Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్
- టిఎస్జెఏ వార్షిక అవార్డులు ప్రదానం
నవతెలంగాణ-హైదరాబాద్ : సహచర షట్లర్ సింధుపై సాధికారిక విజయాలతో కామన్వెల్త్ క్రీడల స్వర్ణం సహా జాతీయ చాంపియన్గా నిలిచిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది మెగా అవార్డు కైవసం చేసుకున్నది. తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిఎస్జెఏ) వార్షిక అవార్డుల వేడుకలో సైనా నెహ్వాల్ ప్రతిష్టాత్మక ' స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారం అందుకున్నది. సైనా అనారోగ్యంతో ఉండగా, ఆమె తండ్రి హర్వీర్ సింగ్ సైనా తరఫున పురస్కారం అందుకున్నారు. పి.వి సింధు సీనియర్ మహిళల విభాగంలో, జి. హనుమ విహారి సీనియర్ మెన్స్ విభాగంలో బెస్ట్ స్పోర్ట్పర్సన్ అవార్డులు దక్కించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత మిక్స్డ్ జట్టుకు తొలి స్వర్ణం సహా ఎన్నో పతకాలు సాధించటంలో తెరవెనుక వ్యూహకర్త పుల్లెల గోపీచంద్ వరుసగా మూడో ఏడాదీ అత్యుత్తమ కోచ్ అవార్డు అందుకున్నాడు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్లు గోపీచంద్కు అవార్డు బహుకరించారు. ' ఆ సమయంలో దేశంలో నేను అత్యుత్తమ ఆటగాడిని. జూనియర్ నేషనల్స్ గెలుపొందాను. ఆ వెంటనే జాతీయ క్రీడల్లో మోకాలి గాయానికి గురయ్యాను. 1994, 1996, 1998లలో వరుసగా సర్జరీలు జరిగాయి. నా భవిష్యత్ ఎంటో అర్థమయ్యేది కాదు. డచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాను. ఒంటిరిగా ఉంటూ, మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో చైనా కోచ్ చెప్పిన మాటలు నా కెరీర్ను మార్చివేశాయి. ' ఇది నువ్వు ఎంత త్వరగా పతనం అయ్యావనేది కాదు, ఎంత వేగంగా పుంజుకోగలవే దానికి సంబంధించినది' అని' గాయాల పాలైనప్పుడు తన కెరీర్లో ఎదుర్కొన్న సంఘటలను గోపీచంద్ గుర్తు చేసుకున్నారు.