Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టుల్లో ఒకే బంతిపై మండిపాటు
న్యూఢిల్లీ : టెస్టు క్రికెట్ పట్ల అభిమానుల్లో ఆదరణ పెంచేందుకు ఎంసీసీ (మార్ల్లెబోన్ క్రికెట్ క్లబ్) సూచించిన సిఫారసులపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఆరంభ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్స్లో ఒకే తరహా బంతిని వినియోగించాలని ఇటీవల ఎంసీసీ సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఒకే బంతి సూచనను దురదృష్టకరంగా అభివర్ణించిన సన్నీ, విదేశీ పరిస్థితుల సవాల్ను ఇది పూర్తిగా తొలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు. ' బంతి ప్రామాణికతపై ఎంసీసీ మాట్లాడటం చూశాం. ఇదే విధంగా పిచ్లను ప్రామాణికరించటం, బ్యాట్ను ప్రామాణికరించటం, అన్ని విషయాలను ప్రామాణికరించటం చేస్తే క్రికెట్ ఆడటంలో ఏముంది? విదేశాల్లో పర్యటించి, భిన్న పరిస్థితుల్లో విజయాలు సాధించాలనే ఆలోచనే లేకుండా పోతుంది. ఎంసీసీ వరల్డ్ కమిటీ అనేది మన క్రికెట్ క్లబ్, నేషనల్ క్రికెట్ క్లబ్ లేదా మద్రాస్ క్రికెట్ క్లబ్ వంటిదే. కానీ ఎంసీసీ చేసిన సూచనలనే ఐసీసీ వినాలనే ధోరణి వారిలో పెరిగిపోయింది. దురదృష్టశావత్తు చాలా మంది ప్రజలు ఎంసీసీ సూచనలను సీరియస్గా తీసుకుంటున్నారు' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. ప్రస్తుతం భారత్లో ఎస్జీ బంతులు వాడుతుండగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్లు డ్యూక్ బాల్స్ వినియోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూకాబుర్రా బంతులతో ఆడుతున్నాయి. ' వ్యక్తిగతంగా క్రికెట్ అనగానే భిన్న పరిస్థితుల్లో, భిన్న సందర్భాల్లో ఆడటమే. ప్రతి వీధికి భిన్నమైన పరిస్థితులు చూస్తుంటాం. అలాంటిది దేశాల నడుమ ఉండకూడదా? అన్ని రకాల పిచ్లపై, భిన్న పరిస్థితుల్లో నాణ్యమైన ప్రదర్శన చేసినప్పుడే గొప్ప క్రికెటర్లుగా గుర్తింపు పొందుతారు. పరిస్థితులను ప్రామాణికరింలేమని సన్నీ అన్నాడు. ప్రపంచకప్లో భారత అవకాశాలపై అడిగిన ప్రశ్నకు గవాస్కర్ వ్యంగ్యంగా బదులిచ్చాడు. ' దీనికి సమాధానం ఇచ్చేందుకు ఎంతగానో సంతోషిస్తాను. కానీ దురదృష్టం కొద్ది నేను విరాట్ కోహ్లి చేతిని చూడలేదు. అందుకే నేను సమాధానం చెప్పలేను. అయితే, భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని విశ్వసిస్తున్నాను' అని లిటిల్ మాస్టర్ ముగించాడు.