Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక అన్ని బాధ్యతలు అతడిపైనే
- పాలకుల కమిటీ ఆలోచన
ముంబయి : భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరో గురుతర బాధ్యత స్వీకరించేందుకు సిద్ధమయ్యాడు. భారత సీనియర్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవి కాదనుకుని, అండర్-19, భారత-ఏ జట్ల క్రికెటర్లను సానపట్టేందుకు మొగ్గుచూపిన ద్రవిడ్ ఆ దిశగా విప్లవాత్మక ఫలితాలు రాబట్టాడు. అండర్-19, భారత్-ఎ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూనియర్ జట్టు నుంచి సీనియర్ జట్టుకు ప్రమోషన్లు సాధారణమైయ్యాయి. జాతీయ జట్టు అవసరాలను తీర్చగల క్రికెటర్లను తయారు చేసి రాహుల్ ద్రవిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఏకంగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ కోచింగ్ వ్యవస్థ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోకి రానున్నది. ఈ మేరకు బెంగళూర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యతలు ద్రవిడ్కు అప్పగించేందుకు పాలకుల కమిటీ (సీవోఏ) రంగం సిద్ధం చేసింది. అధికారికంగా ద్రవిడ్ హౌదాపై స్పష్టత ఇవ్వకపోయినా, ఆధునీకరించబోతున్న జాతీయ క్రికెట్ అకాడమీలో ఇక అంతా ద్రవిడ్ చూసుకుంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఎన్సీఏలో స్పెషలిస్ట్ కోచ్లు, ఇతర కేంద్రాల్లో జోనల్ కోచ్లు సహా ఫిజియోలు, ట్రైనర్లను నియమించే బాధ్యత ద్రవిడ్ తీసుకోనున్నట్టు తెలిసింది. ఆధునిక క్రికెట్కు అవసరమైన రీతిలో శిక్షణ తీరు, శిక్షణ కేంద్రాల నిర్వహణ మొత్తం ద్రవిడ్ చేతుల్లోకి వెళ్లనున్నది. ఈ పదవి కోసం పాలకుల కమిటీ ఓ ప్రకటన విడుదల చేసి, ఈ తర్వాత ద్రవిడ్ను ఎంపిక చేయనుందని సమాచారం. జూనియర్ జట్ల కోచ్గా అద్భుత విజయాలు సాధించిన రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ అవసరాలను తీర్చే జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఏం చేస్తారో చూడాలి.