Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయోగాలకు ఓటమికి సాకు కాదు
- ఐపీఎల్ పని భారం బాధ్యత ఆటగాళ్లదే
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లి
2-0తో సిరీస్లో అద్భుత ఆరంభం లభించిన తర్వాత, సొంతగడ్డపై టీమ్ ఇండియా సిరీస్ కోల్పోతుందని ఎవ్వరూ ఊహించలేదు. 0-2 వెనుకంజలో ఎన్నడూ సిరీస్ సాధించని కంగారూలు సైతం, కోహ్లిసేన 3-2 విజయాన్ని ఊహించి ఉండరు!. కానీ టర్నర్, ఖవాజ, మాక్స్వెల్, హాండ్స్కాంబ్ మెరుపులు ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాయి. ప్రపంచ కప్ ముంగిట కోహ్లిసేనకు ఇదే చివరి వన్డే సిరీస్ కావటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సిరీస్ ఫలితం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపబోదని, ప్రపంచకప్లో ఏం కావాలనే స్పష్టత జట్టుకు ఉన్నదని కెప్టెన్ కోహ్లి వెల్లడించాడు.
న్యూఢిల్లీ : ఎంత ఎక్కువ సహనంతో క్రీజులో నిలిస్తే ఆ జట్టే టెస్టులు సొంతం చేసుకుంటుంది. ఒత్తిడిని ఎవరు అధిగమిస్తే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయాలు వారి సొంతమవుతాయి. ఒక్క మాటలో క్రికెట్ ఫలితాలను శాసించే రెండు అంశాలు ఇవే!. అందుకే, భారత్పై ఆస్ట్రేలియా 3-2తో వన్డే సిరీస్ సాధించింది. అదీ కూడా, ప్రధాన బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్ సహకారం లేకుండానే సాధించింది. ఊహించిన ఓటమి కోహ్లిసేనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని అంచనా వేసినా.. కెప్టెన్ కోహ్లి సిరీస్ ఫలితంపై కూల్గా సమాధానం ఇచ్చాడు. ఈ ఓటమితో డ్రెస్సింగ్రూమ్లో ఏ ఒక్క ఆటగాడు ఆందోళన చెందటం లేదని, ప్రపంచకప్లో ఏ జట్టుతో బరిలోకి దిగాలనే స్పష్టత మాకు ఉన్నదని కుండ బద్దలు కొట్టాడు. ఫిరోజ్ షా కోట్లా మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్లో పలు విషయాలపై మాట్లాడాడు.
కూర్పుపై అవగాహన ఉంది : ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్ను కోల్పోవటంపై డ్రెస్సింగ్ రూమ్లో ఎవ్వరూ ఆందోళన చెందటం లేదు. సహాయక సిబ్బంది ఎక్కడా చింతించటం లేదు. దీని తర్వాత వరల్డ్కప్ ఉంటుంది కాబట్టి, గత మూడు మ్యాచుల్లో ఏం చేయాలని అనుకున్నామో మాకు తెలుసు. భారత్ది సమతూకమైన జట్టు. కేవలం ఒత్తిడి సమయాల్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. సిరీస్ విజేతగా నిలిచింది. ఓ జట్టుగా, కాంబినేషన్ పరంగా, పరిస్థితుల వారీగా సిద్దంగా ఉన్నాం. గరిష్టంగా ఒక్క మార్పుతో పరిస్థితులకు తగిన తుది జట్టు సిద్ధమవుతుంది. ఇది కాకుండా, ప్రపంచకప్లో మేం కావాలనుకునే తుది జట్టుపై స్పష్టమైన అవగాహన ఉన్నది.
ప్రయోగాలు సాకు కాదు : వన్డే సిరీస్ ఓటమికి ప్రయోగాలు ఏమాత్రం కారణం కాదు. చివరి మూడు మ్యాచుల్లో బెంచ్కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. కఠిన పరిస్థితుల్లో వారు ఏ విధంగా రాణిస్తారో చూడాలని భావించాం. ఈ ప్రయోగాలు ఈ మూడు మ్యాచుల్లో కాకుండా, మరెక్కడా చేయలేం. ప్రయోగాలకు ఓటమికి ఎంతమాత్రం సాకు కాదు, ఎందుకంటే క్రికెట్ ప్రమాణాలను మెరుగుపర్చాలనే అనుకునే జట్టు మాది. తుది జట్టు మార్పులను ఎన్నడూ ఓటమికి కారణాలుగా చూడం. కానీ భిన్న పరిస్థితుల్లో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించుకున్నాం.
ఒత్తిడిని జయించారు : మొహాలిలో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వటంపై మాట్లాడుతున్నారు. కానీ ఇవి మన పరిస్థితులు. మనకు మనముగా మన పరిస్థితులను తక్కువ చేయలేం. ఒత్తిడి సమయాల్లో ఆస్ట్రేలియా మెరుగ్గా రాణించింది. ఒత్తిడిలో సానుకూల దృక్పథంతో, ధైర్యంగా ఆడిందని చెప్పగలను. మొహాలిలో మాక్స్వెల్ అవుటైన తర్వాత 13 ఓవర్లలో 130 పరుగులు ఛేదించటం తిరుగులేని ప్రదర్శన. ఆస్ట్రేలియా బౌలర్లు సరైన లెంగ్త్లో బంతులేసి, చెత్త షాట్లు ఆడేలా చేశారు. ప్రత్యర్థికి ఘనత ఇవ్వాల్సిన చోట ఇచ్చేయాలి. భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆస్ట్రేలియా ఈ పని చేసింది. విజయానికి ఆ జట్టు పూర్తి అర్హత ఉంది.
ఐపీఎల్లో పని ఒత్తిడిపై పరిశీలన : ఐపీఎల్లో పని భారంపై తొలి బాధ్యత ఆటగాళ్లదే. ప్రపంచకప్కు ముందు విరామంతో కొత్తగా సిద్ధం అవ్వాలని భావించిన ఆటగాళ్లు ఆ విషయాన్ని తెలియజేయాలి. జట్టు మేనేజ్మెంట్, ఫిజియో పాట్రిక్ ఎప్పటికప్పుడు వరల్డ్కప్ జట్టుతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటారు. ప్రపంచకప్ నాలుగేండ్లకు ఒకసారి వచ్చేది, కానీ ఐపీఎల్ ప్రతి ఏడాదీ ఆడతాం. అలాగని, ఐపీఎల్లో అంకితభావంతో ఆడమనే ఉద్దేశం కాదు. తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. కచ్చితంగా ఆడాలనే ఒత్తిడి ఎవరిపైనా ఉండదు. అంతిమంగా ప్రపంచకప్కు దూరం కావాలని ఎవరూ అనుకోరు.