Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కశ్యప్ సైతం పరాజయం
- ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పి.వి సింధుకు చుక్కెదురైంది. చైనా సంచలనం, మూడో సీడ్ హీ బింగ్జియావ్ చేతిలో సింధు పరాజయం పాలైంది. రెండు గేముల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సింధు తన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో విఫలమైంది. సింధుపై పైచేయి సాధించిన బింగ్జియావ్ ఫైనల్లోకి ప్రవేశించింది. 21-23, 18-21తో సింధు ఫైనల్లో చోటు కోల్పోయింది. పురుషుల సింగిల్స్ టైటిల్ ఫేవరెట్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్లోకి చేరుకున్నాడు. హుయాంగ్ జియాంగ్ (చైనా)పై 16-21, 21-14, 21-19తో మూడు గేముల పోరాటంలో పైచేయి సాధించాడు. నేడు టైటిల్ ఫైట్లో డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్తో పోటీపడనున్నాడు.
ఆధిక్యంలో నిలిచినా.. : హీ బింగ్జియావ్తో సెమీఫైనల్స్ మ్యాచ్లో సింధు ఆధిక్యంలో నిలిచినా.. విజయం సాధించటంలో విఫలమైంది. తొలి గేమ్లో 6-4, 11-8తో విరామ సమయానికి సింధు ముందంజలో నిలిచింది. 19-13తో తొలి గేమ్ గెలుపు ముంగిట నిలిచిన సింధు.. ఇక్కడే మ్యాచ్ను కోల్పోయింది. వేగంగా పుంజుకున్న బింగ్జియావ్ సింధును వెంబడించింది. 20-20తో సమవుజ్జీగా నిలిచింది. 30 నిమిషాల పాటు సాగిన పోరులో 20-21 నుంచి వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్ సొంతం చేసుకున్నది. రెండో గేమ్లోనూ సింధు 11-9తో ముందంజ వేసింది. విరామం తర్వాత 14-11, 16-13తో ఆధిక్యంలో నిలిచింది. కానీ బింగ్జియావ్ వరుస పాయింట్లతో దూసుకొచ్చింది. సింధును 18-18 వద్ద నిలిపి, గేమ్ కొట్టేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చోటు సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ చెమటోడ్చాడు. 16-21తో తొలి గేమ్ కోల్పోయిన శ్రీకాంత్.. తర్వాతి రెండు గేములను గెల్చుకున్నాడు. మరో మ్యాచ్లో విక్టర్ అక్సెల్సన్ చేతిలో పారుపల్లి కశ్యప్ ఓటమి పాలయ్యాడు. 11-21, 18-21తో కశ్యప్ చేతులెత్తేశాడు. మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 12-21, 17-21తో ఇండోనేషియా జంట చేతిలో ఓడిపోయారు.