Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్, ఇంటర్నేషనల్
- ఉమెన్ జట్ల మిక్స్డ్ పోరు
బెంగళూర్ : జాతీయ జట్టులో కలిసి ఆడిన సహచర క్రికెటర్లతో ముఖాముఖి పోరు అనగానే పుష్కర కాలం కిందట అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. సచిన్ వర్సెస్ గంగూలీ, ద్రవిడ్ వర్సెస్ లక్ష్మణ్, యువరాజ్ వర్సెస్ ధోని పోరాటాలు క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించాయి. 12 ఏండ్ల తర్వాత ఆధునిక క్రికెట్లో మరో విప్లవాత్మక మార్పు!. మిక్స్డ్ జట్టు పోటీ ఎరుగని క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు సిద్ధమవుతోంది. మహిళల జట్టు సూపర్స్టార్ మిథాలీ రాజ్, మెన్స్ జట్టు సూపర్స్టార్ విరాట్ కోహ్లిలు ఒకే మ్యాచ్లో ముఖాముఖి తలపడనున్నారు. ఈ సీజన్లోనే ఆ ఆసక్తికర మ్యాచ్ అభిమానుల ముందుకు రానున్నది. మిక్స్డ్ జెండర్ మ్యాచ్లో విరాట్ కోహ్లి సహా హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, మిథాలీరాజ్లు పాల్గొననున్నారు. 'సవాల్ స్వీకరించు' నినాదంతో లింగ పరమైన స్థిర అభిప్రాయాలను బద్దలు కొట్టేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ను నిర్వహించనున్నది. రాయల్ చాలెంజ్ స్పోర్ట్స్ డ్రింక్ ఆవిష్కరణ సందర్బంగా ఆర్సీబీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ప్రకటించింది. ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక, తేది వివరాలు త్వరలో ప్రకటిస్తారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ క్రికెటర్లు, భారత స్టార్ మహిళా క్రికెటర్లు సహా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు ఈ మ్యాచ్లో పాల్గొననున్నారు. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్ నిర్వహణకు ఆర్సీబీ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది!. ' మహిళలైనా, పురుషులైనా క్రికెట్ ఒకటే ఆట. లింగ పరమైన భిన్న అభిప్రాయాలతో ఉన్న అభిమానులను ఆ గోడలు బద్దలు కొట్టాలని కోరుతున్నా. క్రీడల్లో సమానత్వం, అంతిమంగా జీవితంలో సమానత్వానికి ప్రతిబింబం. మెరుగైన భవిష్యత్ కోసం లింగ బేధాలతో కూడిన గోడలను కూల్చుదాం అని నినదించాలి' అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. 'ఇటీవల కాలంలో మహిళల క్రికెట్ ఎంతో పురోగతి సాధించింది. అభిమానుల ఆదరణ, గౌరవం సంపాదించింది. కానీ ప్లేయింగ్ ఫీల్డ్ ఒకటిగా లేదు. అవకాశాలు, వేతనాలు, ప్రచారం, అభిమానుల మద్దతు విషయంలో నిజమైన భేదం కనిపిస్తోంది' అని మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. ' మెన్స్, ఉమెన్స్ క్రికెట్ ఒకటి కాదని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే మైదానంలో మేం మెన్స్ తరహా సవాళ్లను స్వీకరించటం లేదని వారి భావన. అటువంటి అభిమానులకు నాదో విన్నపం. 150 కిమి వేగంతో దూసుకొచ్చే బంతిని చూసి భయపడను, పెద్ద బౌండరీల స్టేడియాన్ని చూసి ఆందోళన చెందను' హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొన్నది. మిక్స్డ్ జెండర్ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ప్రథమం కానున్నది.