Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి టెస్టు చాంపియన్షిప్ గద కైవసం
దుబాయ్ : టీమ్ ఇండియా తీన్మార్. కోహ్లిసేన హ్యాట్రిక్ కొట్టేసింది. వరుసగా మూడోసారి ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ గదను సొంతం చేసుకున్నది. ఏప్రిల్ 1 నాటికి, 116 రేటింగ్ పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ వరల్డ్ నం.1గా నిలిచింది. ప్రపంచ నం.1 టీమ్ ఇండియా ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ గదతో పాటు రూ. 7 కోట్ల నగదు బహుమానం అందుకోనున్నది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ 1-2తో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ టూర్లోనూ 1-4తో టెస్టు సిరీస్ ఓడింది. స్వదేశంలో అఫ్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు, విండీస్పై 2-0 టెస్టు విజయాలు నమోదు చేసింది. ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాపై 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సాధించిన కోహ్లిసేన ఏడు దశాబ్దాల కలను సాకారం చేసింది. కంగారూ గడ్డపై కొత్త చరిత్ర లిఖించింది. ' ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ గదను తిరిగి సొంతం చేసుకోవటం గర్వకారణం. టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది. భారత జట్టు బలమైన వనరులు కల్గి ఉంది. ఈ ఏడాది ఆరంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్లో ఇది మాకు కలిసొస్తుందని నమ్ముతున్నాను' అని కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. 2018లో వరుసగా నాలుగు టెస్టు సిరీస్ విజయాలు సాధించిన న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై న్యూజిలాండ్ తిరుగులేని సిరీస్ విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లు టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.