Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-2తో వన్డే సిరీస్ ఆసీస్ వశం
- ధావన్, కోహ్లి, పంత్ విఫలం
- ఉస్మాన్ ఖవాజ శతకం
- రాణించిన జంపా, లైయాన్
న్యూఢిల్లీ : ప్రపంచకప్ ముంగిట చివరి ద్వైపాక్షిక వన్డే సిరీస్ భారత్ చేజారింది. 2-0తో సిరీస్ విజయం ముంగిట నిలిచినా.. హ్యాట్రిక్ ఓటములతో ఆస్ట్రేలియాకు తలొంచింది. బౌలర్ల మెరుపులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా నిలువరించినా.. బ్యాట్స్మెన్ వైఫల్యం మరో ఓటమి తెచ్చిపెట్టింది. 273 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ (56) సహా భువనేశ్వర్ కుమార్ (46), కేదార్ జాదవ్ (44) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లైయాన్, ఆడం జంపా భారత జోరుకు ముకుతాడు వేశారు. 2009 తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియా తొలి వన్డే సిరీస్ ఎగరేసుకుపోయింది.
ఆస్ట్రేలియా సాధించింది. ప్రధాన బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్ సాయం లేకుండానే ఉపఖండంలో వన్డే సిరీస్ గెల్చుకున్నది. తొలి రెండు వన్డేల్లో ఓటమితో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడినా.. ఒత్తిడిలో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా నిర్ణయాత్మక ఐదో వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-2తో వన్డే సిరీస్ సొంతం చేసుకున్నది. 2009 తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే తొలి సిరీస్ కావటం విశేషం. ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (56, 89 బంతుల్లో 4 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించినా.. ఢిల్లీ బార్సు శిఖర్ ధావన్ (12), విరాట్ కోహ్లి (20), రిషబ్ పంత్ (16) విఫలమయ్యారు. విజరు శంకర్ (16), జడేజా (0) సైతం అవుటవగా, 132/6తో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేదార్ జాదవ్ (44, 57 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), భువనేశ్వర్ కుమార్ (46, 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఏడో వికెట్కు 91 పరుగులు జోడించి విజయంపై ఆశలు చిగురింపజేశారు. కానీ చివర్లో వరుస బంతుల్లో ఈ ఇద్దరూ నిష్క్రమించగా ఆసీస్ అలవోకగా గెలుపొందింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (100, 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) శతకానికి తోడు పీటర్ హాండ్స్కాంబ్ (52, 60 బంతుల్లో 4 ఫోర్లు) అర్ద సెంచరీతో 272 పరుగులు చేసింది.
టాప్ వైఫల్యం : ఛేదనలో భారత్ ఆరంభం నుంచీ తడబడింది. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ (56, 89 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఒక్కరూ రాణించలేదు. లోకల్ హీరోలు శిఖర్ ధావన్ (12), విరాట్ కోహ్లి (20), రిషబ్ పంత్ (16) ముగ్గురూ విఫలమయ్యారు. కమిన్స్ బౌలింగ్లో ధావన్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇవ్వగా.. స్టోయినిస్ బంతికి విరాట్ అదే రీతిలో అవుటయ్యాడు. లైయాన్పై భారీ షాట్ ఆడబోయి పంత్ నిష్క్రమించాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ పోరాటం చేసినా.. నిలకడగా సహకారం లభించలేదు. కోహ్లి, పంత్ సహా విజయ్ శంకర్ (16) నిలిచినట్టే నిలిచి పెవిలియన్కు చేరుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత జంపా బౌలింగ్లో క్రీజు వదిలిన రోహిత్ శర్మ స్టంపౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా (0) వచ్చీ రాగానే డకౌట్గా నిష్క్రమించాడు. 132/6తో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
జాదవ్, భువి పోరాటం : ఈ దశలో కేదార్ జాదవ్ (44, 57 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), భువనేశ్వర్ కుమార్ (46, 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) పట్టు విడువని పోరాటం చేశారు. వికెట్ల మధ్య పరుగు తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. ఏడో వికెట్కు 91 పరుగులు జోడించిన ఈ జోడీ విజయంపై ఆశలు రేకెత్తించింది. జాదవ్, భువి జోడీ జోరుతో ఆసీస్ ఒత్తిడిలో పడింది. కానీ 24 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో వరుస బంతుల్లో భువి, జాదవ్ నిష్క్రమణ భారత్ ఓటమి లాంఛనం చేసింది. కమిన్స్ ఓవర్లో భువి క్యాచౌట్ కాగా, రిచర్డ్సన్ బంతిని మిడ్ వికెట్ మీదుగా బాదిన జాదవ్ వికెట్ కోల్పోయాడు. కుల్దీప్ యాదవ్ (8), మహ్మద్ షమి(3) సైతం వికెట్ కోల్పోగా 237 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఆసీస్ యువ స్పిన్నర్ ఆడం జంపా (3/46) మాయ చేయగా.. కమిన్స్, రిచర్డ్సన్, స్టోయినిస్లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
ఖవాజ శతకం : వరుసగా మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించేలా కనిపించింది. 175/1తో పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు నిలువరించారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (100, 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) శతకంతో మెరిసినా.. ఆసీస్ 300 పరుగులు దాటలేదు. ఓపెనర్ ఫించ్ (27)తో కలిసి తొలి వికెట్కు ఖవాజ 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. జడేజా ఓపెనర్లను విడదీయగా.. పీటర్ హాండ్స్కాంబ్ (52)తో ఖవాజ జోరు కొనసాగించాడు. ఇద్దరూ ఫామ్లో ఉండటంతో వేగంగా పరుగులు రాబట్టారు. బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ జోడీ 102 పరుగులు జోడించింది. హాండ్స్కాంబ్ అర్ద సెంచరీతో కదం తొక్కాడు. ఈ దశలో ఆసీస్ దూకుడుకు జడేజా, షమి, భువి కళ్లెం వేశారు. సెంచరీ పూర్తైన వెంటనే ఖవాజ, హాండ్స్కాంబ్, మాక్స్వెల్ (1)లను సాగనంపారు. 175/1 నుంచి 182/4తో ఆసీస్ ఒత్తిడిలో పడింది. మార్కస్ స్టోయినిస్ (20), ఆష్టన్ టర్నర్ (20)లు బౌండరీలతో మెరిసినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. చివర్లో టెయిలెండర్లు జై రిచర్డ్సన్ (29, 21 బంతుల్లో 3 ఫోర్లు), పాట్ కమిన్స్ (15, 8 బంతుల్లో 2 ఫోర్లు) ధనాధన్తో ఆస్ట్రేలియా 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమి, రవీంద్ర జడేజాలు చెరో రెండు వికెట్లు కూల్చారు. ప్రపంచ అత్యుత్తమ డెత్ బౌలర్ జశ్ప్రీత్ బుమ్రా వన్డే కెరీర్లో స్లాగ్ ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు. తొలి ఎనిమిది ఓవర్లలో 23 పరుగులే ఇచ్చిన బుమ్రాపై రిచర్డ్సన్, కమిన్స్లు రెండేసి ఫోర్లతో 19 పరుగులు పిండుకున్నారు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్కే సాధ్యం కాని బుమ్రాపై ఆధిపత్యం.. ఆసీస్ టెయిలెండర్లు సాధించి నివ్వెర పరిచారు!.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : ఉస్మాన్ ఖవాజ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 100, అరోన్ ఫించ్ (బి) రవీంద్ర జడేజా 27, పీటర్ హాండ్స్కాంబ్ (సి) పంత్ (బి) షమి 52, గ్లెన్ మాక్స్వెల్ (సి) కోహ్లి (బి) రవీంద్ర జడేజా 1, మార్కస్ స్టోయినిస్ (బి) భువనేశ్వర్ 20, ఆష్టన్ టర్నర్ (సి) జడేజా (బి) కుల్దీప్ యాదవ్ 20, అలెక్స్ క్యారీ (సి) పంత్ (బి) షమి 3, జై రిచర్డ్సన్ రనౌట్ (కోహ్లి/పంత్) 29, పాట్ కమిన్స్ (సి,బి) భువనేశ్వర్ 15, నాథన్ లైయాన్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 04, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 272.
వికెట్ల పతనం : 1-76, 2-175, 3-178, 4-182, 5-210, 6-225, 7-229, 8-263, 9-272.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 10-0-48-3, మహ్మద్ షమి 9-0-57-2, జశ్ప్రీత్ బుమ్రా 10-0-39-0, కుల్దీప్ యాదవ్ 10-0-74-1, రవీంద్ర జడేజా 10-0-45-2, కేదార్ జాదవ్ 1-0-8-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (స్టంప్డ్) అలెక్స్ (బి) జంపా 56, శిఖర్ ధావన్ (సి) అలెక్స్ (బి) కమిన్స్ 12, విరాట్ కోహ్లి (సి) అలెక్స్ (బి) స్టోయినిస్ 20, రిషబ్ పంత్ (సి) టర్నర్ (బి) లైయాన్ 16, విజరు శంకర్ (సి) ఖవాజ (బి) జంపా 16, కేదార్ జాదవ్ (సి)మాక్స్వెల్ (బి) జై రిచర్డ్సన్ 44, రవీంద్ర జడేజా (స్టంప్డ్) అలెక్స్ (బి) జంపా 0, భువనేశ్వర్ కుమార్ (సి) ఫించ్ (బి) పాట్ కమిన్స్ 46, మహ్మద్ షమి (సి,బి) రిచర్డ్సన్ 3, కుల్దీప్ యాదవ్ (బి) స్టోయినిస్ 8, జశ్ప్రీత్ బుమ్రా నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 15, మొత్తం :(50 ఓవర్లలో ఆలౌట్) 237.
వికెట్ల పతనం : 1-15, 2-68, 3-91, 4-120, 5-132, 6-132, 7-223, 8-223, 9-230, 10-237.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 10-1-38-2, జై రిచర్డ్సన్ 10-0-47-2, మార్కస్ స్టోయినిస్ 4-0-31-2, నాథన్ లైయాన్ 10-1-34-1, ఆడం జంపా 10-1-46-3, గ్లెన్ మాక్స్వెల్ 6-0-34-0.