Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వికెట్ కీపర్గా యువ సంచలనం
- కెఎల్ రాహుల్ పునరాగమనం
- జట్టులోకి కోహ్లి, బుమ్రా
- ఆసీస్తో సిరీస్కు భారత జట్లు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి
ఉత్కంఠ వీడింది!. ప్రపంచకప్లో ఉండాలని అందరూ కోరుకున్న కుర్రాడు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్కప్కు ముందు చివరి వన్డే సిరీస్కు ఎంపికైన రిషబ్ పంత్.. లండన్ టికెట్ లాంఛనం చేసుకున్నాడు. ముంబయి ఇండియన్స్ స్పిన్ సంచలనం మయాంక్ మార్కండె టీ20 జట్టులో చోటు సాధించగా, కెఎల్ రాహుల్ పునరాగమనం చేశాడు. లెఫ్టార్మ్ సీమర్ ఎవరనే ఉత్కంఠకు సెలక్షన్ కమిటీ వినూత్న ముగింపునిచ్చింది. ఖలీల్ అహ్మద్ను అసలు పరిగణనలోకి తీసుకోలేదు!.
రెండో వికెట్ కీపర్గా లండన్ విమానం ఎవరెక్కాలే చర్చకు సెలక్షన్ కమిటీ తాత్కాలిక ముగింపునిచ్చింది!. అనుభవజ్ఞుడు దినేశ్ కార్తీక్ను పక్కనపెట్టి, యువ సంచలనం రిషబ్ పంత్ను భారత జట్టులోకి ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో వన్డే సిరీస్లకు దూరమైన రిషబ్ పంత్, ఈ ప్రపంచకప్లో ఆడేది అనుమానమే అనిపించింది. కానీ మ్యాచ్ విన్నర్ పంత్ జట్టులో ఉండాలని మాజీలే కాదు, జట్టు మేనేజ్మెంట్ సైతం బలంగా కోరుకున్నది. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు రిషబ్ పంత్ రెండో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్లను ప్రకటించింది. ఆసీస్తో వన్డే, కివీస్ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జశ్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో చివరి రెండు వన్డేలు, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి పొందిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసీస్తో సిరీస్కు సారథ్య పగ్గాలు అందుకోనున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున అద్భుతాలు చేసిన స్పిన్ మెరుపు మమాంక్ మార్కండె తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. టీ20 సిరీస్లో మార్కండె ఆడనున్నాడు. భారత పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టీ20, ఐదు వన్డేలు ఆడనున్నది. ఫిబ్రవరి 24న విశాఖలో తొలి టీ20, మార్చి 2న హైదరాబాద్లో తొలి వన్డేతో సిరీస్లు ఆరంభం కానున్నాయి.
కార్తీక్ అవుట్! : నిదహాస్ ట్రోఫీ ఫైనల్స్ తర్వాత భారత నయా ఫినిషర్గా పేరు తెచ్చుకున్న దినేశ్ కార్తీక్ ప్రపంచకప్ జట్టులో లేనట్టే. రిషబ్ పంత్ను కాదని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు కార్తీక్ను ఎంపిక చేయటంతో తమిళనాడు స్టార్ వరల్డ్కప్ జట్టులో ఉండటం ఖాయమనే అనిపించింది. కానీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పంత్కు విశ్రాంతి మాత్రమే ఇచ్చామని వివరణ ఇచ్చాడు. ' ఈ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లో సిరీస్లు ఆడాం. రిషబ్ పంత్ నాలుగు టెస్టుల్లో ఆడాడు, అందుకే దినేశ్ కార్తీక్ను ఎంపిక చేశాం. పంత్కు మంచి విరామం అవసరమని భావించాం. అతడికి 20 రోజుల విరామం లభించింది. తర్వాత ఇంగ్లాండ్ లయన్స్పై ఎ జట్టు తరఫున రాణించాడు. దీంతో వెంటనే న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు పంపించాం. ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేసే ముందు అతడికి ఓ అవకాశం ఇద్దామని ఇప్పుడు జట్టులోకి ఎంపిక చేశాం' అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి లభించింది. అతడి స్థానంలోనే మయాంక్ మార్కండె జట్టులోకి వచ్చాడు. తొలి మూడు వన్డేలకు భువనేశ్వర్ కుమార్కు విశ్రాంతి లభించింది. భువి స్థానంలో సిద్దార్థ్ కౌల్ తొలి మూడు వన్డేల్లో ఆడనున్నాడు. లెఫ్టార్మ్ సీమర్గా వరల్డ్కప్ రేసులో ఉన్న ఖలీల్ అహ్మద్ ఆసీస్తో సిరీస్కు విస్మరించబడ్డాడు. ఆసీస్, కివీస్పై ఆకట్టుకోలేని ఖలీల్ను సెలక్షన్ కమిటీ పక్కపెట్టింది. అతడి స్థానంలో మరో సీమ్ ఆల్రౌండర్ విజరు శంకర్ను ఎంపిక చేసింది. ' ఇటీవల సిరీస్లో విజరు శంకర్ చాలా బాగా ఆడాడు. అతడి ప్రదర్శన జట్టు సమతూకాన్ని మార్చివేసింది. అతడితో జట్టుకు రెండు ప్రయోజనాలు. అందుకే మరికొన్ని మ్యాచుల్లో విజరు ప్రదర్శన చూడాలని అనుకుంటున్నాం. ఇక దినేశ్ కార్తీక్కు వరల్డ్ కప్ తలుపులు మూసి వేసినట్టు కాదు. అతడూ రేసులో ఉన్నాడు' అని ప్రసాద్ తెలిపాడు. టెలివిజన్ షోలో అనుచిత వ్యాఖ్యలతో జట్టుకు దూరమైన కర్ణాటక బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. భారత్-ఎ తరఫున ఆకట్టుకున్న రాహుల్ వన్డే, టీ20 జట్టులో మూడో ఓపెనర్ చోటు సాధించాడు. దీంతో ప్రపంచకప్లోనూ మూడో ఓపెనర్ స్థానం రాహుల్ వశమైందని చెప్పవచ్చు. పిలుపు కోసం ఎదురుచూసిన అజింక్య రహానె, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్లకు నిరాశే మిగిలింది.
వన్డే జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, విజరు శంకర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సిద్దార్థ్ కౌల్/భువనేశ్వర్ కుమార్.
టీ20 జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, విజరు శంకర్, యుజ్వెంద్ర చాహల్, మయాంక్ మార్కండె, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, జశ్ప్రీత్ బుమ్రా.