Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్, చెన్నైలో ప్లే ఆఫ్స్ నేడు సీఓఏ సమావేశం
న్యూఢిల్లీ : ఐపీఎల్12 టైటిల్ పోరుకు ముంబయి వాంఖడే ఆతిథ్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ సొంత నగరంలో ఆరంభ, ముగింపు మ్యాచులు నిర్వహించాలి. సీజన్ ఆరంభ మ్యాచ్లో గత సీజన్ ఫైనలిస్ట్లు తలపడాలి. 2018 ఫైనలిస్ట్లు చెన్నై, హైదరాబాద్ కాగా.. తొలి మ్యాచ్లో చెన్నైతో బెంగళూర్ తలపడింది. చెన్నై చెపాక్ స్టేడియం మూడు స్టాండ్స్కు సంబంధించి నిషేధం ఎదుర్కొంటుంది. ఈ విషయం ఇప్పట్లో తేలేలా కనిపించటం లేదు. టైటిల్ పోరుకు చెన్నై కాకుండా, ముంబయిని ఎంచుకునేందుకు సీఓఏ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ప్లే ఆఫ్స్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచులను చెన్నై, హైదరాబాద్లలో నిర్వహించి.. తుది పోరును ముంబయికి తరలించటంపై నేడు పాలకుల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటీఎం ఒప్పందం త్వరలో ముగియనున్నది. కొత్త కాంట్రాక్టుకు టెండర్లు ఆహ్వానించటంపై సైతం కమిటీ చర్చించనున్నది. పాలకుల కమిటీ సభ్యులతో పాటు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు సి.కె ఖన్నా, అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరిలు సోమవారం నాటి సమావేశానికి హాజరు కానున్నారు.