Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టుల్లో తొలి విజయం
డెహ్రాడూన్ : టెస్టు క్రికెట్కు మరో కొత్త విజేత. టెస్టు జట్టు హౌదా పొందిన 19 నెలల కాలంలోనే అఫ్గనిస్థాన్ ఐదు రోజుల ఆటలో అదరగొట్టింది. డెహ్రాడూన్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ఐర్లాండ్తో జరిగిన టెస్టులో అఫ్ఘాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 147 పరుగుల లక్ష్యాన్ని అఫ్గనిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ మహ్మద్ షెహజాద్ (2) నిరాశపరిచినా.. జనత్ (65 నాటౌట్, 129 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), రెహమత్ షా (76, 122 బంతుల్లో 13 ఫోర్లు) రెండో వికెట్కు 139 పరుగులు జోడించి గెలుపు లాంఛనం చేశారు. జనత్, షా అర్ధ సెంచరీలతో అఫ్ఘాన్ గెలుపు ఖాయం చేసుకున్నది. గెలుపు వాకిట రెహమత్ షా నిష్క్రమించినా, జనత్ చారిత్రక విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో కాస్త మెరుగై 288 పరుగులు సాధించింది. రెహమత్ షా (98) జోరుతో అఫ్ఘాన్ తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు చేసి ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టు విజయానికి భారత్కు 20 ఏండ్లు, న్యూజిలాండ్కు 25 ఏండ్లు, బంగ్లాదేశ్కు ఐదేండ్ల సమయం పట్టగా.. అఫ్గనిస్థాన్ రెండేండ్లు గడవకముందే ఐదు రోజుల ఆటలో గెలుపు రుచి చూసింది. రెహమత్ షా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. 1-0తో టెస్టు సిరీస్ అఫ్ఘనిస్థాన్ సొంతమైంది.