Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రి ముంబయిలో, ఉదయం కొలంబోలో మెరుపు ప్రదర్శన
కొలంబో : బుధవారం రాత్రి ముంబయి వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో ఐపీఎల్ లీగ్ మ్యాచ్. ముంబయి తరఫున యార్కర్ల కింగ్ లసిత్ మలింగ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభ ఓవర్లలో ధోని జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. సీన్ కట్ చేస్తే, గురువారం ఉదయం శ్రీలంక సూపర్ ప్రావిన్సియల్ వన్డే టోర్నమెంట్. క్యాండీతో గాలె పోరు. గాలె తరఫున బరిలోకి దిగిన మలింగ ఏడు వికెట్లు కూల్చి జట్టును విజయ పథాన నడిపించాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రెండు మ్యాచుల్లో పాల్గొన్న మలింగ.. క్రికెట్ పట్ల తన అంకితభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. చెన్నైతో మ్యాచ్ ముగిసిన అనంతరం కొలంబో బయల్దేరిన మలింగ తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వదేశానికి చేరుకున్నాడు. స్వల్పకాలిక విశ్రాంతితో మలింగ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడమే కాదు పది ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు కూల్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గాలె 50 ఓవర్లలో 255 పరుగులు చేసింది. సీమర్ మలింగ (7/49) దెబ్బకు క్యాండీ 99 పరుగులకే కుప్పకూలింది. 2019 ప్రపంచకప్లో శ్రీలంక కెప్టెన్సీ రేసులో ముందున్న లసిత్ మలింగ.. ఏప్రిల్ 11న ఈ లీగ్ ముగిసిన తర్వాత ఐపీఎల్కు తిరిగి రానున్నాడు.