Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన విజయ్, హుడా
- హైదరాబాద్ 150/4
మొహాలి : చివరి మ్యాచుల్లో ఓటములు చవిచూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్లు మొహాలిలో విజయం కోసం పోరాడుతున్నాయి. బ్యాటింగ్ పిచ్గా భావించినా, హైదరాబాద్ను పంజాబ్ బౌలర్లు స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. తొలి పది ఓవర్లో 50 పరుగులే చేసిన హైదరాబాద్, చివరి పది ఓవర్లలో 100 పరుగులు చేసి మ్యాచ్పై ఆశలు నిలుపుకున్నది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అశ్విన్ సేన.. ప్రమాదకర సన్రైజర్స్కు ధనాధన్ అవకాశం ఇవ్వలేదు. డెవిడ్ వార్నర్ (70 నాటౌట్, 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో మెరిశాడు. విజయ్ శంకర్ (26, 27 బంతుల్లో 2 ఫోర్లు), దీపక్ హుడా (14 నాటౌట్, 3 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో ముజీబ్ రెహమాన్, మహ్మద్ షమి చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ (16, 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ను కోల్పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 43/1తో కొనసాగుతోంది. కెఎల్ రాహుల్ (11), మయాంక్ అగర్వాల్ (16) ఆడుతున్నారు.
వార్నర్ ఆపద్బాందవుడు : తొలి మూడు మ్యాచుల్లో సెంచరీ భాగస్వామ్యం అందించిన ఓపెనర్లు డెవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టోలు..చివరి మూడు మ్యాచుల్లో నిరాశపరిచారు!. పస లేని మిడిల్ ఆర్డర్ కలిగిన సన్రైజర్స్ ప్రధానంగా బలమైన ఓపెనర్లపైనే ఆధారపడింది. పంజాబ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జానీ బెయిర్స్టో (1)ను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. ఆరు బంతులెదుర్కొన్న బెయిర్స్టో.. స్పిన్నర్ ముజీబ్కు వికెట్ కోల్పోయాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వార్నర్కు జత కలిసిన విజరు శంకర్ (26) ఆచితూచి ఆడాడు. పంజాబ్ బౌలర్లు మెరుగ్గా బంతులేస్తోన్న వేళ ఒక్కో పరుగే జత చేశాడు. వార్నర్, విజరులు పది ఓవర్లలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో చివరి పది ఓవర్లలో హైదరాబాద్ దూకుడుగా ఆడేందుకు అవకాశం దొరికింది. 49 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన వార్నర్.. తర్వాత వేగం పెంచాడు. ఐపీఎల్లో వార్నర్కు ఇదే నెమ్మదైన ఫిఫ్టీ కావటం గమనార్హం. శంకర్, మహ్మద్ నబి (12) అవుటైనా.. మనీశ్ పాండే (19) తోడుగా వార్నర్ రెచ్చిపోయాడు. చివర్లో దీపక్హుడా (14) మూడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో సన్రైజర్స్ను 150 మార్క్కు చేర్చాడు. వార్నర్ ఉండగా 11-20 ఓవర్లలో పది రన్రేట్తో పరుగులు చేసింది.