Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పంజాబ్పై ధోనీజట్టు గెలుపు
-రాహుల్, సర్ఫరాజ్ శ్రమ వృథా
-మెరిసిన టర్బోనేటర్ భజ్జీవాంఖడేలో ముంబయి చేతిలో భంగపడిన చెన్నై సూపర్ కింగ్స్, సొంతగడ్డపై తిరిగి గెలుపు బాటలోకి వచ్చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై 22 పరుగులతో గెలుపొందిన ధోనీ జట్టు ఐపీఎల్12లో నాల్గో విజయం నమోదు చేసింది. తొలుత చెన్నై 160/3 పరుగులు చేయగా, ఛేదనలో పంజాబ్ 138/5 పరుగులకే పరిమితమైంది. టర్బోనేటర్ హర్భజన్ సింగ్ (2/17) విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చెన్నై : వరుస విజయాలకు వాంఖడేలో బ్రేక్ పడింది. స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో సేవలు దూరం. ఈ పరిస్థితుల్లో చెపాక్లో సూపర్ కింగ్స్ ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అభిమానుల విశేష మద్దతు నడుమ ధోనీ జట్టు మరోసారి చెలరేగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై అలవోక విజయం సాధించింది. ఛేదనలో పంజాబ్ను 138 పరుగులకే కట్టడి చేసి 22 పరుగులతో గెలుపొందింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (55, 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (67, 59 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనూహ్యంగా డెత్ ఓవర్లలో స్పిన్ అస్త్రాన్ని సంధించిన ధోని సత్ఫలితాన్ని రాబట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ డుప్లెసిస్ (54, 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీకి తోడు ఎం.ఎస్ ధోని (37 నాటౌట్, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (21 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఐపీఎల్12లో చెన్నై సూపర్ కింగ్స్కు ఇది నాల్గో విజయం. ప్రమాదకర క్రిస్ గేల్ (5), మయాంక్ అగర్వాల్ (0) వికెట్లు కూల్చిన హర్భజన్ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో భజ్జీకి ఇది రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన కావటం విశేషం.
రాహుల్, ఖాన్ మెరిసినా.. : నెమ్మదిగా స్పందించే చెపాక్ పిచ్పై 161 పరుగుల ఛేదన కష్టమే. కానీ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (5) జట్టులో ఉండటంతో పంజాబ్ గెలుపుపై దీమాగా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే హర్భజన్ సింగ్ పంజాబ్ వెన్ను విరిచాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. గేల్ వికెట్ల వెనకాల దొరికిపోగా, డుప్లెసిస్ చేతికి అగర్వాల్ చిక్కాడు. 7/2తో పంజాబ్ ఒత్తిడిలో పడింది. ఈ దశలో మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (55), సర్ఫరాజ్ ఖాన్ (67) అద్భుత పోరాటం చేశారు. మూడో వికెట్కు 93 బంతుల్లో 110 పరుగులు జోడించారు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 బంతుల్లో సర్ఫరాజ్ ఖాన్ అర్ధ సెంచరీ సాధించగా.. మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాది 41 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. యువ ఆటగాడు సర్ఫరాజ్ భారీ షాట్లతో ప్రమాదకరంగా తయారయ్యాడు. ఛేదనలో విధ్వంసక ముగింపుకు రంగం సిద్ధం చేసిన ఈ జోడీ.. చివరి వరకూ వికెట్ కాపాడుకోలేదు. ఈ ఇద్దరి నిష్క్రమణతో పంజాబ్ ఛేదన కుంటుపడింది. డెవిడ్ మిల్లర్ (6) విఫలమయ్యాడు. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నా.. పంజాబ్ ధనాధన్కు వెళ్లలేదు. నిర్ణీత ఓవర్లలో 138 పరుగులకే పరిమితమైంది.
డుప్లెసిస్ అర్ధ సెంచరీ : ఐపీఎల్12 తొలి మ్యాచ్లోనే డుప్లెసిస్ (54, 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. షేన్ వాట్సన్ (26)తో కలిసి తొలి వికెట్కు 56 పరుగులు జోడించిన డుప్లెసిస్ చెన్నైని భారీ స్కోరు దిశగా నడిపించాడు. రెండు ఫోర్లు, నాల్గు సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించాడు. పంజాబ్ కెప్టెన్ అశ్విన్ (3/23) మూడు వికెట్లతో మెరిసినా.. చెన్నై పరుగుల జోరు తగ్గలేదు. సురేశ్ రైనా (17) ఇబ్బంది పడుతూనే అశ్విన్కు వికెట్ కోల్పోయాడు. వాట్సన్, డుప్లెసిస్లను సైతం అశ్వినే వెనక్కి పంపించాడు. ఎం.ఎస్ ధోని (37 నాటౌట్, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (21 నాటౌట్, 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) స్లాగ్ ఓవర్లలో దూకుడుగా ఆడారు. దీంతో చెన్నై స్లో ట్రాక్పై భారీ స్కోరు నమోదు చేసింది.
స్కోరు వివరాలు :
చెన్నై ఇన్నింగ్స్ : వాట్సన్ (సి) కరన్ (బి) అశ్విన్ 26, డుప్లెసిస్ (సి) మిల్లర్ (బి) అశ్విన్ 54, రైనా (బి) అశ్విన్ 17, ధోని నాటౌట్ 37, రాయుడు నాటౌట్ 21, ఎక్స్ట్రాలు : 05, మొత్తం :(20 ఓవర్లలో 3 వికెట్లకు) 160.
వికెట్ల పతనం : 1-56, 2-100, 3-100.
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-41-0, అశ్విన్ 4-0-23-3, కరన్ 4-0-35-0, టై 4-0-38-0, మురుగన్ 4-0-23-0.
పంజాబ్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) జడేజా (బి) స్కాట్ 55, గేల్ (సి) ధోని (బి) హర్భజన్ 5, అగర్వాల్ (సి) డుప్లెసిస్ (బి) హర్భజన్ 0, సర్ఫరాజ్ (సి) డుప్లెసిస్ (బి) స్కాట్ 67, మిల్లర్ (బి) చాహర్ 6, మన్దీప్ నాటౌట్ 1, కరన్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 04, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 138.
వికెట్ల పతనం : 1-7, 2-7, 3-117, 4-135, 5-137.
బౌలింగ్ : చాహర్ 4-0-40-1, హర్భజన్ సింగ్ 4-1-17-2, స్కాట్ 4-0-37-2, జడేజా 4-0-24-0, తాహీర్ 4-0-20-0.