Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిపై అలవోక విజయం
- రాణించిన రాహుల్, గేల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పంజా విసిరింది. మూడు సార్లు చాంపియన్ ముంబయి ఇండియన్స్ను చిత్తుగా ఓడించింది. కెఎల్ రాహుల్ (71 నాటౌట్, 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ గేల్ (40, 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులతో ఛేదనలో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్కు పంజాబ్ చేతిలో ఓటమి గట్టి హెచ్చరిక!.
చండీగఢ్ : రాయల్స్ను మన్కడింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ ఘటనను మరిపించే దిశగా ఓ అడుగు ముందుకేసింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లోనే అలవోక విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన పంజాబ్, ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (71 నాటౌట్, 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో పంజాబ్ను దగ్గరుండి గెలిపించాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (40, 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), మాయాంక్ అగర్వాల్ (43, 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (60, 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ (32), హార్దిక్ పాండ్య (31), యువరాజ్ సింగ్ (18) ఫర్వాలేదనిపించారు. మయాంక్ అగర్వాల్ ' ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
పద్దతిగా కొట్టారు : ఛేదనలో పంజాబ్కు మెరుపు ఆరంభ లభించింది. ప్రమాదకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ (40) మెరుపు ఆరంభాన్ని అందించాడు. గేల్ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగాడు. గేల్ ధాటిగా పంజాబ్ వేగంగా పరుగులు రాబట్టుకున్నది. పాండ్య సోదరులు గేల్ను వెనక్కి పంపించినా, ముంబయి సమస్య తీరలేదు. మయాంక్ అగర్వాల్ (43) ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో దండెత్తిన మయాంక్ సమీకరణాలను మార్చివేశాడు. మరో ఎండ్లో కెఎల్ రాహుల్ ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు. వంద స్ట్రయిక్రేట్ కూడా లేని రాహుల్.. జిడ్డుగా ఆడాడు. కానీ ఆఖర్లో లయ అందిపుచ్చుకుని పరుగుల వేట మొదలెట్టాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్తో అర్ద సెంచరీ సాధించిన రాహుల్.. డెవిడ్ మిల్లర్ (15) జతగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లాంఛనాన్ని ముగించాడు. ముంబయిని స్వల్ప స్కోరుకు పరిమితం చేయటంలో ఛేదనలో పంజాబ్ ఒత్తిడిని తగ్గించిందని చెప్పవచ్చు!.
డికాక్ ఒక్కడే : టాస్ ఓడిన ముంబయి తొలుత బ్యాటింగ్కు వచ్చింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (32), క్వింటన్ డికాక్ (60) రాణించటంతో పవర్ ప్లేలో ముంబయి 58 పరుగులు సాధించింది. రోహిత్ ఐదు
5బౌండరీలు బాదగా, డికాక్ రెండు సిక్సర్లు సహా ఆరు ఫోర్లు కొట్టాడు. రోహిత్ ఎల్బీగా నిష్క్రమించగా ముంబయి స్కోరు నెమ్మదించింది.
ఓ ఎండ్లో డికాక్ నిలిచినా.. మరో ఎండ్లో దూకుడైన సహకారం కొరవడింది. సూర్యకుమార్ యాదవ్ (11), కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్య (10) నిరాశపరిచారు. యువరాజ్ సింగ్ (18) రెండు ఫోర్లతో మెరిసినా, అంచనాలను అందుకోలేదు. చివర్లో హార్దిక్ పాండ్య (31) మెరుపులతో ముంబయి గౌరవప్రద స్కోరు సాధించింది.