Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో సింధుపై గెలుపు
-మెన్స్ చాంప్ సౌరవ్ వర్మ
- జాతీయ బ్యాడ్మింటన్
చాంపియన్షిప్స్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆధిపత్యం నిరూపించుకున్నది. వరల్డ్ టూర్ ఫైనల్స్ చాంపియన్ పి.వి సింధుపై సాధికారిక విజయంతో నాల్గోసారి జాతీయ చాంపియన్గా అవతరించింది. 2018 ఫైనల్లోనూ సింధుపై నెగ్గిన సైనా, వరుసగా రెండో ఏడాదీ టైటిల్ సొంతం చేసుకున్నది. మెన్స్ సింగిల్స్లో యువ కెరటం లక్ష్యసేన్పై నెగ్గిన సౌరవ్ వర్మ మూడోసారి విజేతగా నిలిచాడు.
గువహటి :భారత బ్యాడ్మింటన్ గతిని మార్చివేసిన క్రీడాకారిణీలు. ప్రపంచ బ్యాడ్మింటన్పై చెరగని ముద్ర వేసిన షట్లర్లు. దేశంలో క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్ను పాపులర్ గేమ్గా తీసుకొచ్చిన స్టార్ ప్లేయర్స్. ఆ ఇద్దరు మన హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పి.వి సింధు. ఈ ఇద్దరూ ముఖాముఖి ఆడితే చూడాలని అభిమానుల్లో ఎనలేని ఉత్కంఠ. ఇద్దరిలో ఎవరిది పైచేయి అని ఎడతెగని ఆసక్తి. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్ తర్వాత మరోసారి ముఖాముఖి పోటీపడిన సైనా, సింధులు ఆకట్టుకున్నారు. సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ వరుస గేముల్లో సింధుపై సాధికారిక విజయంతో జాతీయ చాంపియన్గా నిలిచింది. 2006, 2007లో తొలుత జాతీయ చాంపియన్షిప్స్ సాధించిన సైనా నెహ్వాల్.. నిరుడు ఫైనల్లోనూ సింధుపై విజయంతో హ్యాట్రిక్ టైటిల్ కొట్టింది. తాజాగా గువహటిలోని అసొం బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన టైటిల్ పోరులో 21-18, 21-15తో సింధుపై గెలుపొందింది. ' జాతీయ చాంపియన్షిప్స్లో ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. నాల్గోసారి టైటిల్ సాధించాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. విలువైన సూచనలు ఇచ్చిన పారుపల్లి కశ్యప్కు ప్రత్యేక ధన్యవాదాలు. టైటిల్ పోరులో చివరి వరకూ పోరాడిని సింధుకు అభినందనలు' అని విజయం సాధించిన అనంతరం సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.
సైనా దూకుడు : ఇటీవల ఇండోనేషియా మాస్టర్స్ నెగ్గిన వరల్డ్ నం.9 సైనా నెహ్వాల్ జాతీయ చాంపియన్షిప్స్లోనూ అదే జోరు చూపించింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ విజయంతో జోరుమీదున్న పి.వి సింధు నేషనల్ టైటిల్ పోరులో తన సీనియర్ షట్లర్ను ఎదురించలేకపోయింది. తొలి గేమ్ ఆరంభంలో వెనుకంజ వేసిన సైనా తర్వాత 5-5తో సింధుతో సమవుజ్జీగా నిలిచింది. విరామ సమయానికి 11-9తో సింధుపై పైచేయి సాధించిన సైనా, ఆ తర్వాత జోరు చూపించింది. లయ అందుకోవటంలో సింధు ఇబ్బంది పడగా, సైనా వేగంగా పాయింట్లు సాధించింది. 21-18తో తొలి గేమ్ను గెల్చుకున్నది. రెండో గేమ్లోనూ సింధు పుంజుకోలేదు. ప్రథమార్థంలో 11-9తో ముందంజ వేసిన సైనా, నాల్గో టైటిల్కు వేగంగా చేరువైంది. 21-15తో రెండో గేమ్ను, నేషనల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నది. 2006, 2007, 2018 విజయాలను సైనా నెహ్వాల్ 2019కు పొడగించింది.
పురుషుల సింగిల్స్లో యువ సంచలనం, ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్యసేన్కు నిరాశే మిగిలింది. సౌరవ్ వర్మ 21-18, 21-13తో లక్ష్యసేన్పై గెలుపొందాడు. 2011, 2017లో టైటిల్స్ సాధించిన వర్మ, తాజాగా మూడోది ఖాతాలో వేసుకున్నాడు. మెన్స్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, చిరాగ్ శెట్టి జోడీ 21-13, 22-20తో టాప్ సీడ్స్ అర్జున్, ఎస్.రామచంద్రన్లపై వరుస గేముల్లో గెలుపొంది టైటిల్ సొంతం చేసుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో మను అత్రి, మనీశా జోడీ18-21, 21-17, 21-16తో గెలుపొందగా, మహిళల డబుల్స్లో శిఖా గౌతమ్, అశ్విని భట్లు 21-16, 22-20తో టైటిల్ సాధించారు.