Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీతో హైదరాబాద్ ఢీ నేడు
న్యూఢిల్లీ : సొంతగడ్డపై రెండు భారీ విజయాలు. ఓపెనింగ్ జోడీ హ్యాట్రిక్ సెంచరీ భాగస్వామ్యాల జోరు. సన్రైజర్స్ హైదరాబాద్పై నెగ్గాలంటే ప్రత్యర్థులు పటిష్టమైన వ్యూహంతో రావాల్సిందేనని ఆరెంజ్ ఆర్మీ చాటిచెప్పింది. టాప్ ఆర్డర్ బాధ్యతాయుత ప్రదర్శ, విజయానికి చేరువైన తరుణంలో అనూహ్య మలుపులు.. వెరసి ఓటమి!. ఇదీ ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న స్థితి. సులువుగా నెగ్గాల్సిన మ్యాచ్ను కోల్కతతో సూపర్ ఓవర్కూ తీసుకెళ్లినా, 8 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయి పంజాబ్ చేతిలో పరాభవం చవిచూసినా అది ఢిల్లీకే చెల్లింది. మెరుగైన ప్రదర్శన చేసినా లోయర్ ఆర్డర్ వైఫల్యంతో క్యాపిటల్స్ పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్కు సిసలైన పరీక్ష ఎదురు కాకపోయినా, టాప్ ఆర్డర్ షోతో హైదరాబాద్ అదిరే విజయాలు సాధిస్తోంది.
ఇప్పుడీ ఈ రెండు జట్లు ముఖాముఖి సిద్ధమవుతున్నాయి. నేడు ఫిరోజ్ షా కోట్లలో సన్రైజర్స్ తన నాల్గో మ్యాచ్ ఆడనున్నది.
వార్నర్ వర్సెస్ రబాడ : సఫారీ సీమర్ కగిసో రబాడను వార్నర్ ఎదుర్కొని ఏడాది గడిచింది. చివరగా తలపడిన కేప్టౌన్ టెస్టులో వార్నర్ను రెండు సార్లు అవుట్ చేశాడు రబాడ. మూడు మ్యాచుల్లో 254 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న వార్నర్కు నేడు కఠిన పరీక్ష ఎదురు కానున్నది. బెయిర్స్టోతో కలిసి భారీ భాగస్వామ్యాలు నిర్మిస్తున్న వార్నర్.. క్యాపిటల్స్తో మ్యాచ్లో పవర్ప్లేలోనే వికెట్ కోల్పోతే హైదరాబాద్ ఏం చేస్తుందనేది ఆసక్తికరం. గాయపడిన విలియమ్సన్ లేని మిడిల్ ఆర్డర్ పేలవంగా ఉంది. మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, విజరు శంకర్లు అసలు పరీక్ష ఎదుర్కొలేదు. పవర్ ప్లేలోనే బ్యాటింగ్కు రావాల్సి వస్తే, మిడిల్ ఆర్డర్ ఏం చేస్తుందనేది చూడాలి.
డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ ఫామ్ సన్రైజర్స్కు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. అనూహ్య పతనంతో చేతిలోకి వచ్చిన విజయాన్ని వదిలేసిన ఢిల్లీ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. హైదరాబాద్ను వీడి ఢిల్లీకి చేరిన శిఖర్ ధావన్ తన పాత జట్టుపై ఏ విధంగా ఆడతాడో చూడాలి. పృథ్వీ షా, రిషబ్ పంత్లు మెరుగైన ప్రదర్శన చేసినా.. వారి నిష్క్రమణ వెంటనే ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది. లోయర్ ఆర్డర్పై ఆధారపడకుండా, చివరి వరకూ క్రీజులో నిలబడి ముగించటమే ఢిల్లీ ముందున్న ప్రథమ కర్తవ్యం!.