Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిడిల్ ఓవర్లలో పరుగుల మోత
- వెటరన్ స్టార్స్ మెరుపులు
- స్వదేశీ ఆటగాళ్ల గుబాళింపు
-ఆసక్తికరంగా ఐపీఎల్ 12
ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కొత్తవి దూసుకొస్తూనే ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎన్నో ట్రెండ్స్కు నాంది పలికినా.. సీజన్ 12 ఆసక్తికర మార్పులకు వేదికవుతోంది. మిడిల్ ఓవర్లలో ధనాధన్, పనైపోయిందనుకున్న సీనియర్ల మెరుపులు సహా తొలిసారి ఐపీఎల్లో దేశవాళీ ఆటగాళ్ల ఆధిపత్యం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఐపీఎల్ తొలి వారం విశేషాలు.
నవతెలంగాణ క్రీడా విభాగం
పరిమిత ఓవర్ల క్రికెట్లో అభిమానులను విసిగెత్తించే ప్రధాన అంశం మిడిల్ ఓవర్లు. ఆరంభ ఓవర్లలో పవర్ ప్లే ఉండగా బ్యాట్స్మెన్ బౌండరీలపై కన్నేస్తారు. చివరి పది ఓవర్లలో పరుగుల వేటలో ధనాధన్ ఉండనే ఉంటుంది. కానీ మిడిల్ ఓవర్లలోనే ఇన్నింగ్స్ సాగు...తూ.. విసుగు తెప్పిస్తుంది. ఇది టీ20 ఫార్మాట్లోనూ చూస్తునే ఉన్నాం. అయితే, ఐపీఎల్ 12 మిడిల్ ఓవర్లకు ఓ మంచి ఉపాయం కనిపెట్టింది. 11 సీజన్లుగా ఐపీఎల్లో కనిపించిన కొత్త ట్రెండ్ ఈసారి అలరిస్తోంది. మార్చి 23-31 వరకు ఆడిన మ్యాచుల్లో మిడిల్ ఓవర్లలో పరుగుల వరద పారుతోంది. ఇదే సమయంలో ఆరంభ ఓవర్లలో పరుగుల వేటలో బ్యాట్స్మెన్ నెమ్మదించారు. పవర్ ప్లే ఓవర్లలో 2017, 2018లలో 8.03, 8.17గా ఉన్న రన్రేట్ 2019లో 7.47కు పరిమితమైంది. మిడిల్ ఓవర్లలో బాదుడు మొదలెట్టి, డెత్ ఓవర్ల సమయానికి విశ్వరూపం చూపించాలనే వ్యూహం అన్ని జట్లలోనూ కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల విజయ ఛేదన, ముంబయి ఇండియన్స్పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 177 పరుగుల ఛేదన సహా కోల్కత నైట్రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 186 ఛేదనను ఈ కోణంలో చూడవచ్చు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో మిడిల్ ఓవర్ల (7-16 ఓవర్లు)రన్రేట్ 8.05. 2013లో ఇది 7.35 కాగా, 2018లో 8.12. తాజా సీజన్లో ఇప్పటికే 8.79గా నమోదైంది. సీజన్ పూర్తయ్యేసరికి ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
మధ్యలోనే ఎందుకు? : సహజంగా మిడిల్ ఓవర్లలో వికెట్లను కాపాడుకుని, డెత్ ఓవర్ల సమయానికి ఎదురుదాడికి జట్లు సిద్దంగా ఉంటాయి. ఈ ఐపీఎల్లో జట్లు కొత్తగా ఆలోచించాయి. 7-16 ఓవర్లలో రన్రేట్ 8.50 మార్క్ను దాటివేయగా, ఈ ఓవర్లలో వికెట్ సగటు 35.77 కావటం విశేషం. గత సీజన్లో ఈ ఓవర్ల రన్రేట్ 7.90 కాగా, వికెట్ సగటు 28.17. ఈ సీజన్లో ఈ ఓవర్లలో ప్రతి 16 బంతులకు ఓ సిక్సర్ నమోదవుతుంది, గత సీజన్లో ఇది 19 బంతులుగా ఉండేది. మిడిల్ ఓవర్లలోనూ ప్రత్యేకించి 12-16 ఓవర్లలో రన్రేట్ షరవేగంగా పరుగులు పెడుతోంది. ఇందుకు కారణం, ఆసక్తికరంగా ఉన్నది. ప్రతి జట్టుకూ డెత్ ఓవర్లలో గొప్పగా బంతులేయగల బౌలర్లు ఉన్నారు. దీంతో చివరి నాలుగు ఓవర్లలో ఆశించిన పరుగులు చేయటం అంత సులువు కాదు. అలా కాకుండా, కాస్త బలహీన బౌలర్లు బంతి అందుకునే మిడిల్ ఓవర్లలో బ్యాట్ ఝులిపిస్తే పరుగుల మోత మోగించవచ్చని జట్ల ఆలోచన. అందుకే ఆరంభ ఓవర్లలో వికెట్ కాపాడుకుని, మధ్య ఓవర్లలో రెచ్చిపోతున్నారు. డెత్ ఓవర్ల సమయానికి విధ్వంసం పతాకస్థాయికి చేరుతోంది. ఈ సీజన్లో భారీ ఇన్నింగ్స్లు నమోదు చేసిన డెవిడ్ వార్నర్, క్రిస్ గేల్, పృథ్వీ షా, సంజు శాంసన్లు ఇదే ఫార్ములా అనుసరించారు. బ్యాట్స్మెన్ ఎంచుకున్న కొత్త మార్గానికి బౌలర్లు రానున్న మ్యాచుల్లో ఎలా తిప్పికొడతారో చూడాలి.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ : బంగారం ఎప్పటికీ బంగారమే. విలువ తగ్గదు, మారకం మారదు! క్రికెట్లోనూ స్టార్స్ ఎప్పటికీ స్టార్స్ అని వెటరన్లు నిరూపించారు. నాన్నల జట్టుగా ముద్రపడి, వీళ్లేం ఆడతారనే వెక్కిరింపులు చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ విజేతగా నిలిచింది. చెన్నై విజయగాథతో ఈసారి అన్ని ప్రాంఛైజీలు వెటరన్లను తుది జట్టులోకి తీసుకుంటున్నాయి. అన్ని జట్ల తరఫునా సీనియర్లు బాధ్యతాయుత పాత్ర పోషించటం విశేషం. ఎం.ఎస్ ధోని రాయల్స్పై వినోదభరిత ఇన్నింగ్స్తో చెలరేగాడు. సీజన్ ఆరంభ మ్యాచ్లో టర్బోనేటర్ హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లతో మాయ చేశాడు. కోహ్లి, డివిలియర్స్తో కూడిన బెంగళూర్ టాప్ ఆర్డర్ను కకావికలం చేశాడు. అసలు భజ్జీ తుది జట్టులో ఉండటంపై ఓ వైపు చర్చ సాగుతుండగా, అంతలోనే టర్బోనేటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన గావించాడు. ముంబయి ఇండియన్స్ తరఫున యువరాజ్ సింగ్ తొలి మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించాడు. బెంగళూర్పై చాహల్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. ఢిల్లీపై వాట్సన్ 26 బంతుల్లోనే 44 పరుగులు బాదగా, క్రిస్ గేల్ మూడు ఇన్నింగ్స్ల్లో 139 పరుగులు చేశాడు. ఇందులో పది సిక్సర్లు ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ : ఐపీఎల్తో దేశవాళీ క్రికెటర్లకు వెలకట్టలేని మేలు జరుగుతుందని ఎంత చెప్పినా, ఆ మాటతో విభేదించేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకు కారణం, నిజంగా భారత దేశవాళీ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు లభించకపోవటమే. ప్రతి జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో ఆడవచ్చు. అన్ని ప్రాంఛైజీలు వేలంలో విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసేవి, తుది జట్టులోకి కచ్చితంగా నలుగురిని ఎంచుకునేది. కానీ ఈ సీజన్లో కొంత మార్పు కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవటంలో రెండో ఆలోచనతో ఉన్నాయి. ఐపీఎల్ 11 సీజన్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లు లేకుండా (అంటే ముగ్గురు, లేదా ఇద్దరుతో ఆడటం) కేవలం 14 మ్యాచులే జరిగాయి. ఒక్క వారంలోనే 12వ సీజన్ మూడు మ్యాచులు ఆడేసింది. మున్ముందూ ఇది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే, దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభపై భరోసా ఉంచి ఎంపిక చేయటమా? లేక ద్వితీయార్థంలో విదేశీ ఆటగాళ్ల సేవలు అందుబాటులో ఉండవు కనుక, ఇప్పుడే స్వదేశీ యువకులకు అవకాశాలను ఇచ్చి పరీక్షించటమా? అనేది ప్రాంఛైజీలకే తెలియాలి.