Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ అనుమతే అంతిమం
- ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సమీప భవిష్యత్లో పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఉండబోవని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు. వివాదాలకు క్రీడలకు అతీతమే కానీ, ఓ దేశం ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నప్పుడు క్రీడలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని అన్నాడు. ' బీసీసీఐ చాలా స్పష్టతతో ఉన్నది. ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప, పాకిస్థాన్తో ఆడేందుకు వెళ్లబోం. క్రీడలకు ఈ విషయాలతో మినహాయింపు ఉంటుంది, నిజమే కానీ ఓ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు చేసేదేమీ ఉండదు. కచ్చితంగా క్రీడలపైనా ఆ ప్రభావం పడుతుంది. ఐసీసీ ప్రపంచకప్లో పాకిస్థాన్తో ఆడటంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రపంచకప్కు ఇంకా సమయం ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో చూద్దాం' అని శుక్లా అన్నాడు. ఉగ్రదాడిపై ప్రజల్లో పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలపై స్పందిస్తూ ' అది ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రజలు ఈ విధంగానే స్పందిస్తారు. పాకిస్థాన్ ఈ విషయాలపై మేల్కోవాలి. ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వటం మానుకోవాలి. ఈ విషయం మేం తొలి నుంచీ చెబుతున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, టన్నుల కొద్ది పత్రాలను పాకిస్థాన్కు సమర్పించాం. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాద నిర్మూలనపై ఆలోచన చేయాలి' అని పేర్కొన్నాడు.