Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్మప్లో మంధాన సేన ఓటమి
ముంబయి: వన్డే సిరీస్కు ముందు ఇంగ్లాండ్ అమ్మాయిలకు సరసమైన ప్రాక్టీస్ లభించింది!. సోమవారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుపై ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ ఫామ్లో ఉన్న స్మృతీ మంధాన బోర్డు జట్టుకు నాయకత్వం వహించటంతో, ఆమెపై అభిమానుల చూపులు నెలకొన్నాయి. కానీ వార్మప్లో మంధాన (19) మెరువలేదు. బ్యాటింగ్ లైనప్లో ఏ ఒక్కరూ నిలబడలేదు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బోర్డు ఎలెవన్ 154 పరుగులకు కుప్పకూలింది. యువ ఓపెనర్ ప్రియ పూనియ (15) మళ్లీ విఫలమైంది. మేఘన (1), డియోల్ (21), వేద కృష్ణమూర్తి (10) ఫామ్ సాధించలేకపోయింది. ఫుల్మలి (23), మణి (28) రాణించగా, బోర్డు జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. స్వల్ప ఛేదనలో ఇంగ్లాండ్ సైతం తడబడింది. 37.3 ఓవర్లలోనే టార్గెట్ను చేరుకున్నా.. 8 వికెట్లు కోల్పోయి తడబడింది. స్టార్ బ్యాటర్ హీథర్ నైట్ (64, 86 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఇంగ్లాండ్కు విజయాన్ని అందించింది. శ్రబ్సోలె (23), విన్ఫీల్డ్ (23) రాణించారు. బోర్డు బౌలర్లలో కోమల్ (3/14), రీమలక్ష్మి (2/24), తనుజ (2/34)లు రాణించారు. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2021 అర్హతకు ప్రామాణికంగా తీసుకునే మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఫిబ్రవరి 22న వాంఖడేలోనే ఆరంభం కానున్నది. భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనున్నది.
అగ్రస్థానంలోనే మంధాన : ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో అగ్ర బ్యాటర్ స్మృతీ మంధాన శిఖర స్థానంలోనే కొనసాగుతున్నది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ధనాదన్ ఆడేసిన మంధాన 196 పరుగులతో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. 774 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో ముందున్న మంధాన వరల్డ్ నం.1 బ్యాట్స్వుమన్గా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎలిసీ పెర్రీ, మెగ్ లానింగ్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ ఆమీ నాల్గో స్థానంలో నిలువగా, భారత సారథి మిథాలీ రాజ్ నం.5గా నిలిచింది. దీప్తి వర్మ 17వ స్థానంలో, హర్మన్ప్రీత్ కౌర్ 19వ స్థానంలో ఉన్నారు. బౌలర్ల జాబితాలో వెటరన్ సీమర్ జులన్ గోస్వామి మూడో స్థానంలో నిలిచింది. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్లు టాప్-10లో చోటు సాధించారు. ఆల్రౌండర్ల జాబితాలోనూ దీప్తి శర్మ నిలిచింది. ఆమె మూడో స్థానం సాధించింది.