. అప్పట్నుంచి వరుసగా 216 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఐసీసీ నిబంధనలను అందుకున్నది. ఓవర్ రేట్లో ఇదో రికార్డు!. ఇదే సమయంలో వెస్టిండీస్ ఓవర్ రేట్ను అందుకుని వరుసగా 48 మ్యాచుల్లోనే ఆడగల్గింది.
సమీక్ష చేయాలా? : టెస్టు క్రికెట్లో ఓవర్ రేట్ నిబంధనలను పున సమీక్షించాల్సిన అవసరం ఉందని క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. జేసన్ హోల్డర్ నిషేధానికి కారణమైన మ్యాచ్లో అతడు రెండు ఓవర్లు నెమ్మదిగా ఉన్నాడు. నిబంధనలు పాటించకుంటే కెప్టెన్లపైనే వేటు పడుతోంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కెప్టెన్లు ఇటీవల స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ నిషేధానికి గురయ్యారు. హోల్డర్ ఇటీవల రెండు ఓవర్ల లోటుతో ఉన్నాడు, ఆ మ్యాచ్ మూడు రోజుల్లోపే ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో స్లో ఓవర్ రేట్తో ఎటువంటి నష్టం జరుగదు. ఐదు రోజుల్లోపు ముగిసిన మ్యాచుల్లో ఈ నిబంధన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2003 నుంచి 62 ఓవర్ రేట్ అతిక్రమణల్లో కేవలం 28 పర్యాయాల్లోనే మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లింది. నాలుగు రోజుల్లో ముగిసినా, లేదా 225 ఓవర్ల లోపు ముగిసిన మ్యాచుల్లో ఓవర్ రేట్ నిబంధన తీసివేయటం మేలని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇటీవల సూచించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్ రేట్పై పెద్దగా విమర్శలు లేవు. పైగా అందులో నిబంధనలు అవసరం. కాలానుగుణంగా నిబంధనల్లో మార్పులు తీసుకు రావటంలో విఫలమైతే, క్రికెట్కు అభిమానులను దూరం చేయటమే అవుతుందని ఐసీసీ గ్రహించాలి.